logo

చలానాలపైనే కన్ను.. ట్రాఫిక్‌పై మాగన్ను

వాహనాలు నిబంధనల మేరకు సాఫీగా వెళ్లేలా చేయడం ట్రాఫిక్‌ పోలీసుల విధి. ఒకప్పుడు ఇదే వారి పనితీరుకు కొలమానంగా ఉండేది. ఇప్పుడు.. రోజుకు ఎన్ని చలానాలు వేశావు.. ఎంతమేర ఖజానాకు రాబడి తెచ్చావు అనేది కొలబద్దగా మారింది.

Published : 07 Dec 2021 02:38 IST

ప్రధాన కూడళ్లలోనూ కన్పించని పోలీసులు

మితిమీరుతున్న వాహనదారుల వేగం
జనాల ప్రాణాలకు భద్రత కరవు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

* వాహనాలు నిబంధనల మేరకు సాఫీగా వెళ్లేలా చేయడం ట్రాఫిక్‌ పోలీసుల విధి. ఒకప్పుడు ఇదే వారి పనితీరుకు కొలమానంగా ఉండేది. ఇప్పుడు.. రోజుకు ఎన్ని చలానాలు వేశావు.. ఎంతమేర ఖజానాకు రాబడి తెచ్చావు అనేది కొలబద్దగా మారింది. కెమెరాలు చేతపట్టి వాహనదారుల ఉల్లంఘనలను ఫొటోలు తీయడంలో నిమగ్నమవుతున్న పోలీసులు ట్రాఫిక్‌ను గాలికి వదిలేస్తున్నారు.

* రాజధాని పోలీసుల కొత్త నినాదం పోలీసు రహిత కూడళ్లు(కాప్‌లెస్‌ పోలీసింగ్‌). ట్రాఫిక్‌ పోలీసులు ఉంటేనే నిబంధనలు పాటించని ఆకతాయిలు.. ఈ కొత్త విధానంతో మరింత రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రుళ్లు వరకు మద్యం తప్పతాగి వాయు వేగంతో రోడ్లపై దూసుకెళుతున్నారు.

ఈ రెండు కారణాలు నగరంలో పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు ఊతమిస్తున్నాయి. మద్యం తాగి వేగంగా వాహనాలు నడుపుతున్న కారణంగా అనేకమంది సామాన్యుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

గరంలో ట్రాఫిక్‌ సిగ్నళ్లున్న కూడళ్లు 340. ప్రతి సిగ్నల్‌ వద్ద కాకపోయినా రద్దీ కూడళ్లలోనైనా నలుగురైదురుగు ట్రాఫిక్‌ పోలీసులుంటే వాహనదారులకు కొంత భయం ఉంటుంది. మూడు కమిషనరేట్ల ట్రాఫిక్‌ పోలీసు విభాగం గత ఏడాదిన్నర కాలంగా అమెరికా, ఇంగ్లండ్‌ పోలీసింగ్‌ విధానాలను అవలంబిస్తోంది. బ్రిటన్‌లో రద్దీ రోడ్లపైకి వాహనాలు ఎక్కాలంటే రోజు, సమయం ఆధారంగా ట్రాఫిక్‌ ఫీజు భారీగా చెల్లించాలి. అందుకే అక్కడి ప్రధాన మార్కెట్ల వద్ద వాహనాల సంఖ్య తక్కువగా ఉంటుంది. మనకు అటువంటి విధానాల్లేవు. రద్దీ రోడ్లలోనూ వాహనదారులు దూసుకెళుతున్నారు. హైదరాబాద్‌లో ఒక్కటంటే ఒక్క బహుళంతస్తుల వాహనాల పార్కింగ్‌ సముదాయాన్ని జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేయలేదు. రోడ్ల పక్కన ఎక్కడంటే అక్కడ వాహనాలను నిలిపేస్తున్నారు. మూడొంతుల కాలిబాటలు ఆక్రమణల్లో ఉన్నాయి. కాలిబాటలు కాళీలేక 20 లక్షల మంది ప్రజలు రోడ్డుపక్కన ప్రమాదకరంగా నడుస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన పోలీసులు, ఉల్లంఘనులపై చలానాలు వేయడంపైనే దృష్టిసారించారు. తమ కళ్లముందే ట్రాఫిక్‌ స్తంభించినా, వాహనదారులు ఇష్టానుసారం వెళుతూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోకుండా కెమెరాలతో ఫొటోలు తీయడంపైనే దృష్టిపెడుతున్నారు. ప్రధాన జంక్షన్లలోనూ పోలీసులు లేక ఎర్రలైటు పడినా చాలామంది దూసుకుపోతున్నారు. దీంతో అనేక జంక్షన్లలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.  

రాత్రుళ్లు కానరాని ట్రాఫిక్‌ పోలీసులు
హైదరాబాద్‌ సీపీగా మహేందర్‌రెడ్డి ఉన్నప్పుడు రాత్రి పదిగంటల వరకు ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లపై ఉండేవారు. కొంతమందిని రాత్రి 11 గంటల వరకు ఉంచేవారు. ఇప్పుడు రాత్రిపూట ఒక్కరంటే ఒక్కరూ కన్పించడంలేదు. మాసాబ్‌ట్యాంక్‌ వంతెన దిగి మెహిదీపట్నం రైతుబజారు మీదుగా నానల్‌నగర్‌ సిగ్నల్‌ దాటాలంటే రోజూ కనీసం 20 నిమిషాల సమయం పడుతోంది. ఈ పరిస్థితి నగరంలో చాలాచోట్ల ఉంది. నగరంలో 60 కి.మీ. వేగానికి మించి వెళ్లడానికి వీల్లేదు. ఎక్కడా ఈ నిబంధనను పాటించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని