logo

పునాదుల్లోనే ఆగిపోయాయ్‌!

వీరవాసరం మండలం కొణితివాడ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ‘నాడు- నేడు’ రెండో విడతలో చేపట్టిన అదనపు తరగతి గదుల భవనం నిర్మాణమిది. మూడు విడతల్లో మంజూరైన రూ.32 లక్షలతో ప్రారంభించారు.

Published : 09 Jun 2023 05:43 IST

నాడు- నేడు రెండో విడత పనుల తీరిది

వీరవాసరం, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మరో మూడు రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. సెలవులు పూర్తి చేసుకున్న  విద్యార్థులు కొత్త ఉత్సాహంతో బడిబాటకు సిద్ధమవుతున్నారు. చక్కటి గదులు,  వసతులతో స్వాగతం చెప్పాల్సిన ప్రభుత్వ విద్యాలయాలు అసంపూర్తి పనులతో వెలవెలబోతున్నాయి.

వీరవాసరం మండలం కొణితివాడ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ‘నాడు- నేడు’ రెండో విడతలో చేపట్టిన అదనపు తరగతి గదుల భవనం నిర్మాణమిది. మూడు విడతల్లో మంజూరైన రూ.32 లక్షలతో ప్రారంభించారు. కానీ ప్రస్తుతం పాఠశాల ఖాతాలో ఉన్న రూ.3 లక్షల్లో రూ.70 వేలను సమీప మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేయడంతో ఈ పనులు నిలిచిపోయాయి.

జిల్లాలో పలు పాఠశాలల్లో ‘నాడు-నేడు’ రెండో విడత పనుల తీరుపై కలెక్టర్‌ ప్రశాంతి ఇటీవల నిర్వహించిన సమీక్షలో అసహనం వ్యక్తం చేశారు. 40 రోజుల్లో చేయాల్సిన పనులు 10 రోజుల్లో హడావుడిగా చేస్తే నాణ్యత ప్రశ్నార్థకమవుతుందని అధికారులను హెచ్చరించారు.

ఇదీ పరిస్థితి..

* వీరవాసరం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 11 గదులు నిర్మించాలని నిర్ణయించారు. తొలుత ఒక భవనంపై తొలివిడత మంజూరైన రివాల్వింగ్‌ ఫండ్‌తో మూడు గదుల నిర్మాణం చేపట్టారు. రెండో దఫా విడుదలైన రూ.13.50 లక్షల్లో రూ.2 లక్షల వరకు ఖర్చుచేశారు. ఇంతలోనే మిగిలిన నిధులను నాడు- నేడు కాంపొనెంట్‌ పనులకు కేటాయించాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ మొత్తాన్ని రాయకుదురు- 1, పెదజువ్విపాలెం, కొణితివాడ స్పెషల్‌ మండల పరిషత్‌ పాఠశాలల బ్యాంకు ఖాతాలకు జమ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఇక్కడ అదనపు గదుల నిర్మాణాలు  నిలిచిపోయాయి.

* భీమవరం పట్టణ పరిధి శ్రీరామపురంలోని రాజరాజేశ్వరి పాఠశాల ఆవరణలో ప్రస్తుతం వివిధ పనులను హడావుడిగా చేస్తున్నారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి గదులను శుభ్రం చేయకపోతే విద్యార్థులు కూర్చొనేందుకు చోటు ఉండదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

* ఆచంట నియోజకవర్గ పరిధిలో 148 పాఠశాలల్లో   ప్రారంభించగా 34 శాతం పూర్తయ్యాయి. పెనుమంట్ర మండలం ఆలమూరులో టైల్స్‌ పనులు జరుగుతున్నాయి. పొలమూరులో అదనపు గదుల నిర్మాణం పూర్తికాలేదు.

మరమ్మతులకే ప్రాధాన్యం..

‘నాడు-నేడు’ రెండో దశలో ఉన్నత పాఠశాలల్లో గదుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 860 గదుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. దాదాపు అన్నిచోట్లా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పనులు ప్రారంభించారు. ఫిబ్రవరి నెలాఖరునాటికి వీటిని పూర్తి చేయాలనుకున్నా చాలా చోట్ల పునాది దశ దాటలేదు. కొన్నిచోట్ల తరగతి గదుల్లో సిమెంటు, క్రీడా ప్రాంగణాల్లో ఇసుక, నిర్మాణ సామగ్రి ఉంది. ప్రస్తుతం గదుల నిర్మాణం కంటే మిగిలిన చిన్నపాటి పనులు, మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.   బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో పనులు చేపపట్టేందుకు గుత్తేదారులు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మరమ్మతులు, అదనపు తరగతులు, ఇతరత్రా పనులు నాణ్యతతో జరుగుతున్నాయని డీఈవో ఆర్‌.వెంకటరమణ చెప్పారు.

శ్రీరామపురం రాజరాజేశ్వరి పాఠశాల వద్ద కొనసాగుతున్న పనులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని