logo

‘గొడ్డలి తిరగేసి రెండు సార్లు కొట్టా.. అనుమానంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించా’

ఈ ఏడాది జనవరి 10న అర్ధరాత్రి దాటిన తర్వాత తెర్లాం మండలంలోని రాజయ్యపేటలో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గాడి గౌరమ్మ(67) సజీవ దహనమైంది. ఆమె అగ్నిప్రమాదంలో మృతి చెందిందని పోలీసులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు, గ్రామ

Updated : 16 Mar 2022 10:10 IST


పోలీసుల అదుపులో సింహాచలం

తెర్లాం(విజయనగరం), న్యూస్‌టుడే: ఈ ఏడాది జనవరి 10న అర్ధరాత్రి దాటిన తర్వాత తెర్లాం మండలంలోని రాజయ్యపేటలో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గాడి గౌరమ్మ(67) సజీవ దహనమైంది. ఆమె అగ్నిప్రమాదంలో మృతి చెందిందని పోలీసులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కూడా ఆ విషయం మర్చిపోయారు.

సరిగా రెండు నెలలకు.. గౌరమ్మ ప్రమాదవశాత్తు కాలిపోలేదని, తానే హత్య చేసి చంపేశానంటూ అదే గ్రామానికి చెందిన ఆర్‌.సింహాచలం అనే యువకుడు పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోవడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి బొబ్బిలి సీఐ శోభన్‌బాబు, ఎస్‌ఐ సురేంద్రనాయుడు విచారించారు. ఈ సమయంలో సింహాచలం చెప్పిన వివరాలిలా ఉన్నాయి.

‘నాలుగేళ్ల క్రితం నా భార్య, పిల్లలకు గౌరమ్మ చేతబడి చేయడంతో అనారోగ్యం పాలయ్యారు. దీంతో భార్య పిల్లలతో సహా తన ఇంటికి వెళ్లిపోయింది. గత ఏడాది దసరాకు ముందు నా తండ్రికి చేతబడి చేయడంతో అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో గౌరమ్మను ఎలాగైనా చంపాలనుకున్నా.. పగలే హత్య చేసి పోలీసులకు లొంగిపోవాలి అనుకున్నా. జనవరి 10న ఓ ఇంటి నుంచి గొడ్డలి, పెట్రోల్‌ తీసుకొని అర్ధరాత్రి దాటిన తర్వాత గౌరమ్మ ఇంటికి వెళ్లా. నిద్రిస్తున్న ఆమె మెడపై గొడ్డలి తిరగేసి రెండు సార్లు బలంగా కొట్టాను. ఇంకా బతికే ఉందేమోనన్న అనుమానంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించాను. చేతబడి చేసిందని తప్ప వేరే ఉద్దేశంతో చేయలేద’ని నిందితుడు తెలిపాడు.

ఎందుకు లొంగిపోయాడంటే..

ఈ నెల 13న అర్ధరాత్రి గ్రామంలోని పాతినవలస కనకరాజుకు చెందిన పశువులశాల కాలిపోయింది. ఆ సమయంలో సింహాచలం అటుగా వెళ్లడం గమనించిన బాధితులు ఆయన ఇంటికి వెళ్లి నిలదీశారు. పశువులశాలను తాను కాల్చలేదని, గౌరమ్మను కాల్చానని చెప్పడంతో అందరూ భయంతో పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడే తప్పు ఒప్పుకోవడంతో అరెస్ట్‌ చేసి, రిమాండ్‌ నిమిత్తం బొబ్బిలి ఏజేఎఫ్‌సీఎం కోర్టుకు తరలించినట్లు సీఐ శోభన్‌బాబు చెప్పారు.

గౌరమ్మ (పాతచిత్రం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని