Ap News: రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల వ్యయం చాలా ఎక్కువ: సీఎస్‌ సమీర్‌ శర్మ

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ  నిరసనలు చేపట్టారు

Updated : 19 Jan 2022 17:11 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ  నిరసనలు చేపట్టారు. జీవోల వ్యవహారంపై సమ్మెకు సైతం సిద్ధమని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగుల పీఆర్సీ, ఇతర అంశాలపై సీఎస్‌ సమీర్‌ శర్మ వివరణ ఇచ్చారు.

సీఎస్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంపై కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. రాష్ట్రానికి రూ.62వేల కోట్ల రెవెన్యూ ఉంది. కరోనా లేకపోయి ఉంటే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా రాష్ట్ర రెవెన్యూ పడిపోయింది. గత పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఒమిక్రాన్‌ కారణంగా రాష్ట్ర రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల వ్యయం చాలా ఎక్కువ. వనరులు సరిగా వినియోగించుకోవాలని ప్రకటన వచ్చింది. ఉద్యోగులకు రూ.17వేల కోట్లు మధ్యంతర భృతి ఇచ్చాం. ఐఆర్‌ వేతనంలో భాగం కాదని ఉద్యోగులకు తెలుసు. పీఆర్సీ ఆలస్యమైనందునే మధ్యంతర భృతి ఇచ్చాం. 2019 నుంచి గణించి డీఏల చెల్లింపు తదితరాలు ప్రకటించాం. కొన్ని పెరుగుతాయి.. కొన్ని తగ్గుతాయి.. మొత్తంగా వేతనం చూడాలి. పూర్తిగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదు. పింఛన్‌, గ్రాట్యుటీలో కూడా పెరుగుదల ఉంది. 2008-09లో నేను పీఆర్సీ ప్రక్రియలో ఉన్నాను. అప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితుల్లో తేడా వచ్చింది. కరోనా తీవ్రత ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు రాష్ట్ర రెవెన్యూ గణనీయంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు, సంక్షేమ పథకాలకు ఎలా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచించాలి. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే ప్రభుత్వ కర్తవ్యం. రాష్ట్ర బడ్జెట్‌లో పీఆర్సీతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, ఇతరత్రా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సవాళ్లు ఎదుర్కొన్నాం. ఆర్థికంగా రాష్ట్ర స్వరూపమే మారిపోయింది. రాష్ట్ర పరిస్థితులు దిగజారిపోయాయి. కరోనా వేళ ఇతర రాష్ట్రాలు సంక్షేమ పథకాలు తగ్గించాయి. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించాం. ఉద్యోగులు, పింఛనర్లు అందరికీ ప్రభుత్వం న్యాయం చేసింది. రాష్ట్రానికైనా, కుటుంబానికైనా ఆర్థిక వనరుల వినియోగం ఒకేలా ఉంటాయి. పరిమితంగా ఉన్న వనరుల వినియోగంలో సవాళ్లు ఉంటాయి. ఉద్యోగులు, సంక్షేమం సహా అన్ని రంగాలకు ఆర్థిక వనరులు పంచాలి. కొవిడ్ వేళ చాలా రాష్ట్రాలు సంక్షేమ బడ్జెట్‌లో కోతపెట్టాయి. ఏపీలో సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నాం. విభజన నుంచి కరోనా వరకు ఆర్థిక వనరులు ఒడిదొడుకుల్లో ఉన్నాయి. పరిశ్రమలు, సర్వీసుల రంగం ఒడిదొడుకులకు లోనైంది. అసుతోష్ మిశ్రా కమిటీని ప్రభుత్వం ఎక్కడా పక్కన పెట్టలేదు. అధికారుల కమిటీ అన్ని అంశాలను శాస్త్రీయంగానే అధ్యయనం చేసింది. వ్యక్తిగతంగా ఉద్యోగులు ఆరోపణలు చేయడం సహజం. కుటుంబంలో పెద్దగా వారి ఆరోపణలు స్వీకరిస్తాను. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం. త్వరలోనే అన్నీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంకా ఉద్యోగులతో చర్చలు చేస్తూనే ఉంటాం’’ అని సీఎస్‌ వివరించారు.

ఉద్యోగులకు ఒక ప్యాకేజీలా ప్రభుత్వ ప్రయోజనాలు: శశిభూషణ్‌ కుమార్

‘‘హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే ఇచ్చాం. అలాగే సిటీ కంపన్సేటరీ అలవెన్సును కూడా రద్దు చేశాం. ఇవన్నీ శాస్త్రీయ విధానంలోనే ఇచ్చేలా జీవోలు జారీ చేశాం. అఖిల భారత సర్వీసు అధికారులకు ఇచ్చే రూ.40 వేల ఇంటి అద్దె భత్యం రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త పీఆర్సీతో ప్రతీ ఉద్యోగికి భారీగానే వేతనం పెరుగుతుంది.
 ఉద్యోగ విరమణ వయసును పెంచడం ద్వారా ప్రతీ ఉద్యోగికి 2 ఏళ్లకు రూ.24 లక్షల అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగులకు ఒక ప్యాకేజీలా ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి. ఇళ్ల స్థలాల్లో రూ.7 లక్షల వరకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పీఆర్సీ ఏర్పాటు సమయానికి లేరు. రెండున్నర ఏళ్ళ తర్వాత వారికి ప్రొబేషన్ ఇచ్చి ఒక స్కేలు అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు’’ అని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు