logo

Crime News: దిల్‌సుఖ్‌నగర్‌ హత్య కేసులో కీలక మలుపు.. దత్తపుత్రుడు సాయితేజ దారుణ హత్య!

దిల్‌సుఖ్‌నగర్‌లో ఈనెల 7న జరిగిన మహిళ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. పెంపుడు తల్లి భూదేవి (58) హత్య ఘటనలో నిందితుడైన దత్తపుత్రుడు సాయితేజ

Updated : 13 May 2022 10:18 IST

అమ్రాబాద్‌లో స్నేహితుడి చేతిలో హతం

పరారీలో మరో ముగ్గురు నిందితులు

సాయితేజ

సరూర్‌నగర్‌ క్రైం, అమ్రాబాద్‌, న్యూస్‌టుడే: దిల్‌సుఖ్‌నగర్‌లో ఈనెల 7న జరిగిన మహిళ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. పెంపుడు తల్లి భూదేవి (58) హత్య ఘటనలో నిందితుడైన దత్తపుత్రుడు సాయితేజ (27)ను అతడి స్నేహితుడు శివ దారుణంగా హత్య చేశాడు. అమ్రాబాద్‌ అడవుల్లో రెండురోజుల క్రితం చంపేయగా.. పోలీసులకు భయపడిన శివ గురువారం సరూర్‌నగర్‌ పోలీస్‌ఠాణాలో లొంగిపోయాడు. అనంతరం సరూర్‌నగర్‌ పోలీసులు అక్కడి అటవీశాఖ, పోలీసుల సహాయంతో మృతదేహాన్ని గుర్తించారు. ఐదురోజుల క్రితం భూదేవిని హత్యచేసిన అనంతరం సాయితేజ, శివలు శ్రీశైలానికి పారిపోయారు. అక్కడికి వెళ్లాక పోలీసులు గుర్తించకుండా సాయితేజ గుండు కొట్టించుకున్నట్లు పోలీసులు సమాచారం సేకరించారు. సాయితేజ వెంట ఉన్న బ్యాగులో 35తులాల బంగారం, రూ.10లక్షల నగదు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అమ్రాబాద్‌ ఎస్సై సద్దాం హుసేన్‌ వివరాల ప్రకారం.. శివ, సాయితేజ ఈనెల 10న శ్రీశైలం వెళ్లారని, తిరుగు ప్రయాణంలో అమ్రాబాద్‌ మండలం మల్లెతీర్థం జలపాతంకు వెళ్లారని, దూరంగా ఉన్న ఓ మడుగు వద్దకు వెళ్లాక సాయితేజను శివ బండరాయితో తలపై కొట్టి చంపేశాడు. అనంతరం బ్యాగులో రాళ్లు నింపి నడుముకు కట్టి మడుగులో పారేశారని వివరించారు. మృతదేహాన్ని వెలికితీసి అచ్చంపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.

అజ్ఞాతంలో ఇతర నిందితులు..

దిల్‌సుఖ్‌నగర్‌ న్యూ గడ్డిఅన్నారం కాలనీకి చెందిన జంగయ్య యాదవ్‌, భూదేవి(58) దంపతులకు నిందితుడైన సాయితేజ దత్తపుత్రుడు. అయితే అతని మానసిక ప్రవర్తన సరిగా లేకపోవడంతో స్నేహితులకు వీరి ఆస్తిపై కన్నుపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు స్నేహితులు నర్సింహ, సాయిగౌడ్‌, చింటూ, శివలు సాయితేజను పావుగా వాడుకొని ఇంట్లో ఉన్న పెంపుడు తల్లిని చంపి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, నగదు తీసుకువచ్చే విధంగా వారం రోజుల ముందు నుంచే పక్క ప్రణాళికను రూపొందించారు. అనుకున్నట్లుగానే భూదేవిని సాయితేజ, శివలు దిండుతో నోరు, ముక్కు మూయగా నర్సింహ చేతులు పెట్టుకొని చింటు, సాయిగౌడ్‌లు కాళ్లను గట్టిగా పట్టుకొని చనిపోయిందని నిర్ధారించుకొని బంగారం, నగదుతో పరారయ్యారు. సొమ్ముపై ఆశతో ఆ నలుగురు కలిసి సాయితేజను చంపేశారు. గురువారం రాత్రి శివను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అతని నుంచి రూ.లక్ష, 22 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని