logo

Road Accident: రోడ్డు ప్రమాదంలో అమెరికా ఆశ గల్లంతు!

అతివేగం, అజాగ్రత్తతో కారు నడపడంతో బోల్తా పడి, అమెరికాకు వెళ్లాల్సిన యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఆదివారం జరిగింది. ఏఎస్‌ఐ పవన్‌, స్థానికులు తెలిపిన వివరాలు..

Updated : 16 May 2022 06:49 IST

కోహెడ మండలంలో కారు అదుపుతప్పి యువకుడి దుర్మరణం

కోహెడ గ్రామీణం, న్యూస్‌టుడే: అతివేగం, అజాగ్రత్తతో కారు నడపడంతో బోల్తా పడి, అమెరికాకు వెళ్లాల్సిన యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఆదివారం జరిగింది. ఏఎస్‌ఐ పవన్‌, స్థానికులు తెలిపిన వివరాలు.. పరివేద గ్రామానికి చెందిన యువకుడు చాడ రఘునందన్‌రెడ్డి(24) మరో యువకుడు గవ్వ రాందివాకర్‌రెడ్డి కలిసి కోహెడకు వ్యక్తిగత పనుల నిమిత్తం ప్రయాణమయ్యారు. రాందివాకర్‌రెడ్డి కారు నడుపుతున్నారు. పరివేద గ్రామం దాటగానే వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లో దొర్లుకుంటూ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. రాందివాకర్‌రెడ్డి ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు చేరుకొని చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో రఘునందన్‌రెడ్డి చనిపోయాడు. రాందివాకర్‌రెడ్డికి చికిత్స చేస్తున్నారు. రఘునందన్‌రెడ్డి తండ్రి సంపత్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంపత్‌రెడ్డికి రఘునందన్‌రెడ్డితో పాటు కుమార్తె సంతానం. బీటెక్‌ పూర్తి చేసిన రఘునందన్‌.. ఉన్నత చదువు కోసం పది రోజుల్లో అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఎన్నెన్నో ఆశలతో పెంచి పెద్ద చేసిన ఏకైక కుమారుడు ప్రమాదంలో కన్నుమూయడంతో తల్లిదండ్రులు ఏకధాటిగా విలపిస్తున్నారు. సంతోషంగా ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి ఇలా విగతజీవుడై రావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని