logo

రైతులకు సేవలందించేదెప్పటికో..!

నకిలీ విత్తనాలు, పురుగు మందుల వాడకంతో ఏటా రైతులు పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీనికి చెక్‌ పెట్టే దిశగా ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గ స్థాయి సమీకృత వ్యవసాయ, ఆక్వా ప్రయోగశాలలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.

Published : 01 Apr 2023 06:09 IST

పూర్తి కాని సమీకృత వ్యవసాయ, ఆక్వా ప్రయోగశాలల భవనాలు
పెనుమంట్ర, నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే

నరసాపురంలో అసంపూర్తిగా ప్రయోగశాల భవనం

నకిలీ విత్తనాలు, పురుగు మందుల వాడకంతో ఏటా రైతులు పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీనికి చెక్‌ పెట్టే దిశగా ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గ స్థాయి సమీకృత వ్యవసాయ, ఆక్వా ప్రయోగశాలలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఏళ్లు గడిచిపోతున్నా ఇంకా పలుచోట్ల నిర్మాణాలు పూర్తికాలేదు. ఫలితంగా భూసార ఫలితాలు, విత్తన నాణ్యత, ఎరువులు, పురుగు మందులు, మేత, నీటి పరీక్షల కోసం రైతులు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందుకోసం భారీగా వెచ్చించాల్సి వస్తోందని కర్షకులు వాపోతున్నారు.

ఇదీ పరిస్థితి...

జిల్లాలో తాడేపల్లిగూడెం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఈ ప్రయోగశాలలు మంజూరయ్యాయి. తాడేపల్లిగూడెంలో ఇప్పటికే పరీక్ష కేంద్రం నడుస్తోంది. ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. 2020లో అప్పటి పశు, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ నరసాపురంలో, చెరుకువాడ శ్రీరంగనాథరాజు నెగ్గిపూడి(మార్టేరు)లో ఈ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రెండేళ్లు దాటినా ఈ భవనాలు పూర్తి కాలేదు. బిల్లులు సకాలంలో మంజూరు కాక పనుల నిలిపివేశారు. ఇంకా విద్యుత్తు పనులు, సామగ్రి ఏర్పాటు చేయాల్సి ఉంది. పాలకొల్లులో పనులు పూర్తయినా వినియోగంలోకి తీసుకురావడం లేదు. ఇతర నియోజక వర్గాల్లోనూ నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రయోగశాల విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మార్టేరు ఏడీఏ ప్రసాద్‌ తెలిపారు. 

ప్రయోజనాలు ఇలా...

* విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యత విషయంలో రైతులకు ఏ మాత్రం అనుమానాలు ఉన్నా ఇక్కడ పరీక్ష చేయించుకుని నివేదిక పొందవచ్చు.
* సాగులో కీలకమైన విత్తన పరీక్షల ద్వారా వాటి నాణ్యత, విత్తనం ద్వారా వచ్చే చీడపీడల గురించి  తెలుసుకోవచ్చు.
* ఈ ప్రయోగశాలలో భూసార పరీక్షలు చేయించుకుని ఫలితాల ఆధారంగా పంట మార్పిడి చేసుకొవచ్చు.
* ఆక్వా సాగుకు సంబంధించి సీడ్‌ విషయంలో పరీక్షలు చేయించుకోవచ్చు.
* వ్యాపారుల మోసాలకు చెక్‌ పెట్టవచ్చు. నకిలీలతో మోసం చేస్తే ఈ ప్రయోగశాల నివేదిక ఆధారంగా సదరు వ్యాపారి, కంపెనీ నుంచి నష్ట పరిహారం పొందే అవకాశం కలుగుతుంది.

అందుబాటులోకి వస్తేనే...

నాబార్డు ఆర్‌ఐటీఎఫ్‌ నిధులతో చేపట్టిన ఈ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థకు అప్పగించారు. ఒక్కో భవనానికి సుమారు 80 లక్షల మేర నిధులు మంజూరు చేశారు. ఈ ప్రయోగశాలలు అందుబాటులోకి వస్తే జిల్లాలో సుమారు 70 వేల మంది రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేకూరనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని