logo

Hyderabad News: సింగం స్టయిల్లో పోలీసు వేట!

ఆపరేషన్‌ ‘డి’. కరడుగట్టిన మాదకద్రవ్యాల స్మగ్లర్‌ డానీను పట్టుకునేందుకు సింగం సినిమాలో వ్యూహం. ఇదే తరహాలో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు పక్కా పథకం వేసి ఓ నైజీరియన్‌ను అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో

Updated : 02 May 2022 08:52 IST

 కొకైన్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ అరెస్ట్‌

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ఆపరేషన్‌ ‘డి’. కరడుగట్టిన మాదకద్రవ్యాల స్మగ్లర్‌ డానీను పట్టుకునేందుకు సింగం సినిమాలో వ్యూహం. ఇదే తరహాలో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు పక్కా పథకం వేసి ఓ నైజీరియన్‌ను అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గంగాధర్‌, ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన డానియేల్‌ అలియాస్‌ డానీ(22) విద్యార్థి వీసాపై భారత్‌ వచ్చాడు. కొద్దికాలం దిల్లీలో ఉన్నాడు. అక్కడ పరిచయమైన నైజీరియన్‌, మాదకద్రవ్యాల విక్రేత రిచర్డ్‌ సులివాన్‌ ద్వారా మత్తుపదార్థాలు హైదరాబాద్‌లో సరఫరా చేయటం ప్రారంభించాడు. సమాచారం అందుకున్న మాదాపూర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ బృందం నిఘా ఉంచింది. నెలక్రితం డానియేల్‌ నగరానికి వచ్చాడు. హైదర్షాగూడలోని సన్‌సిటీలో నైజీరియన్లతో ఉంటూ కొకైన్‌, ఎండీఎంఏ విక్రయిస్తున్నట్టు గుర్తించారు. 7 బృందాలుగా మారిన పోలీసులు శనివారం సాయంత్రం కాపు కాశారు. వారి కదలికలను గమనించిన డానియేల్‌ ద్విచక్ర వాహనం నుంచి కిందకు దూకి వీధుల్లో పరుగెత్తుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దాదాపు 2కిలోమీటర్ల దూరం పరుగులు తీసి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి 4 గ్రాముల కొకైన్‌, 10 ఎండీఎంఏ మాత్రలు స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రిచర్డ్‌ను పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని దిల్లీ పంపనున్నట్టు సమాచారం. సమావేశంలో మాదాపూర్‌  ఎస్‌వోటీ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, రాజేంద్రనగర్‌ డీఐ పవన్‌ తదితరులు పాల్గొన్నారు. మాదాపూర్‌ ఎస్‌వోటీ, రాజేంద్రనగర్‌ పోలీసుల చూపిన ధైర్యాన్ని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని