logo

HYD News: బాబోయ్‌ దొంగలు.. తూచ్‌ అంతా ఒట్టిదే!

ఇటీవల బహదూర్‌పల్లికి చెందిన కార్తీక్‌ అనే యువకుడు డయల్‌ 100కు ఫోన్‌చేసి రైళ్లలో బాంబులు అమర్చారంటూ సమాచారం చేరవేశాడు. ఆగమేఘాల మీద రైల్వే పోలీసులు, బాంబు స్క్వాడ్‌, జాగిలాలతో

Updated : 20 Apr 2022 10:46 IST

కుటుంబ కలహాలతో ఇళ్లలో చోరీ డ్రామాలు
డయల్‌ 100కు 10శాతం పైగా నకిలీ ఫోన్‌కాల్స్‌
మహానగరంలో పోలీసులకు వింత అనుభవాలు

ఇటీవల బహదూర్‌పల్లికి చెందిన కార్తీక్‌ అనే యువకుడు డయల్‌ 100కు ఫోన్‌చేసి రైళ్లలో బాంబులు అమర్చారంటూ సమాచారం చేరవేశాడు. ఆగమేఘాల మీద రైల్వే పోలీసులు, బాంబు స్క్వాడ్‌, జాగిలాలతో తనిఖీ చేసి అవన్నీ వదంతులని తేల్చారు. ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు.

ఈనాడు, హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: సైబరాబాద్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో డయల్‌ 100కు రోజూ 800-900 ఫోన్‌కాల్స్‌ వస్తుంటాయి. ఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు 6-7 నిమిషాల వ్యవధిలో చేరుతున్నారు. కొందరు ఆకతాయిలు. మరికొందరు కుటుంబ తగాదాలతో విలువైన పోలీసుల సమయాన్ని వృథా చేస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో కొందరు ప్రబుద్ధులు చేస్తున్న చేష్టలపై పోలీసులు సీరియస్‌ యాక్షన్‌ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏటా డయల్‌ 100కు వచ్చే ఫోన్‌కాల్స్‌లో 10శాతం వరకూ కుటుంబ గొడవలు, ఆటపట్టించాలనే ఉద్దేశంతో చేస్తున్నవి ఉంటున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంలో తప్పుడు ఫోన్‌కాల్స్‌ చేసిన వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వటం, మందలించి పంపటమో చేసేవారు. తాజా సంఘటనలో రాచకొండ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.

ఎవరి లెక్క వారిదే
స్మార్ట్‌ఫోన్లు చేతికొచ్చాక.. సామాజిక మాధ్యమాల్లో ఆకతాయిల హల్‌చల్‌ పెరిగింది. వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చే పోస్టులను యథాతథంగా ఫార్వార్డ్‌ చేస్తున్నారు. ఇవి కొన్ని ఇబ్బందులకు దారితీస్తున్నాయి.
* కుషాయిగూడ పరిధిలో రాజకీయపార్టీ నాయకులు గొడవ పడుతున్నారంటూ వాట్సాప్‌లో రాగానే ఓ యువకుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. అక్కడకెళ్లి పరిశీలించిన పోలీసులు తప్పుడు ప్రచారంగా నిర్ధారించారు.
* శివారు ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు కుమారుడి సంరక్షణలో ఉంటోంది. నడుచుకుంటూ వెళ్తున్న తనపై దాడిచేసి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించకపోవటంతో ఆమెను గట్టిగా మందలించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గొలుసును తానే కుమార్తెకు ఇచ్చినట్టు అంగీకరించింది. విషయం కొడుక్కి తెలిస్తే కోప్పడతాడనే భయంతో అలా చేసినట్టు కన్నీరు పెట్టుకుంది.
* బండ్లగూడ సమీపంలోని ఇంట్లోకి చొరబడిన దొంగలు 40తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ లభించిన వేలిముద్రలు పాత నేరస్తులతో సరిపోలకపోవడంతో ఇంటిదొంగల పని కావచ్చనే కోణంలో కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వయోధికులైన తల్లిదండ్రుల నుంచి సొమ్ము కాజేసేందుకు కుమారుడే భార్యతో కలసి డ్రామా ఆడినట్టు నిర్ధారించారు.

అక్రమ సంబంధాల్లోనే అధికం
ఉత్తుత్తి దొంగతనాలు, తప్పుడు ఫిర్యాదులు అక్రమ సంబంధాలు/సహజీవనం వల్లనే వస్తుంటాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మల్కాజిగిరి డివిజన్‌ పరిధిలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ప్రవేశించిన అగంతకుడు బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో అక్కడ చోరీ జరిగినట్టు ఆధారాలు లభించలేదు. బాధితురాలు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో ఇదంతా ఇంటిదొంగ పని కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో కేపీహెచ్‌బీ కాలనీలోని ఇంట్లో రూ.10 లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. కుటుంబ యజమాని ఫిర్యాదుతో పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌ను సేకరించారు. ఆ ఇంట్లోని మహిళే తన ప్రియుడికి బంగారు ఆభరణాలు, నగదు ఇచ్చి పంపినట్టు దర్యాప్తులో తేల్చారు. సున్నితమైన అంశాలు కావటంతో తప్పుడు ఫిర్యాదులుగా గుర్తించినా మందలించి వదిలేస్తున్నట్టు సైబరాబాద్‌కు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకే చేసినట్టు గుర్తిస్తే కేసులు నమోదు చేస్తున్నట్టు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని