logo

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న టాటా ఏస్‌ వాహనం.. ఏడుగురి మృతి

కుటుంబసభ్యులతో వారంతా శివయ్య దర్శనం చేసుకున్నారు. దేవుని దర్శనం పూర్తికావడంతో వారంతా ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు. తమ ఊరి సరిహద్దులోకి చేరుకున్నారు. కొన్ని నిమిషాల్లో వారింటి వద్ద దిగిపోవడానికి సిద్ధమవుతున్నారు.

Updated : 30 May 2022 09:42 IST

మాచర్ల, రెంటచింతల, గురజాల, న్యూస్‌టుడే : కుటుంబసభ్యులతో వారంతా శివయ్య దర్శనం చేసుకున్నారు. దేవుని దర్శనం పూర్తికావడంతో వారంతా ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు. తమ ఊరి సరిహద్దులోకి చేరుకున్నారు. కొన్ని నిమిషాల్లో వారింటి వద్ద దిగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో పెద్దశబ్దం వచ్చింది. దొర్లుకుంటూ రోడ్డు మీద పడ్డారు. ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి.. నెత్తురోడుతూ హాహాకారాలు.. చిమ్మచీకట్లో రక్షించండి.. అని ఆర్తనాదాలు.. ఆదివారం అర్ధరాత్రి రెంటచింతల రహదారి ఈ భయానక సంఘటనకు సాక్షిగా నిలిచింది. రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారంతా సరకు రవాణా చేసే టాటా ఏస్‌ వాహనంలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. శ్రీశైలం నుంచి తిరిగొస్తున్న వీరి వాహనం రెంటచింతల పొలిమేరలోకిరాగానే స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. వాహనం పల్టీలు కొట్టడంతో ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడటంతో ఆర్తనాదాలు చేశారు.

చీకటే ప్రమాదానికి కారణం : మాచర్ల నుంచి రెంటచింతలకు ప్రవేశించే మొదట్లో గోలివాగు కాలువ ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానాలు చేసేందుకు వాహనాలు ఆపుతుంటారు. ఇక్కడ అంతా చీకటిగా ఉండటంతో దగ్గరకు వచ్చే వరకు అక్కడ నిలిపి ఉన్న వాహనాలు కనిపించవు. దీంతో రహదారిపై ప్రయాణం చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ వ్యవసాయకూలీలు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్‌ నిత్యం తిరిగే రహదారి అన్న నిర్లక్ష్యంగా వేగంగా దూసుకెళ్లాడు.  రహదారిపై ఆగి ఉన్న ఉన్న లారీని గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో నలుగురు చనిపోగా, తీవ్ర గాయాలైన మరో ముగ్గురు గురజాల ఆసుపత్రిలో చనిపోయారు. క్షతగాత్రులందరినీ గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని