Shaik Rasheed: గుంటూరు జిల్లాలో ఆనందోత్సాహాలు.. రషీద్కు అభినందనల వెల్లువ
భారత్ అండర్-19 క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలవడంతో జిల్లాలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. యువ భారత జట్టు ఈ విజయం సాధించడం వెనుక గుంటూరుకు చెందిన షేక్ రషీద్ కీలక పాత్ర పోషించాడు. తమ కుమారుడు రషీద్ జట్టును గెలిపించడంతో తల్లిదండ్రులు
ఈటీవీ, గుంటూరు, న్యూస్టుడే-ఎస్వీఎన్ కాలనీ
భారత్ అండర్-19 క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలవడంతో జిల్లాలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. యువ భారత జట్టు ఈ విజయం సాధించడం వెనుక గుంటూరుకు చెందిన షేక్ రషీద్ కీలక పాత్ర పోషించాడు. తమ కుమారుడు రషీద్ జట్టును గెలిపించడంతో తల్లిదండ్రులు జ్యోతి, బాలీషా, బంధువులు, స్నేహితులు స్వీట్లు పంచుకున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, వివిధ వర్గాలకు చెందినవారు రషీద్తో పాటు అతని తల్లిదండ్రులను అభినందించారు.
భర్తకు మిఠాయి తినిపిస్తున్న జ్యోతి
రోజుకు 8 గంటలు శిక్షణ.. తన కుమారుడు రషీద్ గొప్పగా ఆడటం గర్వంగా ఉందని తండ్రి బాలీషా సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పేరును అనుమడింప జేశాడని... ఆంధ్రప్రదేశ్ పేరును... గుంటూరు పేరును ప్రపంచానికి చాటిచెప్పాడని రషీద్ తండ్రి బాలీషా సంతోషం వ్యక్తం చేశారు. రషీద్ రోజుకు 8 గంటలు శిక్షణ తీసుకునేవాడని, కష్టపడినందుకు ఫలితం దక్కిందన్నారు. మధ్య తరగతి కుటుంబం కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామని, మంగళగిరి క్రికెట్ అకాడమీలో రషీద్కు చోటుదక్కాక.. చదువు, శిక్షణ బాగా సాగాయని బాలిషా చెప్పారు. చాలా మంది కోచ్లు రషీద్ను మెరుగుపర్చారని.. చాలా మంది స్నేహితులు తనను ఆదుకున్నారని రషీద్ తండ్రి కృతజ్ఞతలు చెప్పారు.
జాతీయ టెస్ట్ జట్టులో స్థానమే లక్ష్యం.. అండర్-19 క్రికెట్ కప్కు ఎంపికైనప్పుడే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్లో 31 పరుగులు చేసినప్పటికీ రషీద్ తాను అవుటైన తీరుకు తీవ్ర నిరాశ చెందాడు. ఆ మ్యాచ్లో జట్టు గెలిచింది. రెండోసారి మ్యాచ్కు సిద్ధమవుతున్న సమయంలో కొవిడ్ పాజిటివ్గా రావడంతో ఆడే అవకాశం కోల్పోయాడు. కానీ హోటలో ఉంటూ మాతో వీడియోకాల్ మాట్లాడేవాడు. మేము కొద్దిగా ఆందోళన చెందాం. కానీ రషీదే మాకు ధైర్యం చెప్పాడు. సెమీఫైనల్స్లో 94 పరుగులతో చెలరేగిపోయాడు. ఫైనల్లో ఆడినతీరు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. జాతీయ టెస్ట్ జట్టులో స్థానమే రషీద్ తరువాతి లక్ష్యం.
- జ్యోతి, బాలీషా, రషీద్ తల్లిదండ్రులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.