logo

భవనాల రిజిస్ట్రేషన్‌లో బాదుడు

ప్రభుత్వం భూములు, స్థలాల విలువలను ఇప్పటికే 20 నుంచి 35 శాతానికి పెంచింది. ఇది చాలదన్నట్టు భవనాల విలువలనూ పెంచడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

Published : 02 Jun 2023 04:13 IST

స్థిరాస్తి విలువల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం
ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే

ఏలూరు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం

ప్రభుత్వం భూములు, స్థలాల విలువలను ఇప్పటికే 20 నుంచి 35 శాతానికి పెంచింది. ఇది చాలదన్నట్టు భవనాల విలువలనూ పెంచడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు వరుసగా పెంచి నడ్డివిరుస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏలూరు జిల్లాలోని 12 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో ఆయా ప్రాంతాల భూముల ధరలను బట్టి పూరిగుడిసె నుంచి ఎత్తయిన భవనాల వరకు అన్ని రకాల నిర్మాణాల మార్కెట్‌ విలువలను ఈ ఏడాది రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ విభాగాలుగా సవరించారు. వీటితో పాటు బహుళ అంతస్తుల (అపార్ట్‌మెంట్ల) ధరలకు రెక్కలొచ్చాయి. కమర్షియల్‌ పరిధిలో అపార్ట్‌మెంట్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌కు రూ.1700, మొదటి అంతస్తుకు రూ.1600, రెండో అంతస్తుకు రూ.1500, సెల్లార్‌, పార్కింగ్‌ స్థలానికి రూ.1000 చొప్పున పెంచారు. అలాగే పట్టణ ప్రాంతాలు, మేజరు, మైనర్‌ పంచాయతీలు.. ఇలా ఆయా ప్రాంతాల్లోని విలువల ఆధారంగా సవరణ చేశారు. వీటి ప్రకారం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుములు వసూలు చేయనున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో రిజిస్ట్రేషన్‌ ఖర్చు తడిసి మోపెడు కానుంది. తాజాగా పెంచిన ధరలను ఆయా సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో గురువారం నుంచి సంబంధిత అధికారులు అమలు చేస్తున్నారు.

మరింత భారమే..

జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజుకు 800 వరకు వివిధ రకాల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. వీటి రూపేణా ప్రభుత్వానికి దాదాపు రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తోంది. నిర్మాణాల మార్కెట్‌ విలువ పెంపులో భాగంగా జిల్లాలో క్రయవిక్రయాల ద్వారా ఏటా రూ.8 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

* ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి వెయ్యి అడుగుల సాధారణ భవనం ఉంది. చదరపు అడుగు విలువ రూ.1200 ఉండేది. ఈ లెక్కన స్థిరాస్తి విలువ రూ.12 లక్షలు కాగా.. రిజిస్ట్రేషన్‌ ఛార్జీ రూ.90 వేలు పడేది. తాజాగా చదరపు అడుగు విలువ రూ.1400కు పెంచడంతో రిజిస్ట్రేషన్‌ ఛార్జీ రూ.1.05 లక్షలకు పెరిగింది.

* పట్టణ, నగర పంచాయతీల్లో గోడలున్న పూరిళ్లకు గతంలో చదరపు అడుగు విలువ రూ.190 ఉంటే.. దానిని రూ.200కు పెంచారు. చావిడి మిద్దెల విలువ రూ.290 నుంచి  రూ.300కు పెరిగింది. ఇలా సగటున 5 నుంచి 10 శాతం వరకు పెంచారు. ఈ కారణంగా వాటిని కొనుగోలు చేయాలంటే రిజిస్ట్రేషన్‌ ఖర్చులు గతంలో కంటే అదనంగా భరించాల్సి వస్తుంది. ఇప్పటికే భూముల విలువలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు భవనాల విలువలు పెంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని