logo

సూది మీది...దూది మాది

పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి జబ్బు చేసినా మొదట గుర్తుకు వచ్చేది ధర్మాసుపత్రి. అలాంటి ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Updated : 18 Sep 2023 06:38 IST

ఇన్సులిన్‌ సిరంజికి తప్పని ఇక్కట్లు
మదనపల్లె జిల్లాసుపత్రిలో కటకట

రోగులు బయట కొనుగోలు చేస్తున్న ఇన్సులిన్‌ సిరంజి

మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే : పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి జబ్బు చేసినా మొదట గుర్తుకు వచ్చేది ధర్మాసుపత్రి. అలాంటి ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితే మదనపల్లె జిల్లాసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో మూడు నెలలుగా కుక్కకరిచి వచ్చినా, మధుమేహంతో బాధపడుతూ వచ్చినా సూది మందు అందుబాటులో లేదు. అవసరమైన ఇన్సూలిన్‌ సూదులు లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో రోగులు బయట ప్రైవేటు మందుల దుకాణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. కేవలం రూ.5 విలువైన సిరంజి కూడా ఆసుపత్రిలో అందుబాటులో లేదు. కొరతను దృష్టిలో ఉంచుకుని ఔషధ దుకాణదారులు రూ.10కి విక్రయాలు చేస్తున్నారు. ఈ ఆసుపత్రికి మధుమేహం, కుక్కకాటు బాధితులు ఎక్కువగా వస్తుంటారు. సూది మీది... దూది మాదంటూ సిబ్బంది బయటకు పంపుతున్నారు. ఆదివారం పలువురు బాధితులు ఆసుపత్రికి వచ్చారు. సూది కొనుక్కొచ్చుకోవాలని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో బయటకు వెళ్లి డబ్బు ఖర్చు చేసి తీసుకొచ్చారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మాంజలిదేవిని వివరణ కోరగా ఆసుపత్రిలో కొన్ని రోజులుగా ఇబ్బంది ఉందని చెప్పారు. రోగులకు ఇబ్బంది లేకుండా అవసరమైనన్ని స్థానికంగా కొనుగోలు చేస్తామన్నారు. పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటే వారి వద్ద నుంచి అరువు తీసుకుని ఆసుపత్రికి స్టాకు వచ్చిన తర్వాత తిరిగి అందజేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని