logo

భూమి పత్రాలు తీసుకెళ్లి తనఖా

భీమవరం మండలం గొల్లవానితిప్పలోని యూనియన్‌ బ్యాంకులో అటెండర్‌గా పని చేస్తూ చేతి వాటం ప్రదర్శించిన కటకంశెట్టి విజయరాజు వ్యవహారం కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Published : 10 Jun 2023 03:36 IST

బ్యాంకు అటెండర్‌ మోసం కేసులో కొత్త అంశాలు

భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే: భీమవరం మండలం గొల్లవానితిప్పలోని యూనియన్‌ బ్యాంకులో అటెండర్‌గా పని చేస్తూ చేతి వాటం ప్రదర్శించిన కటకంశెట్టి విజయరాజు వ్యవహారం కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు అమాయక రైతుల నుంచి డబ్బు తీసుకుని బ్యాంకులో జమ చేస్తానని మోసం చేశాడనే ఆరోపణలున్నాయి. దానిపై ‘ఈనాడు’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. ఆ బ్యాంకు రీజినల్‌ చీఫ్‌ మేనేజర్‌ రామ్మోహనరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. సదరు ఉద్యోగి తన ఇంటి నిర్మాణం నిమిత్తం కొన్ని లక్షలు బ్యాంకు రుణం తీసుకుని తర్వాత ఆ దస్త్రాలను దొంగిలించి తీసుకెళ్లిపోయినట్లు తేలింది. దీంతో ఇది ఈ ప్రాంతంలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక రైతు ఫిర్యాదు చేయడం వల్ల బయటపడిన ఈ వ్యవహారంలో కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. ఇంకా ఎంత మంది రైతులు ఇలా మోసపోయారు.. ఆ ఉద్యోగి ఇతరుల దస్త్రాలను కూడా బయటికి తప్పించాడా అన్నదానిపై అధికారులు దృష్టి సారించారు.

* గొల్లవానితిప్పలో ఆంధ్రాబ్యాంకు(ఇప్పుడు యూనియన్‌ బ్యాంకు) అంటే ఈ ప్రాంతంలో సుమారు పదిహేను గ్రామాలకు ప్రధానమైంది. ఏడాదికి సుమారు రూ.150 కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. అంతటి కీలకమైన బ్యాంకులో చిరుద్యోగి ఇంత పెద్ద వ్యవహారాలు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది. పైగా పెద్దగా చదువుకోని రైతులు కొంత మందిని ఎక్కువగా నమ్ముతుంటారు. అందులో అటెండర్‌ అయిన ఉద్యోగి స్థానికుడు కావడంతో పరిసర గ్రామాల ప్రజలు అతడ్ని ఎక్కువగా నమ్మేవారని పలువురు చెబుతున్నారు. చేతివాటం బయట పడే పరిస్థితి ఉందని గమనించిన అటెండరు మార్చి నెలాఖరు నుంచి కనిపించకుండా పోయాడు. బ్యాంకు అధికారులు ఇంటికి వెళ్లినా అతడు ఎక్కడికో వెళ్లిపోయాడని, తమకు తెలియదని ఇంట్లో వారు చెబుతున్నారని బ్యాంకు అధికారులు తెలిపారు. దస్త్రాలు మాత్రమే పక్కదోవ పట్టించాడా.. బంగారం కూడా ఏమైనా పోయిందా అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. * దీనిపై తనిఖీలు చేపట్టిన రీజనల్‌ చీఫ్‌ మేనేజర్‌ రామ్మోహనరావు స్పందిస్తూ అతడి దస్త్రాలు తీసుకెళ్లినట్లు గుర్తించామని,  ఒక చోట తనఖా పెట్టినట్లు తేలిందన్నారు. బంగారం మాత్రం భద్రంగా ఉందని, మిగిలిన దస్త్రాలు అన్నింటినీ తనిఖీ చేస్తున్నామని, ఇంకా విచారణ జరుగుతోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని