logo

అటకెక్కిన భూసార పరీక్షలు

భూసారంపైనే పంట దిగుబడి ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అధిక రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో నేల సహజ స్వభావం కోల్పోతుంది.

Published : 31 Mar 2023 04:38 IST

గణపవరం, ఉంగుటూరు, న్యూస్‌టుడే: భూసారంపైనే పంట దిగుబడి ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అధిక రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో నేల సహజ స్వభావం కోల్పోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు భూసార పరీక్షలు తోడ్పడతాయి. భూమిలో వివిధ మూలకాల పరిమాణం, ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్‌ లోపాన్ని వీటిద్వారా తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా ఏ రకం పంట వేసుకోవచ్చో నిర్ధరించవచ్చు. ఇంతటి కీలకమైన ఈ పరీక్షలను రెండేళ్లుగా నిర్వహించడం లేదు. ఫలితంగా రైతులకు సరైన మార్గదర్శనం ఉండటం లేదు. ఈ ప్రభావం పంట దిగుబడులపై పడుతోంది.

గత ప్రభుత్వ హయాంలో ఏటా భూసార పరీక్షలు నిర్వహించి ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేవారు. తద్వారా ఇష్టానురీతిగా కాకుండా అవసరం మేరకే ఎరువులు వినియోగించేందుకు వీలుండేది. పెట్టుబడి ఖర్చులు తగ్గేవి. 2019లో పైలట్‌ ప్రాజెక్టు కింద ఉమ్మడి జిల్లాలో మండలానికి ఓ గ్రామం చొప్పున, 2020లో రైతు భరోసా కేంద్రం పరిధిలో 20 నమూనాల చొప్పున సేకరించి పరీక్షలు చేశారు. కానీ రెండేళ్ల నుంచి వీటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో తాడేపల్లిగూడెంలో భూసార పరీక్ష కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో పనిచేసే సిబ్బందిని ఇతర విభాగాలకు డిప్యుటేషన్లపై బదిలీ చేయడంతో కార్యకలాపాలు మందగించాయి. ఈ ఏడాదైనా భూసార పరీక్షలు చేపడతారా లేదా అనేది ప్రశ్నార్థకమే.

పెట్టుబడి పెరిగింది.. ‘పదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. గతంలో భూసార పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించేవారు. ఆ ఫలితాలకు అనుగుణంగా ఎరువులు కొనుగోలు చేసేవాడిని. ప్రస్తుతం వాటిని నిలిపివేయడంతో ఎరువులను అధికంగా వినియోగించాల్సి వస్తోంది. ఫలితంగా పెట్టుబడి పెరగడంతో పాటు భూసారం దెబ్బతింటోంది’ అని ముప్పర్తిపాడుకు చెందిన కౌలురైతు కరుణానిధి తెలిపారు.

జూన్‌ నుంచి మొదలుపెడతాం.. ‘భూసార పరీక్షలు రెండేళ్లుగా నిర్వహించడం లేదు. ఆర్‌బీకేల ద్వారా జూన్‌ నుంచి వీటిని ప్రారంభిస్తాం. ఇందుకు అవసరమైన కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం’ అని భీమడోలు సబ్‌ డివిజన్‌ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు సీహెచ్‌ ఉషారాజకుమారి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని