logo

మా బిడ్డ ఎలా చనిపోయాడో చెప్పండి?

మా బిడ్డ ఎలా చనిపోయాడో చెప్పండి సార్‌! అంటూ రామసముద్రం మండలం పోతురాజుపల్లెకు చెందిన గంగరాజు, సరస్వతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 25 Jan 2023 01:07 IST

విద్యాలయం ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

ఆందోళన చేస్తున్న బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడుతున్న  ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కాశయ్య, గ్రామీణ పోలీసులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే : మా బిడ్డ ఎలా చనిపోయాడో చెప్పండి సార్‌! అంటూ రామసముద్రం మండలం పోతురాజుపల్లెకు చెందిన గంగరాజు, సరస్వతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వారు స్థానిక నవోదయ విద్యాలయం ఎదుట మృతి చెందిన తమ కుమారుడు దినేష్‌కుమార్‌ ఫొటోతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత ఏడాది సెప్టెంబరు 16న తమ కుమారుడు బిహార్‌లోని నవోదయ విద్యాలయంలో మృతి చెందాడన్నారు. మదనపల్లె జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతుండగా మైగ్రేషన్‌లో భాగంగా బిహార్‌కు వెళ్లాడని పేర్కొన్నారు. తమ కుమారుడు చనిపోయే రోజు ఉదయం 10.30 గంటలకు ఫోన్‌ చేసి మాట్లాడాడని అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు దినేష్‌కుమార్‌ చనిపోయాడని ఫోన్‌ వచ్చిందన్నారు. కుమారుడు చనిపోయి నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు తెలియలేదన్నారు. ఇప్పటికే పలుమార్లు నవోదయ విద్యాలయ అధికారులు, కలెక్టర్‌ను కలిశామని ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. తమ కుమారుడు ఏవిధంగా చనిపోయాడో తెలియజేసే వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ.కాశయ్య బిహార్‌లోని నవోదయ విద్యాలయ అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. దినేష్‌కుమార్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు ఇంకా రాలేదని వచ్చిన వెంటనే పంపుతామని వారు చెప్పారని విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు చెప్పారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. దినేష్‌ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ఆదినారాయణ, సుబ్రహ్మణ్యం, భారతితో పాటు పలువురు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని