విపత్తుల ముట్టడిలో రైతాంగం

మూకుమ్మడిగా దండెత్తుతున్న విపత్తులు, చీడపీడలకు వ్యవస్థాగత లోపాలు తోడై రైతన్నల వెన్నువిరుస్తున్నాయి. భారీ వర్షాలు, తెగుళ్ల తాకిడికి కర్షక లోగిళ్లలో పెనుచీకట్లు పరచుకొంటున్నాయి. తామర, గులాబీ పురుగుల మూలంగా మిర్చి, పత్తి తీవ్రంగా దెబ్బ తినగా- వరి, వేరుసెనగ, కంది, మినుము, మొక్కజొన్న, మామిడి వంటివీ నష్టాలనే మిగిల్చాయి.

Published : 21 Jan 2022 00:21 IST

మూకుమ్మడిగా దండెత్తుతున్న విపత్తులు, చీడపీడలకు వ్యవస్థాగత లోపాలు తోడై రైతన్నల వెన్నువిరుస్తున్నాయి. భారీ వర్షాలు, తెగుళ్ల తాకిడికి కర్షక లోగిళ్లలో పెనుచీకట్లు పరచుకొంటున్నాయి. తామర, గులాబీ పురుగుల మూలంగా మిర్చి, పత్తి తీవ్రంగా దెబ్బ తినగా- వరి, వేరుసెనగ, కంది, మినుము, మొక్కజొన్న, మామిడి వంటివీ నష్టాలనే మిగిల్చాయి. ఖరీఫ్‌ కాలంలో ఏపీలో రూ.16 వేల కోట్లకు పైగా పెట్టుబడి నష్టం సంభవించిందన్న కథనాలు- సాగుదారుల దయనీయ స్థితికి అద్దంపడుతున్నాయి. పొలంలో పెట్టిన సొమ్మంతా బూడిదలో పోసిన పన్నీరు కావడంతో తెలంగాణలో మిర్చి, పత్తి రైతుల గుండెలవిసి పోతున్నాయి. కలల పంటలన్నీ కళ్ల ముందే నేలవాలిపోయి, బతుకులకు రుణపాశాలు బిగుసుకొంటున్న దుస్థితిలో ప్రభుత్వాలు సత్వరం స్పందించాలి. అసహాయ అన్నదాతలకు ఆపన్నహస్తం అందించాలి. వరసకట్టిన ప్రకృతి వైపరీత్యాల ధాటికి నిరుడు దేశవ్యాప్తంగా 1.24 కోట్ల ఎకరాల్లో పంటలు ప్రభావితమైనట్లు కేంద్రం ఇటీవల లోక్‌సభకు నివేదించింది. తుపానులు, వరదలు, అకాల వర్షాలు, వడగండ్ల వానలతో సస్యక్షేత్రాల్లో సంభవిస్తున్న నష్టాలను గుర్తించడంలో వ్యయసాయాధికారుల అలసత్వం లోగడే వెలుగులోకి వచ్చింది. రైతాంగం మొరపెట్టుకొంటున్నా క్షేత్రస్థాయిలో చాలాచోట్ల వివరాల సేకరణకు మొండికేస్తున్న యంత్రాంగం- బాధితులకు అందాల్సిన తక్షణ సాయానికి గండికొడుతోంది. తెలంగాణ హైకోర్టు కొద్దినెలల క్రితం స్పష్టీక రించినట్లు, ఆపద వేళల్లో అన్నదాతలను ఆదుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. బీమా దన్నులేక ఆర్థికంగా చితికిపోతున్న చిన్న, సన్నకారు రైతాంగానికి తగిన పరిహారం అందించాల్సిన మానవీయ కర్తవ్యాన్ని సైతం ఉన్నత న్యాయస్థానం పాలకులకు గుర్తుచేసింది. ఆ మేరకు ప్రభుత్వాలు చొరవ తీసుకుంటేనే- కష్టాల సాగులో కన్నీరుమున్నీరవుతున్న కర్షకులకు సాంత్వన లభిస్తుంది!

ఆసేతుహిమాచలం సగానికిపైగా సాగుదారులను పంటల బీమా రక్షణఛత్రం కిందకు చేరుస్తామన్న సర్కారీ ప్రకటనలు ఆరేళ్ల క్రితం మోతెక్కిపోయాయి. 2016-17లో దేశవ్యాప్త సాగుభూమిలో 28.33శాతం బీమా పరిధిలో ఉంటే; 2019-20 నాటికి అది 24.80శాతానికి తెగ్గోసుకుపోయినట్లు అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. 2016-21 మధ్య ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌) కింద బాధితులకు అందాల్సిన రూ.3,381 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే పడి ఉన్నట్లు కేంద్రం గత నెలలో ప్రకటించింది. 2017-20 నడుమ బీమా సంస్థలు తిరగ్గొట్టిన పీఎంఎఫ్‌బీవై క్లెయిమ్‌ల సంఖ్య దాదాపు పది రెట్లు అధికమైంది. పంటల బీమా అమలులో పారదర్శకత లేమిని గతంలోనే ఎత్తిచూపిన పార్లమెంటరీ స్థాయీసంఘం- ఆయా పథకాలకు కేటాయింపులు ఇతోధికం చేసి, రైతులకు గరిష్ఠ స్థాయిలో లబ్ధి చేకూర్చాలని సూచించింది. ఏటా విరుచుకుపడుతున్న విపత్తులతో గాలిలో దీపాలవుతున్న కర్షకుల జీవితాలకు బీమాతో ధీమా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలూ పూర్తిస్థాయిలో చొరవ తీసుకోవాలి. దేశ ఆహారభద్రతకు రైతు శ్రేయస్సే పునాది. అందుకుగానూ అన్ని ప్రాంతాలకు అన్ని పంటలకు వర్తించేలా బీమాను బలోపేతం చేయాలన్న స్వామినాథన్‌ మేలిమి సిఫార్సుకు ఆచరణ రూపమివ్వడం అత్యవసరం. వ్యవసాయ మౌలిక వసతులను వృద్ధిచేస్తూ; స్థానిక అవసరాలు, ఎగుమతి అవకాశాలు, నేలల స్వభావానికి తగినట్లుగా జాతీయ సేద్య ప్రణాళికతో కర్షకలోకానికి దిశానిర్దేశం చేయడమూ కీలకమే. రుణ సదుపాయాల నుంచి గిట్టుబాటు ధరల వరకు సాగురంగాన్ని పట్టిపీడిస్తున్న సకల సమస్యల పరిష్కారంలో పాలకుల చిత్తశుద్ధే- సిరుల సేద్యానికి మేలుబాటలు పరుస్తుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.