logo

అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాడి అరెస్టు

పలు రాష్ట్రాలకు చెందిన 440 మంది నకిలీ వేలిముద్రలు తయారుచేసి వారి ఖాతాల్లో నుంచి నగదు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాన్ని అరెస్టు చేసినట్లు వైయస్‌ఆర్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

Published : 04 Feb 2023 05:05 IST

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌, పక్కన డీఎస్పీ చెంచుబాబు, సీఐ శ్రీరాం శ్రీనివాస్‌

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : పలు రాష్ట్రాలకు చెందిన 440 మంది నకిలీ వేలిముద్రలు తయారుచేసి వారి ఖాతాల్లో నుంచి నగదు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్‌ నేరగాన్ని అరెస్టు చేసినట్లు వైయస్‌ఆర్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్పీ వెల్లడించారు. ‘వైయస్‌ఆర్‌ జిల్లా కడప ఫక్కీర్‌పల్లెకు చెందిన సనాపు రాజశేఖర్‌రెడ్డికి కెనరా, యూనియన్‌ బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. 2022 జులై 21 నుంచి 29వ తేదీ వరకు అతనికి తెలియకుండా ఎలాంటి ఓటీపీలు, లింక్‌లు రాకుండానే రూ.89,550 నగదు డ్రా అయింది. బాధితుడు కడప చిన్నచౌకు ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశాం. ఈ కేసును ఛేదించడానికి ఏఎస్పీ తుషార్‌ డూడిని నియమించాం. ఆధార్‌ ఎనేబుల్‌ సిస్టం (ఏఈపీఎస్‌) ద్వారా బాధితుని నకిలీ వేలిముద్రలను సృష్టించి కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌లోని బయోమెట్రిక్‌ డివైస్‌ స్కానర్‌లో ఖాతాదారుని ఆధార్‌కార్డుకు లింకు ఉన్న బ్యాంకు ఖాతా నుంచి రోజుకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.89,550 నగదును డ్రా చేశారు. ఏఈపీఎస్‌ ద్వారానే సైబర్‌ నేరానికి పాల్పడినట్లు తెలుసుకున్నాం. ఇలాంటి నేరాలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘోరక్‌పూర్‌ జిల్లాలో చేస్తారని తెలిసింది. చిన్నచౌకు సీఐ శ్రీరాం శ్రీనివాస్‌, ఎస్సై అమర్‌నాథ్‌రెడ్డి, సైబర్‌ క్రైం ఠాణా బృందం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరగాళ్ల సమాచారం తెలుసుకున్నారు. ఘోరక్‌పూర్‌ జిల్లాకు చెందిన శేషనాథ్‌శర్మను అదుపులోకి తీసుకుని విచారించగా తన స్నేహితులు వికాష్‌ అలియాస్‌ విక్కీ, అక్షయయాదవ్‌ సహకారంతో ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన 440 మంది ఆధార్‌ సమాచారాన్ని దొంగచాటుగా సేకరించి, వాటి ద్వారా నకిలీ వేలిముద్రలు తయారు చేశారు. ఆ వేలి ముద్రలను ఉపయోగించి ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతా నుంచి నగదు డ్రా చేసినట్లు అంగీకరించారు. శేషనాథ్‌శర్మను అరెస్టు చేసి అతని నుంచి బయోమెట్రిక్‌, కంటప్యూటర్‌ను స్వాధీన పరుచుకున్నాం. వికాష్‌ అలియాస్‌ విక్కీ, అక్షయయాదవ్‌ పరారీలో ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నాం. ఇలాంటి మోసానికి గురైన బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత ఠాణాల్లో ఫిర్యాదు చేయాలి’ అని ఎస్పీ సూచించారు. సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు, సీఐ శ్రీరాంశ్రీనివాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని