logo

పనులకు హైరానా... ఆపై జరిమానా

ఎమ్మెల్సీ ప్రస్తావనతో పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీరింగ్‌ విభాగం సైతం స్పందించింది. పెద్దముడియంకు చెందిన గుత్తేదారుకు నోటీసులివ్వడంతోపాటు భారీ మొత్తంలో జరిమానా సైతం విధించింది.

Published : 02 Jun 2023 05:11 IST

పులివెందులలో చేతులెత్తేసిన గుత్తేదారు
జాప్యానికి రూ.25లక్షలు కట్టాలంటూ ఆదేశం

అభివృద్ధికి నోచుకోని బిదినంచెర్ల - బోనాల రహదారి

ఈనాడు డిజిటల్‌, కడప: ఎమ్మెల్సీ ప్రస్తావనతో పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీరింగ్‌ విభాగం సైతం స్పందించింది. పెద్దముడియంకు చెందిన గుత్తేదారుకు నోటీసులివ్వడంతోపాటు భారీ మొత్తంలో జరిమానా సైతం విధించింది. చివరకు గుత్తేదారు పనులు చేస్తానంటూ ముందుకొచ్చారు. ఇంతకీ పనులు చేస్తారనే నమ్మకం ఇంజినీరింగ్‌ అధికారులకు కలగడంలేదు. గత అనుభవాలతో సాధారణ ఎన్నికల ముందు పనులు చేయడానికి ఎవరూ సాహసించడంలేదు. బిల్లుల భయం వెంటాడుతోంది. తెదేపా హయాంలో పనులు చేపట్టిన గుత్తేదారులకు చాలా మందికి బిల్లులు చెల్లింపులు జరగలేదు. దీంతో ఎన్నికల ముందు పనులు చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. బిల్లుల విషయంలో ఇంజినీరింగ్‌ అధికారులు అభయమిస్తున్నా నమ్మని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో నిబంధనల మేరకు అధికారులు గుత్తేదారుపై కొరడా ఝళిపించారు.
* పులివెందుల నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధిలో భాగంగా రెండు ప్యాకేజీలు కింద 15 రహదారులకు టెండర్లు పిలిచారు. ప్యాకేజీ-58 కింద 8 రహదారులకు రూ.30.20 కోట్లు, ప్యాకేజీ- 59 కింద ఏడు రహదారులకు రూ.17.20 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవగా జిల్లాకు చెందిన గుత్తేదారే పనులు దక్కించుకున్నారు. అందులోనూ సంతృప్తికరమైన ధరలతోనే టెండర్లు చేజిక్కించుకున్నారు. ఈ రెండు ప్యాకేజీల కింద లింగాల, సింహాద్రిపురం మండలాల రహదారులున్నాయి. ఆరు నెలలుగా గుత్తేదారు ఒక్క పని కూడా చేపట్టలేదు. కనీసం యంత్రాలు, మెటీరియల్‌ సరఫరాలాంటివి చేర్చలేదు. ఈ వ్యవహారంపై జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో దుమారం లేవడంతో పీఆర్‌ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి స్పందించి నోటీసులివ్వడంతో పాటు ప్యాకేజీ-58కి రూ.10 లక్షలు, ప్యాకేజీ-59కి రూ.15 లక్షలు వంతున మొత్తం రూ.25 లక్షల జరిమానా విధించారు. ఇదే గుత్తేదారు పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటలో రహదారులపై కంకర పరిచేసి తారు వేయకుండా వదిలేశారు. ఫలితంగా నెలల తరబడి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈఏపీ నిధుల కింద రహదారులను 6 మీటర్ల వెడల్పుతో చేపట్టాల్సి ఉంది. సంబంధిత గుత్తేదారు బ్యాంకు గ్యారంటీ కింద రూ.74 లక్షలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. టెండరు నిబంధనలు మేరకు పనులు వదులుకోవాలంటే దాదాపు రూ.2 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్వయానా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో పరిస్థితిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


ముఖ్యమంత్రి జగన్‌ ఇలాకా పులివెందులలో పనులు సక్రమంగా జరగడంలేదు. టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్నా పనులేవీ చేపట్టలేదు. ఇక్కడే ఇలాంటి పరిస్థితి ఉంటే బయట ప్రాంతాల్లో ఎలా ఉంటుంది. రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. పనులు చేయని గుత్తేదారుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.

ఇటీవల జరిగిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి నిలదీత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని