logo

Hyderabad News: ఫోన్‌ బిల్లుతో షాక్‌.. వినియోగదారుడికి కళ్లు బైర్లు..!

టెలికాం సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన భారతీ ఎయిర్‌టెల్‌ సిబ్బంది నిర్వాకం వినియోగదారుడికి కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. అంతర్జాతీయ రోమింగ్‌ సేవల పథకం కోసం సంప్రదిస్తే తప్పుడు

Updated : 28 Apr 2022 09:30 IST

తప్పును సరిదిద్దుకొని రూ.50 వేలు పరిహారం చెల్లించండి

భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థను ఆదేశించిన హైదరాబాద్‌ కమిషన్‌-1

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: టెలికాం సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన భారతీ ఎయిర్‌టెల్‌ సిబ్బంది నిర్వాకం వినియోగదారుడికి కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. అంతర్జాతీయ రోమింగ్‌ సేవల పథకం కోసం సంప్రదిస్తే తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆయనకు రూ.1,41,770 బిల్లు వచ్చింది. విదేశాలకు కుటుంబంతో కలిసి సరదాగా వెళ్లిన వ్యక్తికి తీవ్ర మనోవేదనను మిగిల్చింది. ఈ వ్యవహారంలో భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ తీరును తప్పుపట్టిన హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 రూ.50 వేల పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.

లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని జల్‌వాయు టవర్స్‌లో ఉంటున్న విశ్రాంత వింగ్‌ కమాండర్‌ సమర్‌ చక్రవర్తి, భార్యతో కలిసి బహమాస్‌ అటు నుంచి యూఎస్‌ఏ వెళ్లాలనుకున్నారు. అంతర్జాతీయ రోమింగ్‌ కోసం భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థను ఆశ్రయించారు. 2014 నుంచి పోస్ట్‌పెయిడ్‌ సర్వీస్‌ వినియోగిస్తున్నానని బేగంపేట్‌లోని ఎయిర్‌టెల్‌ సేవా కేంద్రం సిబ్బందికి తెలపగా అమెరికా ప్లాన్‌-బి వినియోగిస్తే బహమాస్‌లోనూ పనిచేస్తుందని చెప్పారు. ఫిర్యాదీ 2018 జూన్‌ 27న న్యూజెర్సీ చేరుకొని ఆమేరకు రూ.3,999+ రూ.149 రీఛార్జీ చేయించారు. 500 అవుట్‌గోయింగ్‌ కాల్స్‌, 5జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ ఎస్‌ఎంఎస్‌లు, ఇన్‌కమింగ్‌ కాల్స్‌ వర్తిస్తాయంటూ సందేశం వచ్చింది. కొత్త ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసినప్పటినుంచి పలుమార్లు అంతర్జాతీయ రోమింగ్‌ సేవలు అందలేదని పదేపదే డిస్‌కనెక్ట్‌ అవుతోందని ప్రతివాద సేవా కేంద్రానికి సమర్‌ ఫిర్యాదు చేశారు. నాస్సౌ, బహమాస్‌ చేరుకోగానే బిల్లు రూ.1,41,770 అయ్యిందంటూ సందేశం వచ్చింది. అప్రమత్తమైన ఆయన మరోమారు సేవా కేంద్రాన్ని సంప్రదించగా, అక్కడ ఆ ప్లాన్‌ పనిచేయదంటూ చెప్పడంతో అవాక్కయ్యారు. సేవా కేంద్రం సిబ్బంది చెప్పడంతోనే ఆ ప్లాన్‌ తీసుకున్నానని, ఇదంతా వారి నిర్లక్ష్యమే అంటూ వాదించారు. దిగొచ్చిన ఎయిర్‌టెల్‌ సంస్థ ఆ బిల్లులో కొంత మొత్తాన్ని తగ్గిస్తామంది. తన సర్వీసుకు కేవలం రూ.28వేల క్రెడిట్‌ పరిమితి ఉందని, అంతకు మించి బిల్లు ఎలా అయ్యిందంటూ ప్రశ్నిస్తూ సమర్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఎయిర్‌టెల్‌ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విదేశాలకు వెళ్లిన అనుభూతిని కోల్పోయానని పేర్కొన్నారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్‌ ఇందులో ప్రతివాద సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, తప్పుడు బిల్లును సరిదిద్దుకోవడంతో పాటు పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో 12 శాతం వడ్డీతో కలిపి ఆ మొత్తాన్ని చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని