logo

VV Vinayak: మర్యాదలైనా.. రుచులైనా.. గోదారోళ్ల ప్రత్యేకతే వేరు: వినాయక్‌

ఆయ్‌.. పల్లెకు పండగొచ్చిందండి.. అదేనండీ.. సంక్రాంతి.. ఎక్కడెక్కడో ఉన్నోళ్లంతా.. సొంతూళ్లలో వాలిపోతారండీ.. మా గోదారోళ్ల అల్లుళ్లకైతే చెప్పనవసరం లేదండి. ఆల్లకి ముందే ఆహ్వానాలు ఎల్లిపోతాయండి.. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి గానండీ.. వాళ్లకు మేం చేసే మర్యాదలకు. ఉబ్బితబ్బిబ్బయిపోతారండీ.. పిండివంటలు

Updated : 14 Jan 2022 09:39 IST

ఆయ్‌.. పల్లెకు పండగొచ్చిందండి.. అదేనండీ.. సంక్రాంతి.. ఎక్కడెక్కడో ఉన్నోళ్లంతా.. సొంతూళ్లలో వాలిపోతారండీ.. మా గోదారోళ్ల అల్లుళ్లకైతే చెప్పనవసరం లేదండి. ఆల్లకి ముందే ఆహ్వానాలు ఎల్లిపోతాయండి.. ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి గానండీ.. వాళ్లకు మేం చేసే మర్యాదలకు. ఉబ్బితబ్బిబ్బయిపోతారండీ.. పిండివంటలు, మాంసాహార ప్రియులకు ఘుమఘుమలాడే గరమ్‌ మసాలా కూరలు నోరూరిస్తాయి. ఇక తినలేను బాబోయ్‌ అనేదాక వదలమంటే నమ్మండి.. అందుకేనండీ.. మా జిల్లాతో బంధమున్న పలువురు సినీ ప్రముఖులు సంక్రాంతికి అత్తింటి ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తుంటారు.

ఆ మర్యాదలే వేరు..

‘‘ప్రముఖ సినీ దర్శకుడు వి.వి.వినాయక్‌ అత్తగారి ఊరు కోరుకొండ మండలం గాదరాడ ‘‘మర్యాదలైనా, రుచులైనా గోదారోళ్ల ప్రత్యేకతే వేరు. సంక్రాంతికి ఇక్కడ ఎక్కువ సందడి ఉంటుంది. తూర్పు లోగిళ్లు మర్యాదకు పుట్టినిల్లు. దర్శకుడిగా ఎంత పేరున్నా తూర్పు గోదావరి అల్లుడు అవ్వడమే గొప్పగా భావిస్తా. సంక్రాంతి సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా గడుపుతుంటా. పండగకు అల్లుడు వచ్చాడంటే అబ్బో ఆ మర్యాదే వేరు. మా అత్తగారి ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంట్లోవారే కాదు చుట్టు పక్కల వారి పలకరింపులు ఎంతో బాగుంటాయి. వారు చూపించే ఆప్యాయత, అనురాగం మరువలేనివి.’’

వీధంతా ఘుమఘుమలే..

ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌ రాజమహేంద్రవరం అల్లుడు. ‘‘సంక్రాంతి పండగంటే ఆ ముచ్చట్లు మామూలుగా ఉండవండోయ్‌. మా అత్తగారు చేసే పిండివంటల ఘుమఘుమలు వీధంతా వ్యాపించేవి. సున్నిఉండలు, జంతికలు తిని తీరాల్సిందే. పండగ మూడు రోజులు మెనూ ప్రకారంగా చేసే పులిహోర, బూరెలు, గారెలు, గుత్తివంకాయ కూర, పచ్చిపులుసు వంటి సంప్రదాయ ఆహారంతో హాయిగా అనిపించేది. సాయంత్రమయ్యేసరికి గోదావరి గట్టుపై కూర్చుని చల్ల గాలిని ఆస్వాదిస్తూ గడిపేవాళ్లం. గోదావరి జిల్లాల్లో పుట్టడం ఓ అదృష్టం. అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంకా అదృష్టం.’’.

నదీతీరం మరీ ఇష్టం...

సాయికుమార్‌ తనయుడు సినీ హీరో ఆది రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది శోభనాద్రి అల్లుడు. ‘‘నా భార్య అరుణతో కలిసి సంక్రాంతి పండగకు వచ్చినపుడు మూడురోజులు చాలా సరదాగా గడిచేవి. గోదావరి తీరమంటే మరీ మరీ ఇష్టం. ఎంత సేపు చూసినా తనివి తీరని అందాలవి. భోగి పండగ రోజున తెల్లవారుజామునే ఇంటి ముందు పెద్ద మంట వేసేవారు. మంట దగ్గర కొంత సమయం ఉంటే బయట చలి పోయి హాయిగా అనిపించేది. పండగ రోజున అత్తయ్య చేసే పిండి వంటలన్నీ బాగుంటాయి. ప్రత్యేకించి ఆమె చేసే ముక్కల పులుసు అంటే ఇష్టం. అక్కడ దొరికే రోజ్‌ మిల్క్‌ అంటే ఎక్కువగా ఇష్టపడతా. సంక్రాంతి అంటనే సినిమాలకు ప్రత్యేకం. అందుకే అక్కడ ఉన్నన్ని రోజులు అందరం కలిసి సినిమాలు చూసేవాళ్లం. ప్రస్తుతం పరిస్థితులు బాగా లేని కారణంగా ఈ ఏడాది అత్తారింట్లో పండగకు హాజరు కాలేకపోతున్నాం’’.

-న్యూస్‌టుడే, మామిడికుదురు, రాజమహేంద్రవరం సాంస్కృతికం, కోరుకొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని