logo

రైతుల గుండెల్లో పేలుళ్లు!

మైలవరం మండలంలో క్వారీ పేలుళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడంతో పాటు వారి బతుకులపై తీవ్ర ప్రభావితం చూపుతున్నాయి.

Published : 03 Feb 2023 01:42 IST

పంటలకు తీవ్ర నష్టం గ్రామాల్లో ఇళ్ల ధ్వంసం
ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, జమ్మలమడుగు, మైలవరం

మిరప పంటపై పేరుకుపోయిన దుమ్ము

మైలవరం మండలంలో క్వారీ పేలుళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడంతో పాటు వారి బతుకులపై తీవ్ర ప్రభావితం చూపుతున్నాయి. ఇక్కడి సిమెంటు పరిశ్రమ యాజమాన్యాలతో పాటు పర్య వేక్షణాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పరిశ్రమ రాకతో తమ గ్రామాలు బాగుపడుతాయని గ్రామీణులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం అదే పరిశ్రమ తమ ఒళ్లు, ఇళ్లు, పంటలు గుల్ల చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ క్వారీలో  పేలుళ్లు చేస్తుండడంతో సమీప గ్రామాలైన దుగ్గనపల్లె, నవాబుపేట గ్రామాల్లోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. జనవరి నుంచి కొత్త సమస్య తెచ్చింది. తూర్పు నుంచి పడమరకు వీచే గాలులతో పరిశ్రమ ద్వారా వచ్చే దుమ్ము, ధూళి పంటలపై పేరుకుపోతోంది. దీని కారణంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని మైలవరం మండల బాధిత రైతులు వాపోతున్నారు.

క్వారీ పేలుళ్లతో నెర్రెలిచ్చిన ఓ ఇంటి గోడలు

మైలవరం మండలంలోని ఓ సిమెంటు పరిశ్రమతో రెండు గ్రామాల ప్రజలు దినదిన గండంలా బతుకుతున్నారు. దుగ్గనపల్లె సమీపంలో సున్నపురాయి కోసం వందలాది ఎకరాలను పరిశ్రమ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఇక్కడ వెలికితీసే సున్నపు రాయిని సిమెంటు తయారీకి వినియోగిస్తారు. భూగర్భంలోని రాయిని పగలుకొట్టేందుకు ప్రతి రోజు మధ్యాహ్నం క్వారీలో మందుగుండు సామగ్రితో పేలుస్తుంటారు. ఆ పేలుళ్లతో సమీపంలోని దుగ్గనపల్లె, నవాబుపేట గ్రామాల్లోని కొన్ని ఇళ్లకు పగుళ్లు వచ్చాయి.

పంట దిగుబడులపై ప్రభావం

పరిశ్రమ నుంచి వెలువడే దుమ్ము...ధూళితో దుగ్గనపల్లె రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిశ్రమ నుంచి వెలువడే దుమ్ము, ధూళి పంటలపై చేరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల కోసం మందులు పిచికారీ చేసినా ధూలి కారణంగా ప్రభావం చూపడంలేదని వాపోతున్నారు. తలమంచిపట్నం గ్రామం వరకు గాలి ప్రభావం ఉంటోందని చెబుతున్నారు. ఒక్క దుగ్గనపల్లెలోనే వంద ఎకరాలకు పైగా మిరప తోటలు ఉండగా... ఇతర గ్రామాలతో కలిపి సుమారు 250 ఎకరాల్లోని ఎండు మిర్చి, పత్తి పంటలకు నష్టం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు.

దిగుబడిపై ప్రభావం

సిమెంటు పరిశ్రమ ద్వారా వచ్చే ధూళితో మిరప పంట దిగుబడిపై ప్రభావం చూపుతోంది. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టాం. పూత రాలిపోతుండడంతో ఎకరాకు 1,500 కిలోల మిర్చి పండాల్సి ఉంటే వెయ్యి కిలోల లోపే దిగుబడి వస్తోంది. ఎండుమిర్చిని అమ్మేందుకు గుంటూరుకు తీసుకెళ్తే కాయపై ఉన్న దుమ్మును చూసి కొనడంలేదు.

 ఇమ్మానుయేలు, మిరప రైతు, దుగ్గనపల్లె

ఇల్లు కూలిపోతోంది

సిమెంటు పరిశ్రమ పేలుళ్లతో మా ఇల్లు నెర్రెలు చీలింది. ఎప్పుడైనా పడిపోవచ్చునని ఇల్లు ఖాళీ చేశాం. డబ్బుల్లేక తాత్కాలికంగా బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నాం. పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.

 దానమ్మ, బాధితురాలు, దుగ్గనపల్లె

ప్రాణ భయంతో జీవిస్తున్నాం

పేలుళ్లతో మా ఇల్లు చీలింది. ప్రతి రోజూ భయంతో బతకాల్సి వస్తోంది. పరిశ్రమ యాజమాన్యానికి సమస్య తీసుకెళ్లినా పరిహారం ఇవ్వలేదు. ప్రతి రోజూ మధ్యాహ్నం పేలుళ్లు జరుపుతున్నారు. దుమ్ము, ధూళి కారణంగా బయట ఉన్న వస్తువులన్నీ పాడైపోతున్నాయి.

 శాంతకుమారి, బాధితురాలు, దుగ్గనపల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని