logo

ఖరీఫ్‌లో కిసాన్‌ డ్రోన్లు ఎగరనట్లే!

వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కూలీల కొరతను అధిగమించడంతో పాటు యాంత్రీకరణ ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ప్రభుత్వం

Updated : 18 Sep 2023 06:20 IST

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కూలీల కొరతను అధిగమించడంతో పాటు యాంత్రీకరణ ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్‌ డ్రోన్లు ఈ ఖరీఫ్‌ సీజన్లో ఎగిరేలా లేవు. ప్రభుత్వ నిబంధనలు, అభ్యర్థుల ఎంపిక, శిక్షణలో జాప్యమే ఇందుకు ముఖ్య కారణంగా తెలుస్తోంది.

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఖరీఫ్‌లో సుమారు 5.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వీటిలో వరితోపాటు చెరకు, మొక్కజొన్న, అపరాలు, మిర్చి, పత్తి తదితరాలు ఉన్నాయి. వీటికి డ్రోన్ల సాయంతో పురుగు మందులు పిచికారీ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వాటిని ఎగుర వేసే పైలట్ల ఎంపిక ప్రక్రియ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో చేపట్టారు. పూర్తి స్థాయిలో అర్హులు ముందుకు రానందున గడువు పెంచుతూ వచ్చారు. వారికి నేటికీ శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయ్యేదెన్నడు, డ్రోన్లు ఎగిరేదెప్పుడు అని అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.

ప్రభుత్వ నిబంధనలతో..

రెండు జిల్లాల్లో కలిపి 92 డ్రోన్లు అందించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అందుకు మండలానికి ఇద్దరు పైలట్లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అర్హులు లేకపోవడంతో కనీసం ఒకరిని ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తర్వాత వారిని గుంటూరులో శిక్షణకు పంపుతున్నారు. అది పూర్తి చేసుకున్న వారికి పైలట్‌ లైసెన్సు ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు భూమితో పాటు పాస్‌పోర్టు ఉండాలి. భూమి ఉన్న వారికి పాస్‌ పోర్టు ఉండక పోవడం.. పాస్‌పోర్టు ఉన్న వారికి భూమి ఉండక పోవడం జరుగుతోంది. దీనికితోడు డ్రోన్‌ ఖరీదులో కొంత మొత్తం రూ.లక్షల్లో సమకూర్చుకోవడం వంటి నిబంధనలతో యువత ముందుకు రావడం లేదు. ఏలూరు జిల్లాలోని 26 మండలాల్లో 26 మంది అభ్యర్థుల్ని గుర్తించారు. వీరిలో 21 మందిని ఎంపికచేయగా 12 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. మిగిలిన 9 మందికి ఇంకా శిక్షణ ఇవ్వలేదు. పశ్చిమగోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 32 మందిని ఎంపికచేశారు. వీరిలో 18 మంది శిక్షణ పొందారు. ఇంకా 14 మంది శిక్షణ పొందాల్సి ఉంది.

ముందుకు రాని అభ్యర్థులు

పైలట్‌గా ఎంపిక కావాలంటే అభ్యర్థి వ్యవసాయ పట్టభద్రుడు, డిప్లొమా, ఇంజినీరింగ్‌ చేసిన వారై ఉండాలి. వారు రైతు భరోసా కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలోపు ఉండాలి. జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రాధాన్యం కల్పించాలి. శిక్షణ పొందిన అభ్యర్థి ట్యాగ్‌ చేసిన కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రానికి మూడేళ్లు పైౖలటింగ్‌ సేవలు అందించేందుకు అంగీకారం తెలియజేయాలి. డ్రోన్‌ ఖరీదు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత విలువలో సీహెచ్‌సీ పేరుతో రైతు సంఘాలు ఏర్పాటు చేసి వాటిని 40 శాతం రాయితీపై ఇవ్వాలని నిర్ణయించారు. విలువలో 50 శాతం బ్యాంకు నుంచి రుణంగా మంజూరు చేస్తారు. మిగతా పది శాతం పైలట్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనలతో ఎంపిక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.

తప్పని ఎదురుచూపులు

శిక్షణ తర్వాత డ్రోన్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతుంది. డ్రోన్‌ కంపెనీల వారు గ్రామాలకు వచ్చి క్షేత్ర స్థాయిలో ఒక్కోటి 10 ఎకరాల్లో పురుగు మందు పిచికారీ చేయాలి. ఆయా కంపెనీల్లో అభ్యర్థికి నచ్చిన కంపెనీని ఎంపిక చేసుకోవచ్చు. వచ్చే నెలలో డ్రోన్లు అందజేయాలనే లక్ష్యంతో ఉన్నామని పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.  వచ్చే రబీ సీజన్లో డ్రోన్లతో పురుగు మందు పిచికారీ చేయనున్నట్లు ఏలూరు జిల్లా వ్యవసాయాధికారి వై.రామకృష్ణ తెలిపారు.

రెండు జిల్లాల్లో దాదాపు అయిదు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వరిలో ప్రస్తుతం తెగుళ్ల బెడద అధికంగా ఉంది. వాటి నివారణకు రైతులు ప్రస్తుతం హ్యాండ్‌ స్ప్రేయర్లతో పురుగు మందు పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కూలీల ఖర్చు ఎక్కువ అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు