logo

మనం సిన్మా తీస్తున్నాం.. రాత్రుళ్లు చర్చించుకుందాం

‘‘నీ కథ బాగుంది... సినిమా తీసేందుకు అవసరమైనన్ని సన్నివేశాలున్నాయి... కథను మరింతగా మెరుగు పరిచేందుకు మనం రాత్రుళ్లు చర్చించుకుందాం... ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్తే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.. 

Updated : 20 May 2022 02:59 IST

 

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, గోల్కొండ: ‘‘నీ కథ బాగుంది... సినిమా తీసేందుకు అవసరమైనన్ని సన్నివేశాలున్నాయి... కథను మరింతగా మెరుగు పరిచేందుకు మనం రాత్రుళ్లు చర్చించుకుందాం... ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్తే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.. అక్కడ నా కోర్కెలు తీర్చలేదనుకో.. సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కకుండా చేస్తా’’ అంటూ మహిళా కథా రచయితను బెదిరించిన సినీ నిర్మాతపై గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నిర్మాత వైఖరితో భయపడిన బాధితురాలు తొలుత ‘షి’బృందానికి ఫిర్యాదు చేయగా... ఆమెను భరోసా కేంద్రానికి పిలిపించారు. డీసీపీ శిరీష రాఘవేంద్ర స్వయంగా బాధితురాలితో మాట్లాడి గోల్కొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయించారు.

ఆరునెలల క్రితం.. ఆన్‌లైన్‌లో పరిచయం .. హైదరాబాద్‌లో ఉంటున్న మహిళా కథా రచయిత తన వద్ద ఉన్న కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరునెలల క్రితం ఒక సినీ నిర్మాత ఆన్‌లైన్‌లో పరిచయమయ్యాడు. విభిన్న నేపథ్యమున్న కథలు, సంఘటనలను సినిమాలుగా తీస్తానని, ఖర్చు ఎంతైనా ఇబ్బంది లేదంటూ మహిళా రచయితకు చెప్పాడు. కథ, సన్నివేశాల చిత్తు ప్రతిని ఆమె నిర్మాతకు అందజేశారు. కథను చదువుతానంటూ చెప్పిన నిర్మాత ఆమె ఫోన్‌ చేసినప్పుడల్లా తర్వాత మాట్లాడదాం అనేవాడు. కొద్దిరోజుల క్రితం అతడే ఆమెకు ఫోన్‌ చేశాడు. కథ బాగుంది.. రాత్రుళ్లు కలిస్తే ఇంకా బాగుంటుదని అన్నాడు.అప్పటి నుంచి వరుసగా రాత్రుళ్లు ఫోన్లు చేసి లైంగిక కోర్కెలు తీర్చాలని.. లేదంటే నీకు ఒక్క సినిమాకు రాయకుండా అడ్డుకుంటానంటూ బెదిరించాడు. బాధితురాలు భయంతో పోలీసులను ఆశ్రయించగా.. నిర్మాతను అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీసులకు అప్పగించారు.

నాలుగు నెలల్లో 423 ఫిర్యాదులు..

* బెదిరింపులు, ఈవ్‌టీజింగ్‌లతో తమను భయపెడుతున్నారంటూ నాలుగునెలల్లో 423మంది బాధితులు ‘షి’బృందాలను ఆశ్రయించారు. ఇందులో 203 మంది నేరుగా రాగా.. 181మంది 9490616555 నంబర్‌కు వాట్సాప్‌ చేశారు. మిగిలిన 39మంది సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేశారని డీసీపీ శిరీష రాఘవేంద్ర తెలిపారు.

* ‘షి’బృందాలను ఆశ్రయించిన వారి ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు 57 కేసులను నమోదు చేయించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న 52మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 15మందిపై పెట్టీకేసులు నమోదు చేశారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్‌ పాల్పడుతున్న 191మంది పురుషులు, 23మంది బాలురకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

* చార్మినార్‌ ఠాణా పరిధిలో నివాసముంటున్న ఒక యువతిని తీవ్రంగా వేధిస్తున్న సయ్యద్‌ అబ్దుల్‌ హసన్‌ను అరెస్ట్‌చేసి కోర్టులో హాజరు పరచగా.. 8 రోజుల జైలుశిక్ష, రూ.250 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

* సంతోష్‌ నగర్‌ క్రాస్‌రోడ్స్‌ సమీపంలోని ఓ కళాశాల వద్ద ఈవ్‌టీజింగ్‌ చేస్తున్న మహ్మద్‌ సొహైల్‌ను అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరచగా.. 8 రోజుల జైలుశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

* నిన్నూ, నీభర్తను చంపేస్తానంటూ నిత్యం ఫోన్లు, సందేశాలతో ఒక యువతిని బెదిరిస్తున్న ఇ.శ్రీనివాస్‌ను ‘షి’బృందం పోలీసులు ఓయూ ఠాణాలో అప్పగించారు.

* సంతోష్‌నగర్‌లో ఉంటున్న ఒక యువతిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న షేక్‌ మోతిషామ్‌ అహ్మద్‌ను ‘షి’బృందం పోలీసులు అదుపులోకి తీసుకుని సంతోష్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని