logo

మందులిప్పించండి బాబోయ్‌!

మొండి డీఆర్‌టీబీ (ఔషధాలను తట్టుకునే పరివర్తనం చెందిన క్షయ) వ్యాధి సోకిన రోగులు పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 35 మంది, ఏలూరు జిల్లాలో 45 మంది ఉన్నారు.

Updated : 31 Mar 2023 06:02 IST

క్షయ రోగుల ఆందోళన

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే

మొండి డీఆర్‌టీబీ (ఔషధాలను తట్టుకునే పరివర్తనం చెందిన క్షయ) వ్యాధి సోకిన రోగులు పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 35 మంది, ఏలూరు జిల్లాలో 45 మంది ఉన్నారు. నెల రోజులుగా వీరికి అందించాల్సిన పలు రకాల ఔషధాలకు కొరత ఏర్పడింది. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం క్షయ వ్యాధి నివారణ విభాగం ద్వారా ప్రాంతీయ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తోంది. వ్యాధిగ్రస్థులకు మందులు ఉచితంగా అందజేయడంతో పాటు ప్రతి నెలా పౌష్టికాహార ఖర్చులకు రూ.500 చెల్లిస్తోంది.

జిల్లాలో తీర ప్రాంత గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి డీఆర్‌టీబీ సోకినట్లు అధికారులు రెండు నెలల కిందట నిర్ధారించారు. ఫిబ్రవరి నెలలో పూర్తిస్థాయిలో ఔషధాలు అందించారు. మార్చి నెలలో రోజూ వినియోగించాల్సిన ఐదు రకాల మందుల్లో రెండు రకాలే ఉన్నాయని నరసాపురం ఏరియా ఆసుపత్రిలో అందించారు. అధికారులు ఈ నెల 20న మరో రకం ఔషధం వచ్చిందని సమాచారం తెలియజేసి ఇచ్చారు. మరో రెండు రకాలు నేటికీ అందలేదు.

నెల రోజులుగా..

డీఆర్‌టీబీ సోకిన వ్యక్తులు పూర్తిగా నయమయ్యే వరకు నిరంతరాయంగా మందులు వాడాల్సి ఉంటుంది. కొంతకాలం వినియోగించిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే రోగి శరీరంలోని క్రిములు ఆ ఔషధాలను కూడా తట్టుకునే సామర్థ్యం పొందుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఇది సోకిన వ్యక్తులపై ఆరోగ్య శాఖాధికారులు నిరంతరం నిఘా ఉంచడంతోపాటు ఉచితంగా మందులు అందిస్తున్నారు. ప్రైవేటు ఔషధ దుకాణాల్లో వీటి విక్రయాలు నిర్వహించకుండా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు కట్టడి చేశారు. డీఆర్‌టీబీకి ఐదు రకాల మందులు వినియోగిస్తారు. వాటిలో రెండు రకాలను మార్చి నెలలో రోగులకు అందించారు. ఒక రకం 20 రోజుల అనంతరం ఇటీవల సరఫరా చేశారు. పైరజినమైడ్‌, రిఫాంపిసిన్‌ మందులు సరఫరా నెల రోజులుగా లేదు. ఈకారణంగా వ్యాధిగ్రస్థుల కుటుంబాల వారు ఆందోళన చెందుతున్నారు.

పౌష్టికాహారానికి..

క్షయ సోకిన వ్యక్తులు రోజురోజుకు శారీరకంగా బలహీనపడుతుంటారు. దీని నివారణకు బలవర్థక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా  నెలకు రూ.500 చొప్పున అందిస్తున్నారు. ఆ నిధులూ రెండు నెలలుగా విడుదల కావడం లేదు.

వెంటనే అందిస్తాం

ఔషధాలు గుంటూరు నుంచి తీసుకురావాల్సి ఉంది. అన్ని రకాలు ఏలూరు చేరుకున్నాయి. అక్కడి నుంచి భీమవరం తీసుకొచ్చి వెంటనే ఏరియా ఆసుపత్రులకు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. చెల్లించే నగదు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు.

 భానునాయక్‌, అదనపు డీఎంహెచ్‌వో, భీమవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని