logo

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం: ప్రియుడు మృత్యువాత.. చున్నీ తెగడంతో బతికిన ప్రియురాలు

ప్రేమికులు బలవన్మరణానికి యత్నించగా ప్రియుడు చనిపోయి, ప్రియురాలికి మృత్యువు తప్పిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో శుక్రవారం జరిగింది. చిన్నకోడూరు మండలం చెర్లఅంకిరెడ్డిపల్లికి చెందిన....

Updated : 02 Apr 2022 14:26 IST

 

చిన్నకోడూరు, న్యూస్‌టుడే: ప్రేమికులు బలవన్మరణానికి యత్నించగా ప్రియుడు చనిపోయి, ప్రియురాలికి మృత్యువు తప్పిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో శుక్రవారం జరిగింది. చిన్నకోడూరు మండలం చెర్లఅంకిరెడ్డిపల్లికి చెందిన మోతకాని అంజమ్మ, సత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు నరేశ్‌(26) ఏడాది క్రితం దుబాయి వెళ్లి వచ్చి సిద్దిపేటలోని ఓ హోటల్‌లో పనిచేస్తుండేవాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వారిద్దరి కులాలు వేర్వేరు. నరేశ్‌కు ఎనిమిది నెలల క్రితం మరో గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. అప్పటినుంచి సంసారంలో గొడవలు రావడంతో భార్య ఆర్నెల్ల క్రితం తల్లిగారింటికి వెళ్లిపోయింది. మార్చి 30న నరేశ్‌, యువతి ఎవరికీ చెప్పకుండా ఇళ్లల్లో నుంచి దుస్తులు సర్దుకొని వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు చిన్నకోడూరు ఠాణాలో నరేశ్‌పై ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదైంది. శుక్రవారం ఉదయం సికింద్లాపూర్‌ శివారులోని గుట్టపై ఉన్న చెట్టు కొమ్మకు ఇద్దరూ ఒకేసారి చున్నీలతో ఉరేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో నరేశ్‌కు ఉరి పడి చనిపోయాడు. మరో చున్నీ కొమ్మ నుంచి తెగిపోవడంతో ఆమె జారి కింద పడింది. అపస్మారక స్థితికి చేరింది. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. మృతుడి తండ్రి సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శివానందం కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని