logo

భావి సైనికులకు ఆశా కిరణం నల్లపురెడ్డిపల్లె

పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల సైనిక్‌ భాగస్వామ్య పాఠశాలగా ఎంపికైంది. దేశవ్యాప్తంగా 23 పాఠశాలలను ఈ పద్ధతిలో ఎంపిక చేయగా ఇందులో మన రాష్ట్రంలో ఈ పాఠశాల ఎంపికైంది.

Updated : 18 Sep 2023 06:38 IST

నల్లపురెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల

నల్లపురెడ్డిపల్లె (పులివెందుల గ్రామీణ), న్యూస్‌టుడే : పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల సైనిక్‌ భాగస్వామ్య పాఠశాలగా ఎంపికైంది. దేశవ్యాప్తంగా 23 పాఠశాలలను ఈ పద్ధతిలో ఎంపిక చేయగా ఇందులో మన రాష్ట్రంలో ఈ పాఠశాల ఎంపికైంది. ఇందుకోసం ఉపాధ్యాయులు ఇప్పటికి రెండు విడతలుగా ప్రయత్నాలు చేయగా ఎట్టకేలకు మూడవ విడతలో ఎంపికైంది. ప్రస్తుతం ఇక్కడ విద్యార్థులకు అందుతున్న విద్యాబోధనకు అదనంగా సైనిక్‌ పాఠశాల క్రమశిక్షణ తోడు కానుంది. ఇందుకు సంబంధించి పూర్తి విధి విధానాలు తెలియాల్సి ఉందని ప్రధానోపాధ్యాయుడు కమలనాథశర్మ తెలిపారు.

కొన్నేళ్లుగా ఉత్తమ ఫలితాలు...  

నియోజకవర్గంలో ఉత్తమ ఫలితాలు సాధించే పాఠశాలల్లో నల్లపురెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల ఒకటి. కొన్నేళ్లుగా ఇక్కడ పదో తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తూ ట్రిపుల్‌ఐటీలో సీట్లు సాధిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో సుమారు 680 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పులివెందుల పట్టణం నుంచి సుమారు 8 కి.మీ. ఉన్న ఈ గ్రామంలోని పాఠశాలకు పట్టణం నుంచి 150 మంది విద్యార్థులు రోజూ ఇక్కడికొచ్చి చదువుకుంటున్నారంటే బోధన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అన్నింటా అవగాహన కల్పించడంతోనే...

ఈ పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు కేవలం చదువుకే పరిమితం కాకుండా, పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి పాల్గొనేలా చూడటం, దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించే పరీక్షలను రాయిస్తున్నారు. ఇన్‌స్పైర్‌, క్రీడా విభాగాల్లో పాల్గొనేలా చూస్తున్నారు. దీంతో విద్యార్థులు జిల్లా స్థాయిలోనూ ప్రతిభ కనపరుస్తున్నారు. ఆయా రంగాల్లో విద్యార్థులు ప్రతిభ చూపేలా ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేస్తున్నారు.

సంతోషంగా ఉంది

రాష్ట్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో నల్లపురెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలను సైనిక్‌ భాగస్వామ్యం పాఠశాలగా ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తారని భావిస్తున్నాం.  

కమలనాథశ్మ, ప్రధానోపాధ్యాయుడు, నల్లపురెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని