Crime News: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని గుంటూరులో అదృశ్యం.. విజయవాడలో మృతదేహం

విజయవాడలోని మాచవరం పోలీసుస్టేషన్‌ పరిధిలో రోడ్డు పక్కన పడి ఉన్న మహిళ మృతదేహం గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని తనూజ(30)దిగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతిపై గుంటూరు,

Updated : 19 Jan 2022 07:34 IST

మృతిపై దర్యాప్తు ముమ్మరం

గుణదల, గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : విజయవాడలోని మాచవరం పోలీసుస్టేషన్‌ పరిధిలో రోడ్డు పక్కన పడి ఉన్న మహిళ మృతదేహం గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని తనూజ(30)దిగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతిపై గుంటూరు, విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన తనూజ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆమెకు 2018లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మణికంఠతో వివాహమైంది. వీరికి ఒక బాబు. భార్యాభర్తలు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. కొవిడ్‌ నేపథ్యంలో కొంతకాలంగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. ఈక్రమంలో తనూజ ఆదివారం ఇంటి నుంచి వెళ్లిందని...ఆమె కోసం వెతికినా ఆచూకీ లేదంటూ తల్లిదండ్రులు సోమవారం గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విజయవాడలోని శిఖామణి సెంటర్‌ సమీపంలో రోడ్డు పక్కన మహిళ మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలు తెలియకపోవడంతో గుర్తుతెలియని మహిళగా కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు పోలీసులు తనూజకు సంబంధించిన ఫొటోలతో పోల్చి ఆది ఆమె మృతదేహంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహం రోడ్డు పక్కన పడి ఉన్న తీరు చూసిన పోలీసులు తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. గుంటూరులో అదృశ్యమైన ఆమె విజయవాడలో మృతి చెంది పడి ఉండటంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  ప్రమాదంలో మరణిస్తే శరీరంపై గాయాలతోపాటు రక్తం మరకలు ఉండాలి.  మృతురాలి శరీరంపై అలాంటి ఆనవాళ్లు ఏమీ లేవు.  ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన తనూజ ఆరు గంటల వ్యవదిలోనే శవమై తేలింది. ఈ  సమయంలో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. సీసీ కెమెరాల వైఫల్యంతో కేసు విచారణలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.   తనూజకు విజయవాడలో బంధువులు ఉన్నారని, అక్కడికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె మృతిపై రెండు నగరాల పోలీసులు సంయుక్తంగా విచారణ చేస్తున్నామని, కేసు దర్యాప్తు దశలో ఉన్నదని నగరంపాలెం సీఐ హైమారావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని