ట్రక్కు రహస్య క్యాబిన్లో గంజాయి రవాణా
ట్రక్కులో రహస్య క్యాబిన్ తయారు చేసి అందులో గంజాయిని ఉంచి సినీ ఫక్కీలో ఒడిశా నుంచి ఉత్తర్ప్రదేశ్కు తరలించే ముఠా గుట్టు రట్టయింది. ముగ్గురు అంతర్రాష్ట్ర విక్రేతలను అరెస్టు చేశారు.
మహ్మద్ ఇక్బాల్, షారుఖ్, మహ్మద్ సలీం
రాయదుర్గం, న్యూస్టుడే: ట్రక్కులో రహస్య క్యాబిన్ తయారు చేసి అందులో గంజాయిని ఉంచి సినీ ఫక్కీలో ఒడిశా నుంచి ఉత్తర్ప్రదేశ్కు తరలించే ముఠా గుట్టు రట్టయింది. ముగ్గురు అంతర్రాష్ట్ర విక్రేతలను అరెస్టు చేశారు. వారి నుంచి 265 కిలోల సరకును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలో మాదాపూర్ డీఎస్పీ శిల్పవల్లి ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తర్ప్రదేశ్ హత్రస్ జిల్లా, నౌఖెల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ (35) ట్రక్కు డ్రైవర్లుగా పనిచేసే.. యూపీ ఫిరోజాబాద్ జిల్లా అబ్బాస్ నగర్ వాసి షారుఖ్ (30), యూపీ ఇటీవా నగర్ జిల్లా, జస్వంత్ నగర్కు చెందిన మహ్మద్ సలీంలతో ఇక్బాల్ ముఠా ఏర్పాటు చేశాడు. తన సోదరుడికి చెందిన ట్రక్కు డ్రైవరు క్యాబిన్లో మార్పులు చేసి రహస్య అరలు తయారు చేశాడు. గంజాయి విక్రయాలు సాగించే ఒడిశావాసి బబ్బులాల్తో ఇక్బాల్ పరిచయం చేసుకుని దందా మొదలు పెట్టాడు. ఈనెల 21న ఒడిశా కొరాపుట్ జిల్లా, దర్లిపుట్ గ్రామానికి వెళ్లి అక్కడ 265 కేజీల గంజాయిని సేకరించారు. 89 ప్యాకెట్లలో నింపి రహస్య క్యాబిన్లో ఉంచి యూపీకి వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఈ నెల 22న మాదాపూర్ హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ సమీపంలోకి వచ్చి ట్రక్కును నిలిపారు. 23న సాయంత్రం విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.