logo

భలే మంచి చౌక బేరము!

‘వేలంపాట ద్వారా కనీసం రూ.45 లక్షల ఆదాయమొస్తే గానీ కడప నగరపాలక సంస్థ క్రీడామైదానంలో ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వం’ ఇదీ గతేడాది ఎగ్జిబిషన్‌ వేలంపాటపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం.

Updated : 04 Jun 2023 05:02 IST

రూ.15.75 లక్షలకు ఎగ్జిబిషన్‌ వేలం పాట ఖరారు
భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు
న్యూస్‌టుడే, కడప నగరపాలక

కడప నగరపాలక క్రీడామైదానం

‘వేలంపాట ద్వారా కనీసం రూ.45 లక్షల ఆదాయమొస్తే గానీ కడప నగరపాలక సంస్థ క్రీడామైదానంలో ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వం’ ఇదీ గతేడాది ఎగ్జిబిషన్‌ వేలంపాటపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం. ఏడాది అనంతరం తాజాగా అదే నగరపాలక సంస్థ క్రీడామైదానంలో రూ.15.75 లక్షలకే వేలం పాటను ఖరారు చేశారు.! మరీ ఇంత చౌక బేరమా ?అని నగర వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ బేరంలో రూ.50 లక్షల వరకు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరేమనుకున్నా తగ్గేదేలా అంటూ నగరపాలక సంస్థ అధికారులు ఈ అంశాన్ని శుక్రవారం జరిగిన స్టాండింగ్‌ కౌన్సిల్‌ అజెండాలో చేర్చగా ఆమోదం సైతం పొందడం గమనార్హం.

ఎగ్జిబిషన్‌ ప్రక్రియ చేపట్టిన ప్రతిసారి భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయన్న అంశం తెరపైకి వస్తోంది. రెండేళ్ల కిందట నామమాత్రపు వేలంపాట నిర్వహించి ఎగ్జిబిషన్‌ను గుత్తను ఖరారు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఓ యవ నాయకుడికి లబ్ది చేకూర్చడానికి సుమారు రూ.12 లక్షలకే హక్కులు కట్టబెట్టారు. దీనిని ప్రారంభించకముందే ఆయన మృతిచెందడంతో సాంకేతికంగా వేలంపాట గుత్త రద్దయినట్టే. ఎగ్జిబిషన్‌ నిర్వహణకు తిరిగి కొత్తగా వేలం పాట నిర్వహించాల్సి ఉన్నా నగరపాలక సంస్థ నిర్వహించకుండా గుంటూరుకు చెందిన ఓ సంస్థకు అనుమతులిచ్చింది. ఎగ్జిబిషన్‌ నిర్వహణకు ఆ సంస్థకు ఇచ్చిన గడువు రెండు నెలలు కాగా, దాదాపుగా 4 నెలలపాటు వినియోగించుకున్నారు. ఈ వ్యవహారంపై నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పలువురు కార్పొరేటర్లు అధికారులను నిలదీసినా వారు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో 2022లో తిరిగి వేలంపాట నిర్వహించగా హెచ్చుపాట సుమారు రూ.20 లక్షల వద్ద నిలిచిపోయింది. ఈ వేలంపాట పూర్తయిన అనంతరం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సూర్యసాయిప్రవీణ్‌చంద్‌ ఆమోదించలేదు. సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులతో సమాలోచనలు చేసిన అనంతరం వేలంపాట కనీస ధర రూ.45 లక్షలుగా నిర్ణయించారు.

నాటకీయ పరిణామాల నడుమ

2023లో ఎగ్జిబిషన్‌ నిర్వహణకు మే 17న టెండరు/వేలంపాట నిర్వహించామని అధికారులు చెబుతున్నారు. అత్యంత వివాదాస్పదమైన ఎగ్జిబిషన్‌ వేలంపాటకు సంబంధించిన ప్రకటనలను గోప్యంగా ఉంచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందస్తుగా నిర్ణయించినవారే వేలం పాటలో పాల్గొనే విధంగా పరిమిత ప్రచారం చేశారని సమాచారం. వేలంపాట పూర్తయిన అంశాన్ని  ఎక్కడా కూడా బయటకు పొక్కనివ్వలేదు. కమిషనర్‌ సెలవులో ఉండగా ఇన్‌ఛార్జి కమిషనర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్టాండింగ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. తృతీయ శ్రేణి పురపాలక సంఘం కంటే తక్కువకు వేలంపాట పాడినా దాన్ని ఖరారు చేశారు. సాధారణంగా నగరపాలక సంస్థ స్థాయీ సంఘం సమావేశాన్ని నెలకొకసారి నిర్వహిస్తారు. మే 16వ తేదీన స్థాయీ సంఘం సమావేశాన్ని నిర్వహించి  17 రోజుల వ్యవధిలోనే తిరిగి స్టాండింగ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిండం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంజినీరింగ్‌ విభాగం అధికారులకు రూ.50 లక్షల వరకు ముడుపులు అందినట్లు నగరపాలక సంస్థ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై బడా నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినందునే తక్కువ ధరకే వేలంపాటను ఖరారు చేయాల్సివచ్చిందని కొందరు అధికారులు చెబుతున్నట్లు సమాచారం.

ప్రొద్దుటూరులో రూ కోటి ఆదాయం

కొన్ని నెలల కిందట ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఎగ్జిబిషన్‌ ఏర్పాటుకు నిర్వహించిన వేలంపాట రూ.కోటి పలికింది. అక్కడ అధిక ధర రావడానికి దసరా ఉత్సవాలు సెలవులు తదితర కారణాలను అధికారులు చూపారు. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు ఎగ్జిబిషన్‌ నిర్వహించినా ప్రొద్దుటూరుతో పోల్చుకుంటే కడప నగరంలో పెద్దసంఖ్యలో జనాలొస్తారు.  ప్రవేశ రుసుం మొదలుకుని లోపల ఉన్న ప్రతి అంశంలోనూ అక్కడి కంటే కాస్త అధిక ధరలనే వసూలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి వచ్చిన ఆదాయంలో కనీసం సగం అంటే రూ.50 లక్షలైనా రావాలని కడప నగరపాలక సంస్థ అధికారులు అంచనా వేయడంలో తప్పులేదు. మరి అలాంటప్పుడు కడపలో రూ.15.75 లక్షలకే ఎగ్జిబిషన్‌ హక్కులు కట్టబెట్టడం విశేషం.


అన్నీ పద్ధతి ప్రకారమే చేశాం
- రత్నరాజు, ఎస్‌ఈ, కడప నగరపాలక సంస్థ

ఎగ్జిబిషన్‌ వేలంపాటకు ప్రచారం చేశాం. పద్ధతి ప్రకారమే నిర్వహించగా ఇద్దరే పాల్గొన్నారు. వేసవి సెలవులు అయిపోతుండడంతో రూ.15.75 లక్షలకే పాట పాడారు. గుత్తే దారు 45 రోజులపాటు ఎగ్జిబిషన్‌ నిర్వహించుకోవచ్చు. నగరపాలక సంస్థ ఆదాయం కోసమే వేలంపాట ధరను ఆమోదించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని