logo

Crime News: కడుపున పుట్టకపోయిన అపురూపంగా పెంచారు.. చివరకు

 కడుపున పుట్టకపోయిన అపురూపంగా పెంచారు. ఏది కావాలన్నా అమర్చిపెట్టారు. అయినా కనికరంలేని ఆ కుమారుడు తల్లిని దారుణంగా చంపి బంగారు ఆభరణాలతో పారిపోయాడు. అంతర్జాతీయ

Published : 08 May 2022 09:17 IST

భూదేవి                  సాయితేజ

సరూర్‌నగర్‌ క్రైం, న్యూస్‌టుడే: కడుపున పుట్టకపోయిన అపురూపంగా పెంచారు. ఏది కావాలన్నా అమర్చిపెట్టారు. అయినా కనికరంలేని ఆ కుమారుడు తల్లిని దారుణంగా చంపి బంగారు ఆభరణాలతో పారిపోయాడు. అంతర్జాతీయ మాతృదినోత్సవం ముందురోజు నగరంలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. సరూర్‌నగర్‌  ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఎస్సై లక్ష్మయ్య కథనం ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌ న్యూ గడ్డిఅన్నారానికి చెందిన జంగయ్య, భూదేవి(58) దంపతులు. వీరికి పిల్లలు లేకపోవటంతో సాయితేజ (31)ను దత్తత తీసుకున్నారు. కొద్దికాలంగా అతడి మానసిక ప్రవర్తన సరిగా లేకపోవటంతో తరచూ తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి ముగ్గురూ భోజనం చేసి నిద్రపోయారు. శనివారం తెల్లవారుజామున భూదేవి చనిపోయి పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలు మాయమవడం.. సాయితేజ కనిపించకపోవడంతో గుర్తు తెలియని దుండగులు తల్లిని చంపి, కుమారుణ్ని కిడ్నాప్‌ చేసి ఉంటారని భావించారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టు పక్కల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సాయితేజ భుజానికి సంచితో నడుచుకుంటూ వెళ్లడాన్ని గుర్తించారు. అక్కడ లభించిన ఆధారాలతో దత్తపుత్రుడే ఈ హత్య చేసి బంగారు ఆభరణాలతో పారిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. హత్యకు దారితీసిన కారణాలు, ఎవరైనా సాయం చేశారా! బయట వ్యక్తుల ప్రమేయం ఉందా! అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని