రాయితీల్లో కోత.. ఎన్నాళ్లీ రైల్వే వాత!
60లో మిగిలినవి 14 మాత్రమే
సాధారణ రైళ్లలోనూ కొంతమందికే వెసులుబాటు
ఈనాడు - హైదరాబాద్
కరోనా బూచి చూపి.. ప్రత్యేక రైళ్లంటూ దాదాపు ఏడాది పాటు 30 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయడంతో పాటు 60 రకాల రాయితీలకు గండికొట్టారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత కూడా రైలు నంబరుకు ముందు సున్నాని ఉంచి ప్రత్యేక రైళ్లను కొనసాగించే ప్రయత్నాలపై ప్రయాణికుల నుంచి విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఈ నెల 16 నుంచి సాధారణ రైళ్లన్నింటినీ పునరుద్ధరించారు. రైల్వే రాయితీలను మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో 60 రకాల రాయితీలకు ప్రయాణికులు దూరమయ్యారు. ఇటీవలే ఓ 14 రకాలకు మాత్రమే అనుమతి ఇచ్చి మిగతా అన్నింటికీ భారతీయ రైల్వే మంగళం పాడింది. అన్నీ సాధారణ రైళ్లు అయినప్పుడు.. రాయితీల విషయంలో ఎందుకీ కోత అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
సీనియర్ సిటిజన్లకూ ఊరట లేదు
పురుషులు 60 ఏళ్లు, మహిళలకు 58 ఏళ్లు పూర్తయినవారికి భారతీయ రైల్వే టికెట్లో 50శాతం రాయితీ ఇచ్చేది. అన్ని తరగతుల ప్రయాణాలకు వీటిని వర్తింపజేసింది. దశాబ్దాలుగా వీటిని కొనసాగించిన రైల్వే కరోనా మహమ్మారి తర్వాత రద్దు చేసింది. వైద్యులు, నర్సులు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధులు, క్రీడాకారులు, విధులకు వెళ్లే పోలీసులు, జర్నలిస్టులకు, పద్మ అవార్డు గ్రహీతలకు.. ఇలా 56 రకాలుగా ఇచ్చిన రాయితీలను కూడా రైల్వే రద్దు చేసింది. ప్రత్యేక రైళ్లు నడుపుతున్న సమయంలో అనవసర ప్రయాణాలను తగ్గించి.. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అంటూ దీనిపై రైల్వే దాటవేసింది. ఇప్పుడు సాధారణ రైళ్లు నడుపుతున్నా.. ఆ రాయితీలన్నింటినీ పునరుద్ధరించకుండా.. కంటి తుడుపుగా 14 రకాలకే పరిమితమైంది. అదీ రాజధాని ఎక్స్ప్రెస్లలో పూర్తి స్థాయిలో కాకుండా.. కోత విధించింది. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ 14 రకాల్లోనూ కొందరిని పక్కన పెట్టింది.
అమలవుతున్నవి ఇవే..
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, రక్తహీనత, క్యాన్సర్, హృద్రోగ, జన్యుపరమైన వ్యాధులు హిమోఫిలియా, కిడ్నీ, కుష్ఠు, టీబీ, తలసీమియా, విద్యార్థులు, అంధులు, చెవిటి - మూగ, అంగవైకల్యం, మానసిక రోగులకు మాత్రమే రైల్వే రాయితీలు అందజేస్తోంది. ఇందులో కూడా.. దివ్యాంగులకు గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ రైళ్లలో రాయితీలో కోత పెట్టింది. వీరికి సహాయంగా ఉన్న వారికి కూడా కొన్ని విభాగాల్లో ఉన్న 50 శాతం రాయితీని 25 శాతానికి కుదించింది. ఇక వీటికి ఎవరు అర్హులు, అనర్హులు అనేది ఆన్లైన్లో టిక్కెట్ రిజర్వు చేసినప్పుడు ఆయా విభాగాల్లో వివరాలను పొందుపర్చింది.