logo

శిలాసంపద శిథిలం!

ఏనుగు ఆకారంలో కనిపించే వినాయకుడు... జడలా అల్లుకున్న జుట్టుతో హనుమంతుని విగ్రహం... తలపై నుంచి కాకుండా పక్క నుంచి పారుతున్న గంగతో శివుని విగ్రహం లాంటి అరుదైన కళా కృతులు...రాతి శిల్పాలు... కాంస్య చిహ్నాలు...మట్టితో చేసిన బొమ్మలు...

Published : 27 Sep 2023 04:32 IST

అభివృద్ధికి దూరంగా మహావీర్‌ మ్యూజియం
న్యూస్‌టుడే, ఎన్‌జీవో కాలనీ (కడప)

శిథిలావస్థకు చేరిన మహావీర్‌ మ్యూజియం

ఏనుగు ఆకారంలో కనిపించే వినాయకుడు... జడలా అల్లుకున్న జుట్టుతో హనుమంతుని విగ్రహం... తలపై నుంచి కాకుండా పక్క నుంచి పారుతున్న గంగతో శివుని విగ్రహం లాంటి అరుదైన కళా కృతులు...రాతి శిల్పాలు... కాంస్య చిహ్నాలు...మట్టితో చేసిన బొమ్మలు... శాసనాల రాళ్లు ఇలా ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు కేంద్రం వైయస్‌ఆర్‌ జిల్లా కేంద్రమైన కడప నగరంలోని భగవాన్‌ మహావీర్‌ మ్యూజియం. గతంలో జిల్లాకే తలమానికంగా నిలిచిన ఇది నేడు అధికారుల, పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమవుతోంది.

1982లో జైన్‌ సంఘం ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి మ్యూజియం నిర్మాణం ప్రారంభించారు. ఇక్కడ ప్రాచీన కళాకృతులతో పాటు జైనమతానికి సంబంధించిన పలు ఆనవాళ్లు, చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం నాలుగు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మొదటి ప్రవేశ గ్యాలరీలో హిందూ దేవుళ్లు, దేవతలను సూచించే రాతి శిల్పాలు, మిగిలిన వాటిల్లో జైన తీర్థంకరులు, రాజుల కాలం నాటి కళాఖండాలు, పురాతన వస్తువులు, రాతి సామగ్రి, మెగాలిథిక్‌ కుండలు, ఆదిమానవుల భౌతిక సంస్కృతిని వివరించే వస్తువులు, నాణేలు, టెర్రకోట బొమ్మలు, పెయింటింగులు మొదలైన చారిత్రక సామగ్రిని భద్రపరిచారు. నాలుగో గ్యాలరీని అమరవీరుల స్మారక ఫలకాలకు కేటాయించారు. ఈ మ్యూజియంలో బుద్ధ పాదాలు, అన్నపూర్ణ, సూర్య, జైన తీర్థంకర శిల్పాలు కూడా ఉన్నాయి. 

ఎన్నో శిలాశాసనాలు : భారత దేశంలో జైనమతం అభివృద్ధి చెందిన సమయంలో పట్టణాలుగా వర్ధిల్లిన నందలూరు, గుండ్లూరు, తిమ్మాయపాలెం, అత్తిరాల, మంటపంపల్లె ఇలా అనేక ప్రాంతాల నుంచి సేకరించిన వస్తువులను పదిలపరిచారు. ఇప్పటికీ పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడుతున్న అనేక కళాకృతులను మహావీర్‌ మ్యూజియంలో భద్రపరిచేందుకు  తెస్తుంటారు.


నిర్లక్ష్యానికి నిదర్శనం

పెచ్చులూడిన మూడో గ్యాలరీ

ఇంతటి ఘన చరిత్ర గల మహవీర్‌ మ్యూజియం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. వర్షం కురిస్తే కొన్ని గ్యాలరీలు నీటితో దర్శనమిస్తాయి. మరి కొన్ని పడిపోయేలా ఉన్నాయి. పరిస్థితి దారుణంగా ఉన్నా అటు అధికారులు, ఇటు పాలకులు ఎవరూ ఇటువైపు చూడడం లేదు. జిల్లా వాసులకే కాకుండా, రాయలసీమ మొత్తానికి ఓ దర్శనీయ ప్రదేశంగా ఉండే దీనిని ప్రస్తుతం ఎక్కడ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితికి తెచ్చారు. చూడడానికి వెళ్లేవారికి ఆ వైపు మూడు, నాలుగు సార్లు తిరిగినా మ్యూజియం కనిపించదు. దీని లోపలకు వెళ్లడానికి వీలు లేకుండా కలెక్టర్‌ కార్యాలయంతో కలిపి ప్రహరీ నిర్మించారు. దీంతో కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం నుంచే వెళ్లాల్సి వస్తోంది. మ్యూజియానికి కనీసం గేటు కూడా నిర్మించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.


పరిరక్షించాలి

ఇక్కడ ఉన్న పురాతన సంపద మన సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేస్తాయి. అటువంటి మ్యూజియం దీనావస్థలో ఉండటం బాధాకరం. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపి, చరిత్రను పరిరక్షించాల్సిన అవసరముంది. అధికారులు దృష్టిసారించి, నిధులు సమకూర్చి అభివృద్ధికి కృషి చేయాలి.

డాక్టర్‌ గానుగపెంట హనుమంతరావు


మరుగన పడటం బాధాకరం

గతంలో మహావీర్‌ మ్యూజియంలో ఉన్న పురాతన సంపద చూడటానికి రాయలసీమ జిల్లాల నుంచి ఎంతోమంది వచ్చేవారు. ఇప్పుడు ఇలా శిథిలావస్థకు చేరుకోవడం బాధాకరం.  మ్యూజియంలోకి వెళ్లేందుకు గేటు కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణం. అధికారులు ఇప్పటికైనా స్పందించి నూతన భవనం ఏర్పాటయ్యే వరకైనా కనీస వసతులు కల్పించాలి.

కొండూరు జనార్దనరాజు, కార్యదర్శి, రాయలసీమ పర్యాటక సంస్థ  


మూడేళ్ల కిందç ప్రతిపాదనలు : ప్రస్తుతం మ్యూజియానికి నూతన భవనాలు అవసరం. మూడేళ్ల కిందటే రూ.10 కోట్లతో డీపీఆర్‌ తయారు చేసి మ్యూజియం గ్రాంట్‌ స్కీమ్‌ కింద కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. నిధులు వస్తే నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.

శివకుమార్‌, ఏడీ, పురావస్తు శాఖ (చిత్తూరు, కడప)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని