logo

Telangana News: ఇద్దరిని ప్రేమించిన యువకుడు.. కేసు పోలీస్‌స్టేషన్‌కు..!

ఇద్దరినీ ప్రేమించిన ఓ యువకుడు ఒక్కరినే పెళ్లి చేసుకోవడంతో ఆ ‘ప్రేమ’ వ్యవహారం నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 19 Mar 2022 09:14 IST

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: ఇద్దరినీ ప్రేమించిన ఓ యువకుడు ఒక్కరినే పెళ్లి చేసుకోవడంతో ఆ ‘ప్రేమ’ వ్యవహారం నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన దుడ్డెల అజయ్‌ స్థానికంగా గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్‌ వర్కర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్నేళ్ల క్రితం ఇదే మండలంలోని ముజ్జుగూడెం గ్రామానికి చెందిన సమీప బంధువు అయిన యువతితో పరిచయం ఏర్పడింది. వీరి ప్రేమ పెద్దలకు తెలిసి ఇద్దరికీ గత ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేశారు. ఇది ఇలా ఉండగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన తన మేనమామ కుమార్తెతో ప్రేమాయణం నడిపాడు. ఈ ఏడాది జనవరిలోనే అక్కడి చర్చిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను గురువారం రాత్రి రామచంద్రాపురంలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న ముజ్జుగూడెం యువతి కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక నాయకుల సహాయంతో శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. సదరు యువకునిపై ఫిర్యాదు చేశారు. కాగా ఇద్దరు యువతులు ఎవరికి వారు ‘నాకు అన్యాయం జరిగితే చస్తాను’ అని ఎస్సై స్రవంతి ఎదుట తెలిపినట్లు సమాచారం. యువకుడు కూడా తన ఇష్ట పూర్తిగానే వివాహం చేసుకున్నట్లు వారికి తెలిపాడు. అయితే ఈ వివాదం పరిష్కరించేందుకు అధికార పార్టీ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని