logo

అయ్యా.. ఇది న్యాయమేనా!

మతిస్థిమితం లేని వ్యక్తి ఒకరు, నడవలేని స్థితిలో ఉన్నవారు మరొకరు.. ఇలాంటి వారు తమకు నెలవారీ పింఛన్లు నిలిపేశారంటూ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో వాపోయారు.

Updated : 07 Dec 2021 05:15 IST

నిలిచిన పింఛనుతో వెతలు

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మతిస్థిమితం లేని వ్యక్తి ఒకరు, నడవలేని స్థితిలో ఉన్నవారు మరొకరు.. ఇలాంటి వారు తమకు నెలవారీ పింఛన్లు నిలిపేశారంటూ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో వాపోయారు.

పేరు సరిచేయించినా.. టి.నరసాపురం మండలం బొర్రంపాలెంలో ఉంటున్నాం. మా అబ్బాయి శ్రీనుకు 12 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచి మతిస్థిమితం లేదు. లోకం తెలియని స్థితిలో బతుకుతున్న అబ్బాయికి నెలవారీ పింఛను అందేది. సదరం ధ్రువపత్రంలో పేరు తప్పుగా నమోదైందన్న కారణంతో నిలిపేశారు. పేరును సరిచేయించాం. అయినా పునరుద్ధరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టరేట్‌కు వచ్చాం. -ములికి మంగ

ఎన్నిసార్లు విన్నవించినా.. మాది ఏలూరు నగరం. మా మరిది ఇల్షాద్‌ హుస్సేన్‌కు పుట్టుకతోనే అంగవైకల్యం ఉంది. దివ్యాంగుల కేటగిరీలో నెలవారీ పింఛను సొమ్ము అందేది. సాంకేతిక సమస్యతో నాలుగు నెలల నుంచి ఆపేశారు. అధికారుల చుట్టూ తిరిగినా పింఛను పునరుద్ధరించడం లేదు. -షాహినా ఫర్వీ

కొత్తగా కార్డు పొందినా.. నేను ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంలో ఉంటున్నా. పండు వయసులో ఉన్నా. పింఛను సొమ్మే ఆధారం. బియ్యం కార్డులో పేర్లున్న ఇద్దరికి వస్తున్నాయనే కారణంతో నాలుగు నెలల కిందట నిలిపేశారు. కొత్తగా బియ్యం కార్డు పొందా. అయినా మంజూరుచేయడం లేదు. గత నెలలోనూ ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదు చేశా. ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలి. -కాంతమ్మ, తిరుమలంపాలెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని