logo

తప్పించుకోబోయి.. గేటును ఢీకొట్టి..

భీమడోలు రైల్వే గేటు వద్ద గురువారం తెల్లవారుజామున ఓ వ్యాన్‌ను సికింద్రాబాద్‌- విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్న సంఘటనకు దొంగల దుశ్చర్యే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Updated : 31 Mar 2023 05:52 IST

ప్రమాదానికి కారణమైన దుండగులు
వ్యాన్‌ను ఢీకొన్న దురంతో

భీమడోలు స్టేషన్‌ వద్ద నిలిచిన రైళ్లు

భీమడోలు, ఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడే: భీమడోలు రైల్వే గేటు వద్ద గురువారం తెల్లవారుజామున ఓ వ్యాన్‌ను సికింద్రాబాద్‌- విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్న సంఘటనకు దొంగల దుశ్చర్యే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 16వ జాతీయ రహదారిపై ఓ వ్యాన్‌లో (బొలెరో) అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గేదెల దొంగలుగా భావించి నల్లజర్ల ప్రాంతంలో స్థానికులు ఆపారు. వారికి సరైన సమాధానం చెప్పకుండా వేగంగా ముందుకు వెళ్లిపోయారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసు సిబ్బందికి చెప్పారు. వారు వాహనాన్ని వెంబడించారు. ఈ క్రమంలో గుండుగొలను వద్ద పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీసులు తమను పట్టుకుంటారని భావించిన దుండగులు వాహనాన్ని తాడేపల్లిగూడెం వైపునకు మళ్లించారు. అప్పటికే మూసి ఉన్న భీమడోలు రైల్వే గేటును దాటేందుకు విఫల యత్నం చేశారు. ఈ క్రమంలో వాహనం పట్టాలపై నిలిచిపోయింది. పోలీసులు దిగి వారిని పట్టుకునేలోగా రైలు వచ్చి వాహనాన్ని ఢీకొట్టడం, నిందితులు పరారవడం చకచకా జరిగిపోయాయి. వాహనాన్ని రైలు చేబ్రోలు రైల్వే స్టేషన్‌ సమీపం వరకు ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. రైలు పట్టాలు తప్పకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

పశువుల దొంగలేనా..?

వాహనంలో ఇద్దరు లేక ముగ్గురు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే గేట్‌మ్యాన్‌ మాత్రం వాహనం దిగి పారిపోతున్న డ్రైవర్‌ను మాత్రమే చూసినట్లు చెబుతున్నారు. వ్యాన్‌ ట్రక్‌లో గడ్డి పరిచి ఉండటంతో గొర్రెలు, పశువుల దొంగలై ఉంటారని భావిస్తున్నారు. వాహనం నంబరు నకిలీదని, అది ఒక స్కూలు బస్సు పేరిట ఉన్నట్లు గుర్తించామని, ఘటనపై మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు భీమడోలు సీఐ వి.వెంకటేశ్వరరావు, ఎస్సై చావా సురేష్‌ తెలిపారు.

మరమ్మతుల అనంతరం మధ్యాహ్నం తెరుచుకున్న గేటు

ఇంజిన్‌ ధ్వంసం!

ఈ ఘటనలో రైలు ఇంజిన్‌ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. కొన్ని కీలక పరికరాలు ఊడిపడ్డాయి.  రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు రైల్వే శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. గేటు విరిగిపోవడంతో సిగ్నలింగ్‌ వ్యవస్థ మొరాయించింది. రైల్వే శాఖ సెక్యూరిటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ చౌహాన్‌, ఆర్పీఎఫ్‌ సీఐ సైదయ్య, ఎస్‌ఐ ధనుష్‌ ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు.

ప్రయాణికుల పాట్లు

రైలు ఏడు గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గాఢనిద్రలో ఉన్న వారు రైలు ఎందుకు నిలిచిందో తెలియక అయోమయానికి గురయ్యారు.

పెద్ద కుదుపు వచ్చింది.. ‘గుంటూరులో రైలు ఎక్కాను. రాత్రి 2.30 గంటల సమయంలో  పెద్ద కుదుపు వచ్చి రైలు ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక ఆందోళనకు గురయ్యాను’ అని ప్రయాణికుడు అనిల్‌ తెలిపారు.

ఏం జరిగిందో తెలియలేదు.. ‘హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్నా. భీమడోలు వద్ద రైలు ఆగిపోయింది. తెల్లారే వరకు రైలు ఎందుకు ఆగిందో తెలియలేదు. గంటలపాటు ఆగిపోవడంతో చిన్నపిల్లలతో ఉన్న ప్రయాణికులు, వృద్ధులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది’ అని ప్రయాణికుడు శ్రీనివాస్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని