logo

Crime News:మెప్పు పొందాలనుకుని.. కటకటాల పాలయ్యాడు

ఏదో అనుకుంటే ఇంకేదో అయింది.. బంధువుల్లో హీరోయిజం చూపాలని.. కిడ్నాప్‌ డ్రామా నడిపించిన యువకుడు, సహకరించిన స్నేహితులు జైలుపాలయ్యారు.

Updated : 25 Dec 2021 09:29 IST

చిన్నారి కిడ్నాప్‌ డ్రామా.. దగ్గరి బందువు సహా ఐదుగురి అరెస్ట్‌

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఏదో అనుకుంటే ఇంకేదో అయింది.. బంధువుల్లో హీరోయిజం చూపాలని.. కిడ్నాప్‌ డ్రామా నడిపించిన యువకుడు, సహకరించిన స్నేహితులు జైలుపాలయ్యారు. గురువారం సికింద్రాబాద్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్‌ ఉదంతం కలకలం సృష్టించింది. పోలీసులను ఉరుకులుపరుగులు పెట్టించింది. రాత్రి జీడిమెట్లలో చిన్నారి కనిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌ సాయిఈశ్వర్‌గౌడ్‌ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

గతంలోనూ విఫలయత్నం.. సీతాఫల్‌మండికి చెందిన సిరివెల్లు సాయిరాం(25) అక్వేరియం వ్యాపారి. రెజిమెంటల్‌బజార్‌లో అతనికి వరసకు సోదరి అయ్యే ఉమ, ఆమె భర్త శ్రీనివాస్‌ వారి పిల్లలు తరుణ్‌(6), కీర్తన(3) ఉంటున్నారు. ఆ కుటుంబం మెప్పు పొంది దగ్గర కావాలని సాయిరాం ప్రయత్నించేవాడు. ఇందుకు తరుణ్‌ను కిడ్నాప్‌ చేసి, తానే వెతికి అప్పగించినట్టు చూపాలనే పథకంవేశాడు. ఈనెల 21న బాలుడి పాఠశాల వద్దకు స్నేహితులను పంపాడు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫోన్‌ చేయగా.. భయపడిన తల్లి తానే పిల్లవాడిని తీసుకెళ్తానంటూ చెప్పడంతో పథకం బెడిసికొట్టింది. దీంతో సాయిరాం మరో ఎత్తు వేశాడు. గురువారం కీర్తన ఇంటినుంచి బయటికొచ్చి అడుకుంటున్నపుడు మైనర్‌ అయిన తన సోదరుడు, అతడి స్నేహితుడితో కిడ్నాప్‌ చేయించాడు. వారిని చింతల్‌లో ఉండమని చెప్పాడు. బిడ్డ కనిపించక వెతుకుతున్న తల్లి ఉమకు, ఇద్దరు యువకులు చిన్నారిని తీసుకెళ్లారని ఒక మహిళ చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాఉ వెంటనే టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో రంగంలోకి దిగారు. చిన్నారిని కిడ్నాప్‌ చేసింది మేనమామేనని గుర్తించారు. చింతల్‌లో ఉన్న సాయిరాం స్నేహితుడు నితిన్‌కుమార్‌ ఇంట్లో వెతకగా చిన్నారి కనిపించింది. గురువారం రాత్రి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.

పట్టుబడిందిలా.. చిన్నారి కిడ్నాప్‌తో ఆందోళనకు గురైన శ్రీనివాస్‌ దంపతులను నిందితుడు ఓదార్చాడు. తానూ వెతుకుతున్నట్టు నటించాడు. పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పిల్లల పాఠశాల వద్ద ఆరాతీశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కొందరు సాయిరాంపై అనుమానం వెలిబుచ్చడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. పాఠశాలలో ఉన్న తనకోసం వచ్చిన ఇద్దరితో సాయిరాం వీడియోకాల్‌లో మాట్లాడినట్టు తరుణ్‌ పోలీసులకు చెప్పాడు. చింతల్‌లో ఉన్న చిన్నారి ఆచూకీ తానే గుర్తించినట్టుగా సాయిరాం పోలీసులనూ నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు నితిన్‌ను ప్రశ్నించటంతో కిడ్నాప్‌ డ్రామా బయపడింది. ప్రధాన సూత్రధారి సాయిరాం(25), నితిన్‌కుమార్‌(21), ముగ్గురు మైనర్లను అరెస్ట్‌ చేశారు. బంధువుల నుంచి మెప్పు పొందేందుకు అపహరణకు పాల్పడినట్లుగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని