Crime News: ఆమె మౌనం.. అతడి ప్రాణం తీసింది

పనికి వెళ్లిన చోట పరిచయమైన ఓ మహిళ కొద్దిరోజులుగా తనతో మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆమె ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Updated : 26 Nov 2021 05:27 IST

పరిచయస్థులిరాలి ఇంట్లో యువకుడి ఆత్మహత్య 

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: పనికి వెళ్లిన చోట పరిచయమైన ఓ మహిళ కొద్దిరోజులుగా తనతో మాట్లాడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆమె ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బల్కంపేట్‌కు చెందిన దుర్గేశ్‌(31) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌. ఏడాదిగా అతనికి కుటుంబ సభ్యులు వివాహ సంబంధాలు చూస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓల్డ్‌బోయిన్‌పల్లి మైత్రివనం కాలనీలోని ఓ ఇంట్లో పని చేయడానికి వెళ్లిన అతనికి ఆ ఇంటి మహిళ(43)తో పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె తరచూ అతనితో ఫోన్‌లో మాట్లాడుతుండేది. ఆ ఇంట్లో ఎలక్ట్రికల్‌ పనులేవైనా అతనితో చేయించుకునేవారు. దీంతో అతడు తరుచూ ఆ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. కొద్దిరోజులుగా ఆ మహిళ అతనితో మాట్లాడడం మానేసింది. మాట్లాడేందుకు అతడు పలుమార్లు యత్నించాడు. ఉపయోగం లేకపోవడంతో మనస్తాపానికి గురై గురువారం ఆ మహిళ ఇంటికి వచ్చి కొద్దిసేపు ఆమెతో మాట్లాడాడు. తర్వాత ఇంటి మొదటి అంతస్తులోని పడక గదిలోకి వెళ్లి తలుపు గడియ వేసి, సీలింగ్‌ ఫ్యాన్‌కు తన చొక్కాతో ఉరేసుకున్నాడు. ఎంతకూ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి ఆ మహిళ పైకి వెళ్లి చూసేసరికి ఉరికి వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి శవాగారానికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని