logo

పెళ్లయి మరో వ్యక్తితో సాన్నిహిత్యం.. మందలించాడని తమ్ముడిని చంపించిన అక్క

తనకు అడ్డువస్తున్నాడనే నెపంతో పథకం ప్రకారం అక్క తమ్ముడినే హత్య చేయించిన ఘటన మెట్‌పల్లి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోదరి ప్రియుడు లొంగిపోవడంతో ఆరు నెలల క్రితం జరిగిన హత్య విషయం బహిర్గతమైంది.

Updated : 09 Mar 2022 09:00 IST

ఆరు నెలల ఆలస్యంగా ఘటన వెలుగులోకి
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు


నిందితుల అరెస్టు చూపుతున్న డీఎస్పీ రవీందర్‌ రెడ్డి

మెట్‌పల్లి, న్యూస్‌టుడే : తనకు అడ్డువస్తున్నాడనే నెపంతో పథకం ప్రకారం అక్క తమ్ముడినే హత్య చేయించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోదరి ప్రియుడు లొంగిపోవడంతో ఆరు నెలల క్రితం జరిగిన హత్య విషయం బహిర్గతమైంది. మంగళవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో సీఐ శ్రీను, ఎస్సై సదాకర్‌లతో కలిసి మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కళానగర్‌లో నివాసముంటున్న మహ్మద్‌ అబ్దుల్‌ సోహెల్‌(19) 2021, సెప్టెంబర్‌ 4న ఇంట్లోంచి వెళ్లిపోయాడని పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైంది. సోహెల్‌ అక్క నిషత్‌ఫాతిమా(21)తో సజ్జత్‌అలీ అనే వ్యక్తితో సాన్నిహిత్యం ఉంది. సోదరుడు సోహెల్‌ అక్క పాతిమాను హెచ్చరించాడు. సోహెల్‌ తన స్నేహితుడైన బాలుడి(17)కి చెప్పి ఆమెను బెదిరించాడు. దీంతో తమ్ముడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. సోహెల్‌ను చంపితే రూ.లక్ష సుపారీ ఇస్తానని తనను బెదిరించిన బాలుడితో ఒప్పందం చేసుకుంది. 2021 సెప్టెంబర్‌ 4న రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలుడు, సోహెల్‌ను పట్టణంలోని ఎస్సారెస్పీ ప్రధానకాలువ పక్కన ఉన్న దోబీఘాట్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ సజ్జత్‌అలీ, మరో స్నేహితుడు ఎం.డి మహ్మద్‌(19), బాలుడు, సోహైల్‌ కలిసి మద్యం తాగారు. అనంతరం గొడవ జరగ్గా సోహెల్‌ తలపై బీరు సీసాలతో కొట్టి, దోబీఘాట్లో దొరికిన చీరతో మెడకు ఉరి బిగించి చంపారు. శవం ఆధారం దొరకకుండా నీళ్లు ప్రవహిస్తున్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో పడవేశారు. సోదరి ప్రియుడు, నిందితుడైన సయ్యద్‌ సజ్జత్‌ అలీ అలియాస్‌ షాబాద్‌(25) సోమవారం జగిత్యాలకు చెందిన ఖాజీ కుతుబుద్దీన్‌ అనే వ్యక్తితో వచ్చి పోలీసులకు లొంగిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సజ్జత్‌ అలీని విచారించగా హత్య పూర్తి వివరాలు తెలిపాడు. విచారణలో మిగతా నేరస్థులు నేరాన్ని అంగీకరించారు. హత్యకు కారకులైన సయ్యద్‌ సజ్జత్‌అలీ, బాలుడు, ఎం.డి.మహ్మద్‌, మృతుని సోదరి నిషత్‌ఫాతిమాలను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిచామని పోలీసులు తెలిపారు. తమకు శవం చూపాలంటూ మృతుడి బంధువులు స్టేషన్‌కు తరలివచ్చారు. మృతదేహాన్ని గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వారిని డీఎస్పీ శాంతింపజేశారు. సోదరి నిషత్‌ఫాతిమాకు వివాహం అయింది. భర్త కరీంనగర్‌లో ఉంటున్నాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని