logo

వేతనాలు ఇవ్వకుంటే బతికేదెలా?

ఆరు వారాలుగా ఉపాధి హామీ పనులు చేస్తున్నా ఇంతవరకూ వేతనాలు చెల్లించడం లేదంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 02 Jun 2023 04:13 IST

ఉపాధి హామీ కూలీల ఆందోళన

కొప్పాక పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఉపాధి కూలీలు

పెదవేగి, న్యూస్‌టుడే: ఆరు వారాలుగా ఉపాధి హామీ పనులు చేస్తున్నా ఇంతవరకూ వేతనాలు చెల్లించడం లేదంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పెదవేగి మండలం కొప్పాక గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు సర్పంచి భాస్కర దీక్షితులు ఆధ్వర్యంలో గురువారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఎంపీడీవో రాజ్‌మనోజ్‌ పంచాయతీ కార్యాలయానికి వచ్చి కూలీలతో చర్చించారు. కొత్త పనులకు ప్రతిపాదనలు లేవని, చేసే పనులకు మస్తర్లు వేయడం లేదని, సిబ్బంది సహకరించడం లేదని సర్పంచి భాస్కర దీక్షితులు, కూలీలు ఎంపీడీవో దృష్టికి తీసుకొచ్చారు. ఆరు వారాలు గడిచినా వేతనాలు చెల్లించకపోతే బతికేదెలా అంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజ్‌మనోజ్‌ మాట్లాడుతూ సర్పంచి, కూలీల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కొత్త పనులు ప్రతిపాదించి గ్రామ పంచాయతీకి పంపి నెలలు గడుస్తున్నా ఇంత వరకూ తీర్మానం చేయలేదన్నారు. తీర్మానం చేయగానే కూలీలకు పనులు కల్పిస్తామని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో కూలీలు ఆందోళనను విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని