logo

ఆర్భాటంగా చెప్పారు.. అతీగతీ లేదు

నరసాపురంలో రూ.3300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలంటే నియోజకవర్గ రూపులేఖలే మారిపోతాయని ప్రజలు సంబరపడ్డారు.  సీˆఎం ఆర్బాటంగా శంకుస్థాపనలు చేయడంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తవుతాయని భావించారు.

Updated : 21 Nov 2023 06:43 IST
నరసాపురంలో గతేడాది ఇదే రోజు భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రచారమే తప్ప ఇప్పటికీ అడుగు పడని పనులెన్నో
ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, నరసాపురం

నరసాపురంలో రూ.3300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలంటే నియోజకవర్గ రూపులేఖలే మారిపోతాయని ప్రజలు సంబరపడ్డారు.  సీˆఎం ఆర్బాటంగా శంకుస్థాపనలు చేయడంతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తవుతాయని భావించారు. సరిగ్గా ఏడాది గడిచినా అడుగులు పడలేదు. అప్పుడు శంకుస్థాపన చేసిన ఫిషింగ్‌ హార్బర్‌, ఆక్వా యూనివర్సిటీ మొదలు భూగర్భ డ్రెయినేజీ వరకు ఒక్కటంటే ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఆక్వా విశ్వవిద్యాలయానికి రహదారుల నిర్మాణం తప్ప ఇంకే పనులూ చేయలేదు.  రూ.1400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పథకానికి శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా ఇప్పటి వరకు అతీగతీలేదు.

ఒకే రోజు సుమారు రూ.3300 కోట్ల నిధులతో 15 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం నరసాపురం చరిత్రలో మునుపెన్నడూ  జరిగిన దాఖలాలు లేవు. నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు జరుగుతున్న గొప్ప ప్రయత్నమిది.

గతేడాది నవంబరు 21న నరసాపురం బహిరంగ సభలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలివి. 

వియర్‌ ఛానల్‌కు అంతరాయం.. మొగల్తూరు మండలంలో చివరి ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు తరలించేందుకు రూ.24 కోట్ల వ్యయంతో వియర్‌ ఛానల్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మొగల్తూరు-పేరుపాలెం మధ్య ఏర్పాటు చేసే ఈ కాలువతో దాదాపు 2వేల ఎకరాలకు సాగునీరు అందించొచ్చు. ఈ పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదు.


టెండర్లు దాటని స్లూయిజ్‌ల నిర్మాణం

స్లూయిజ్‌లు శిథిలావస్థకు చేరటంతో వరదల సమయంలో పొలాలు ముంపునకు గురై వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోంది. దీని నివారణకు రూ.9 కోట్ల అంచనా వ్యయంతో నియోజకవర్గంతో కాజ, ఈస్ట్‌కుక్కులేరు, ముస్కేపాలెం, మడుగుతోములు ప్రాంతాల్లో స్లూయిజ్‌ల ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులకు మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క గుత్తేదారు కూడా ముందుకు రాలేదు.


వశిష్ఠ వారధి జాడేది

నరసాపురం, మొగల్తూరు మండలాలను కోనసీమతో అనుసంధానం చేసేందుకు రూ.26 కోట్ల అంచనాతో వశిష్ఠవారధి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై గాజులలంక సమీపంలో వంతెనతోపాటు రహదారులు నిర్మించాల్సి ఉంది. దీంతో చుట్టూ తిరిగి చించినాడ వంతెన మీదుగా, లేకుంటే నరసాపురం నుంచి పంటు మీదుగా వెళ్లకుండా ఈ వంతెన మీదుగా సరాసరి సఖినేటిపల్లి, మల్కిపురం, రాజోలు వెళ్లేందుకు సులువుగా ఉంటుంది. దీంతో రెండు జిల్లాల్లోని గోదావరి తీరంలోని ప్రజలకు ఉపయోగం. ఏడాది గడిచినా వంతెన పనులు పట్టాలెక్కలేదు. గుత్తేదారులు ముందుకు రాకపోవటంతో టెండర్ల దశలోనే నిలిచింది.


భూగర్భ డ్రెయినేజీ ఎక్కడ

నరసాపురంలో చిన్న వర్షం కురిసినా డ్రెయినేజీలు పొంగి ఇళ్లలోకి నీరు వస్తోంది. 31 వార్డుల ప్రజలు వర్షాకాలంలో నరకం చూస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రూ.85కోట్లతో భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఆ పనులకు ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు.


రెగ్యులేటర్లను గాలికొదిలేశారు..

సముద్రపు నీరు కొల్లేరులో చొరబడకుండా నిరోధించి..5వ కాంటూరు వరకు మంచి నీరు నిల్వ చేయడానికి ఉప్పుటేరుపై మోళ్లపర్రు పరిధిలో రూ.188.40 కోట్ల అంచనా వ్యయంతో రెగ్యులేటర్‌, వంతెన, లాక్‌ నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏడాది గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క గుత్తేదారు కూడా ముందుకు రాలేదు.


ఫిషింగ్‌ హార్బర్‌ ఏది సార్‌..

బియ్యపుతిప్ప దగ్గర రూ.429.43 కోట్ల అంచనాతో పై చిత్రంలోని ప్రాంతంలో ఫిసింగ్‌ హార్బర్‌ నిర్మించాల్సి ఉండగా.. ఒక్క ఇటుక కూడా పడలేదు. దీని ద్వారా అత్యంత సామర్థ్యం కలిగిన మోటారు బోట్లలో సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లి వేట సాగించేందుకు వీలుంటుంది. నరసాపురం మొగల్తూరు మండలాల్లో దాదాపు ఆరువేల మందికి లబ్ధి చేకూరుతుంది.


విద్యుత్తు ఉపకేంద్రానికి స్థల గండం..

గతేడాది నవంబరు 21న శంకుస్థాపన శిలాఫలకాల వద్ద సీఎం తదితరులు

రుస్తుంబాదలో 220/132/33 కేవి విద్యుత్తు ఉపకేంద్రం పనులు స్థల సేకరణ దశలోనే ఆగిపోయాయి. 26కి 6.5 ఎకరాల స్థలమే సేకరించడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. నరసాపురంలో ఉపకేంద్రం నుంచి సరఫరాలో హెచ్చుతగ్గులు, కోతలతో ప్రజలతో పాటు వరి, ఆక్వా రైతులు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్తయితే నాలుగు మండలాలతో పాటు ఆక్వా విశ్వవిద్యాలయానికి కూడా ఇక్కడి నుంచే విద్యుత్తు సరఫరా చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని