logo

Hyderabad News: రూ.కోటి ఇస్తావా? నీ బిడ్డను చంపాలా?

సంపన్నుల పిల్లలను అపహరించి రూ.కోట్లు సంపాదించాలనుకున్న ముగ్గురు నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి ఒక

Updated : 21 Jan 2022 09:18 IST

బాలిక అపహరణకు యత్నం.. ముగ్గురి అరెస్టు

ఈనాడు,హైదరాబాద్‌: సంపన్నుల పిల్లలను అపహరించి రూ.కోట్లు సంపాదించాలనుకున్న ముగ్గురు నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి ఒక పిస్తోలు, ఐదు తూటాలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బోయిన్‌పల్లిలో ఉంటున్న బల్క్‌డ్రగ్‌ ఫార్మాకంపెనీ నిర్వాహకుడు మనోజ్‌జైన్‌ కుమార్తె(16)ను అపహరించేందుకు ఈనెల 10న ముగ్గురు నిందితులు ప్రయత్నించి, విఫలమవడంతో పారిపోయారు. రూ.కోటి ఇవ్వకపోతే నీ కుమార్తెను చంపేస్తామంటూ ఇంటర్నెట్‌ ఫోన్‌ ద్వారా బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని, కీలకాధారాలు లభించడంతో నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నామని కొత్వాల్‌ తెలిపారు.

మీది రాజస్థాన్‌.. మాదీ రాజస్థానే..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన జవారీలాల్‌ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు. బాచుపల్లిలో ఐరన్‌, హార్డ్‌వేర్‌ వ్యాపారం చేస్తున్నాడు. జవారీలాల్‌ తండ్రి రమేష్‌కు మనోజ్‌జైన్‌ తెలుసు. తన కుమారుడు జవారీలాల్‌ అక్కడే ఉన్నాడు.. మనం.. మనం రాజస్థాన్‌ వాళ్లం ఎప్పుడైనా నా కుమారుడితో మాట్లాడండి అనేవాడు. మనోజ్‌జైన్‌ జవారీలాల్‌కు ముఖపరిచయం లేకపోయినా తండ్రి ఫోన్‌లో చెప్పడంతో ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడన్న వివరాలు తెలుసు. వ్యాపారంలో సహకరించేందుకు జవారీలాల్‌ తన మేనల్లుడు విక్రమ్‌ను జోధ్‌పూర్‌ నుంచి రప్పించాడు. జవారీలాల్‌ పేకాట, ఇతర దుర్వ్యసనాలకు ఖర్చుపెడుతుండడంతో నష్టాలు మొదలయ్యాయి. వీటిని అధిగమించేందుకు సంపన్నుల పిల్లలను కిడ్నాప్‌చేయాలంటూ పథకం వేశాడు. మధ్యప్రదేశ్‌కు వెళ్లి రూ.30వేలతో దేశీ పిస్తోలు, తూటాలు కొనుక్కొచ్చాడు. జోధ్‌పూర్‌లో ఉంటున్న తన స్నేహితుడు మహేంద్రప్రతాప్‌ సింగ్‌ను హైదరాబాద్‌ రప్పించాడు.

రెక్కీ చేసి..మాస్కులు.. మంకీక్యాప్‌లు పెట్టుకుని

మనోజ్‌జైన్‌ ఇల్లు పరిసర ప్రాంతాలను తెలుకున్న జవారీలాల్‌ ఈనెల 8,9న రెక్కీ నిర్వహించాడు. ఈనెల 10న మనోజ్‌జైన్‌ కుమార్తెను అపహరించాలనుకున్నాడు. ముగ్గురూ కలిసి రెండుబైకుల్లో బోయిన్‌పల్లిలోని మనోజ్‌జైన్‌ ఇంటికి వెళ్లారు. వెళ్లేముందు ఎవరూ గుర్తుపట్టకుండా మాస్కులు, మంకీక్యాప్‌లు పెట్టుకున్నారు. బాలిక బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి బాలికను పట్టుకునేందుకు ప్రయత్నించారు. గట్టిగా కేకలు వేయడంతో పారిపోయారు. కొద్దిసేపటికే ఇంటర్నెట్‌ ఫోన్‌ద్వారా మనోజ్‌జైన్‌కు ఫోన్‌చేసి రూ.కోటి ఇవ్వకపోతే మీ కుమార్తెను చంపేస్తామంటూ బెదిరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని