logo

జిల్లా ఆసుపత్రి వద్ద మందుబాబుల వీరంగం

రోడ్డు ప్రమాదంలో గాయపడి వచ్చిన ఇద్దరు మందు బాబులు జిల్లా ఆసుపత్రిలో వీరంగం సృష్టించారు.

Published : 31 Mar 2023 01:57 IST

అడ్డొచ్చిన భద్రతా సిబ్బందిపై దాడి
ప్రైవేటు అంబులెన్స్‌ అద్దాలు ధ్వంసం

దావుద్‌ను స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాదంలో గాయపడి వచ్చిన ఇద్దరు మందు బాబులు జిల్లా ఆసుపత్రిలో వీరంగం సృష్టించారు. అడ్డువచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఆసుపత్రి ముందు ఉంచిన ప్రైవేటు అంబులెన్స్‌ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సంఘటన గురువారం రాత్రి మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి వద్ద జరిగింది. పట్టణానికి చెందిన కాలేషా, దావుద్‌ ద్విచక్ర వాహనంపై నుంచి పడి రక్త గాయాలతో ఆసుపత్రికి వచ్చారు. నొప్పిలేకుండా కుట్లు వేయాలని ఆసుపత్రిలోని ఎంఎన్‌వోతో గొడవపడ్డారు. దీంతో అక్కడే ఉన్న అవుట్‌ పోస్టు సిబ్బంది, ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది వారిని బయటకు పంపారు. దీంతో ఆగ్రహించిన ఇద్దరు యువకులు ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు రెడ్డిశేఖర్‌పై దాడి చేశారు. వారిని అడ్డుకోబోయిన వారిపై దౌర్జన్యం చేసి ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లారు. అక్కడే ఉన్న ప్రైవేటు అంబులెన్స్‌ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో అంబులెన్స్‌ సిబ్బంది వారిని పట్టుకునేందుకు యత్నించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. వారిని వెంబడించి సిద్ధార్థ థియేటర్‌ సమీపంలో పట్టుకున్నారు. అప్పటికే కాలేషా, దావుద్‌లు తన అనుచరులను పిలవడంతో పెద్ద సంఖ్యలో గాంధీపురం నుంచి యువకులు వచ్చి అంబులెన్స్‌ డ్రైవర్లపై గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న రెండో పట్టణ ఎస్‌ఐ చంద్రమోహన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దావుద్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని