logo

మూడేళ్ల నాటి వజ్రాల కేసు ఛేదన

మూడేళ్ల కిందట జరిగిన వజ్రాల చోరీ కేసును కడప రిమ్స్‌ ఠాణా పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు.

Published : 21 Mar 2023 04:07 IST

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

వజ్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌, పక్కన ఏఎస్పీ తుషార్‌ డూడి

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : మూడేళ్ల కిందట జరిగిన వజ్రాల చోరీ కేసును కడప రిమ్స్‌ ఠాణా పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు. ‘గోవా రాష్ట్రానికి చెందిన వజ్రాల వ్యాపారి ఇస్మాయిల్‌ షాహిద్‌కు కడప అల్మాస్‌పేటకు చెందిన ఖాదర్‌బాషాతో పరిచయం ఏర్పడింది. ఖాదర్‌బాషా తన వద్ద తొమ్మిది వజ్రాలున్నాయని, వాటిని విక్రయించమని ఇస్మాయిల్‌ షాహిద్‌ను కోరారు. ఎలాగైన వాటిని దొంగలించాలని ఇస్మాయిల్‌ షాహిద్‌ పథకం వేశాడు. గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన గణశ్యామ్‌ శేషుభాయ్‌, ఇమ్రాన్‌, కర్ణాటకకు చెందిన మహమ్మద్‌ ఇనాముల్లాను పిలుచుకుని 2020 జనవరి 16న కడప రిమ్స్‌ ఠాణా పరిధిలో ఉన్న ఓ లాడ్జిలో దిగారు. ఖాదర్‌బాషాకు ఫోన్‌ చేసి వజ్రాలు కొనుగోలు చేయడానికి ముంబై నుంచి సేఠ్లు వచ్చారు, వజ్రాలు తీసుకుని లాడ్జికి రావాలని చెప్పారు. లాడ్జిలో ఖాదర్‌బాషా వజ్రాలు చూపిస్తుండగా ఇస్మాయిల్‌ షాహిద్‌తో పాటు వచ్చిన వారందరూ ఒక్కసారిగా అతనిపై దాడి చేసి, అరవకుండా నోటికి ప్లాస్టర్‌ వేసి బాత్‌రూంలో పడేసి, తొమ్మిది వజ్రాలు దోచుకెళ్లారు. ఖాదర్‌బాషా కుమారుడు ఆసిఫ్‌ఖాన్‌ రిమ్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసును ఛేదించాలని ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందం కర్ణాటక, గోవా రాష్ట్రాలు, అహమ్మదాబాద్‌, సూరత్‌, ముంబాయి తదితర నగరాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గోవా రాష్ట్రం మపుసా సిటీ, డీఎంసీ కళాశాల వద్ద ఉంటున్న ఇస్మాయిల్‌ షాహిద్‌ను అరెస్టు చేసి అతని నుంచి రూ.53 లక్షలు విలువ చేసే మూడు చిన్న వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు’ అని ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ తుషార్‌ డూడి, డీఎస్పీ వెంకట శివారెడ్డి, సీఐ రామచంద్ర, ఎస్సై ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు