logo

జూదర్లకు చైనా అత్యాధునిక సాంకేతిక పరికరాలు

చైనా నుంచి ఆన్‌లైన్‌లో దిగుమతి చేసుకున్న అత్యాధునిక సాంకేతిక వస్తువులను జూదర్లకు సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను తుకారాంగేట్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 20 May 2022 02:01 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: చైనా నుంచి ఆన్‌లైన్‌లో దిగుమతి చేసుకున్న అత్యాధునిక సాంకేతిక వస్తువులను జూదర్లకు సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను తుకారాంగేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను నార్త్‌జోన్‌ డీసీపీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, గోపాలపురం ఏసీపీ సుధీర్‌, ఇన్‌స్పెక్టర్లు ఎల్లప్ప, అంబటి ఆంజనేయులు వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన పండ్ల వ్యాపారి ఆసిఫ్‌ఖాన్‌(46), వీధి వ్యాపారి కాలాపత్తర్‌వాసి మహ్మద్‌ అఫ్రోజ్‌ఖాన్‌(36), నాచారానికి చెందిన గాజుల దుకాణంలో పని చేసే మొహమ్మద్‌ అర్షద్‌(22), మెల్విన్‌(22) జూదం ఆడే సమయంలో ముందున్న వ్యక్తికి వేసే కార్డును ఈజీగా గుర్తించే ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కళ్లద్దాలు, సెల్‌ఫోన్లు అనేక రకాలైన వాటితోపాటు వీటికి లింక్‌ ఉండే ప్లేయింగ్‌ కార్డులను చైనా నుంచి ఆన్‌లైన్‌లో సరఫరా చేసుకుంటూ ఎక్కువ ధరలకు జూదర్లకు విక్రయిస్తున్నారు.

గుర్తించిందిలా... సికింద్రాబాద్‌ ఈస్ట్‌మారేడుపల్లిలోని గోల్డెన్‌ బేకరీ నిర్వాహకుడు సయ్యద్‌ ఇంతియాజ్‌ ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.500 తీసుకుంటూ అందర్‌ బాహార్‌ కార్డ్‌ గేమ్‌(జూదం) ఆడేందుకు అనుమతిస్తుంటాడు. ఈనెల 14న జూదం కొనసాగుతుండగా తుకారాంగేట్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఈసీఐఎల్‌కు చెందిన ధోతి రమేష్‌, ఒర్స్‌ యాదగిరి, అన్నకుమార్‌లతోపాటు సయ్యద్‌ ఇంతియాజ్‌ను అరెస్ట్‌ చేశారు. అదే సమయంలో డబ్బులు పోగొట్టుకున్న జూదర్లు ప్రతిసారి రమేష్‌ గెలుస్తున్నాడని చెప్పారు. రమేష్‌ వద్ద స్వాధీనం చేసుకున్న రెండుసెల్‌ఫోన్లలో ఒక ఫోన్‌ చైన్‌కు సంబంధించి ఉండగా అనుమానంతో అతడిని విచారించగా అసలు విషయాన్ని బయటపెట్టాడు. తాను కార్డులకు లింక్‌తో ఉన్న సెల్‌ఫోన్‌తో ప్లేయింగ్‌ కార్డులను ఇయర్‌ ఫోన్‌కు వచ్చే సమాచారంతో గుర్తిస్తున్నట్లు చెప్పాడు. వాటిని ఆసిఫ్‌ఖాన్‌ వద్ద కొన్నట్లు వివరించాడు. అతను మహ్మద్‌ అఫ్రోజ్‌ఖాన్‌(36), మొహమ్మద్‌ అర్షద్‌(22), మెల్విన్‌(22)ల వివరాలను తెలియజేశారు. వారి వద్ద నుంచి వాటర్‌ బాటిల్‌ కెమెరా, రిస్ట్‌బ్యాండ్‌ పరికరాలు, చేతి గడియారాలు, మొబైల్‌ఫోన్‌, స్పోర్ట్స్‌ రిస్ట్‌ బ్యాండ్‌, చైనా ప్లేయింగ్‌ కార్డులను ఇలా 16రకాల సాంకేతిక కెమెరాలతో కూడిన రూ.5లక్షల విలువైన సామగ్రి, రూ.11500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని