logo

ఆరోగ్య బాటలో.. సాటిలేని సవారీ

ఆరోగ్యంపై శ్రద్ధ.. పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న సామాజిక స్పృహతో సైకిల్‌ తొక్కేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆధునిక వాహనాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా కొందరు ఇప్పటికీ సైకిల్‌ వినియోగాన్ని తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకున్నారు.

Updated : 03 Jun 2023 05:28 IST

నేడు ప్రపంచ సైకిల్‌ దినోత్సవం
భీమవరం పట్టణం, న్యూస్‌టుడే

ఆరోగ్యంపై శ్రద్ధ.. పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న సామాజిక స్పృహతో సైకిల్‌ తొక్కేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆధునిక వాహనాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా కొందరు ఇప్పటికీ సైకిల్‌ వినియోగాన్ని తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకున్నారు. మరికొందరు పర్యావరణ పరిరక్షణ, ఇతర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా బృందాలుగా ఏర్పడి కొత్తతరం సైకిళ్లపై సుదూర ప్రాంతాలకు చైతన్య యాత్రలు చేస్తున్నారు.

యాత్రలో యూత్‌ హాస్టల్స్‌ బృందం (పాత చిత్రం)

చైతన్యం నింపేలా..

పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం నింపేలా యూత్‌ హాస్టల్స్‌ భీమవరం శాఖ ఆధ్వర్యంలో సైకిల్‌ యాత్రలు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్‌, పొగాకు వినియోగంతో అనర్థాలు, మొక్కల పెంపకం, పర్యావరణం, జలవనరుల సంరక్షణ లాంటి అంశాలను ప్రచారం చేసేలా ఏటా బృందాలుగా ఏర్పడి ఇతర రాష్ట్రాలకు యాత్రలు చేస్తుంటారు. పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు సైకిల్‌ యాత్రలు నిర్వహించారు. ఏటా ఒక అంశాన్ని ఎంచుకొని ఆ సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా తమ యాత్రలు కొనసాగుతున్నాయని యూత్‌ హాస్టల్స్‌ సభ్యుడు, భీమవరం టౌన్‌హాల్‌ కార్యదర్శి గ్రంధి సురేష్‌ తెలిపారు.

భీమవరం నుంచి కోల్‌కతా బయలుదేరిన భక్తులు

ఆధ్యాత్మిక మార్గంలో..

ఆధ్యాత్మిక మార్గాలపై ప్రజల్లో చైతన్యం నింపాలనే లక్ష్యంతో భీమవరానికి చెందిన భక్తుల బృందం గత కొన్నేళ్లుగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు సైకిల్‌ యాత్రలు చేస్తోంది. తొలుత 2000లో భీమవరం నుంచి శబరిమలై క్షేత్రానికి 1350 కి.మీ. మేర 13 రోజుల సైకిల్‌ యాత్ర చేశారు. 2007లో కోల్‌కతాకు వెళ్లారు. తరువాత శిర్డీ, కాశీ, రామేశ్వరం క్షేత్రాలకు వెళ్లారు. తాజాగా 14 మంది బృందం సభ్యులు తిరుమలకు వెళ్లి వచ్చారు. ప్రజల్లో భక్తిభావం నింపడమే తమ యాత్రల లక్ష్యమని బృందం సభ్యుడు కాళి శేఖర్‌ తెలిపారు.

60 ఏళ్ల   వయసులోనూ..

ముదినేపల్లి, న్యూస్‌టుడే: అరవై ఏళ్ల వయసులో సైకిల్‌పై ఉత్తరాలు బట్వాడా చేస్తూ బతుకు బండి నడిపిస్తున్నారు ముదినేపల్లి మండలం పెదగొన్నూరుకు చెందిన పోస్టు ఉమన్‌ కస్తూరి కుమారి. 2006లో భర్త రామచంద్రరావు మృతి చెందటంతో ఆయన ఉద్యోగాన్ని కుమారికి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె నిత్యం 8 నుంచి 10 కిలోమీటర్ల మేర సైకిల్‌పై ప్రయాణిస్తూ పెదగొన్నూరు, విశ్వనాద్రిపాలెం, ఉప్పరగూడెం గ్రామస్థులకు ఉత్తరాలు అందిస్తున్నారు. నిత్యం సైకిల్‌ తొక్కడం వల్లే ఇప్పటికీ ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నానని ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న కుమారి చెబుతున్నారు.

నిత్యం 30 కి.మీ. ప్రయాణం

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఏలూరు నగరానికి చెందిన పోకూరి శ్రీధర్‌ ‘అడాక్స్‌’ అనే అంతర్జాతీయ స్థాయి సైక్లింగ్‌ క్లబ్‌లో సభ్యుడు. ఈయన 2017లో సైక్లింగ్‌ ప్రారంభించారు. నిత్యం 30 నుంచి 40 కిలో మీటర్ల వరకు సైకిల్‌ తొక్కుతుంటారు. అడాక్స్‌లో సభ్యత్వం పొందాక పన్నెండున్నర గంటల్లో 200 కిలో మీటర్ల మేర సైకిల్‌ యాత్ర చేశారు. ప్రతి నెలా ఆ సంస్థ ఇచ్చే రూట్‌ మ్యాప్‌ ప్రకారం సంస్థ సభ్యులు బృందంగా సైక్లింగ్‌ చేస్తుంటారు. నిర్ణీత కిలోమీటర్ల వరకు యాత్ర చేసిన వారికి ‘రెనెండోర్‌’ టైటిల్‌ ఇస్తారు. ఇలాంటి టైటిళ్లను మూడుసార్లు సాధించినట్లు శ్రీధర్‌ తెలిపారు. నడక, ఇతర వ్యాయామాలకంటే సైక్లింగ్‌ అత్యుత్తమమని శ్రీధర్‌ చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని