న్యాయంకోసం... సమగ్ర సంస్కరణలు!
భాగ్యనగర శివార్లలో ఒంటరి ఆడపిల్ల ‘దిశ’ను బలితీసుకున్న మృగాళ్ల పైశాచికత్వంపై రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. నేరస్థులను కఠినంగా దండించాలని యావద్భారతం ముక్తకంఠంతో నినదించింది. కేసును శాస్త్రీయంగా దర్యాప్తు చేసి,....
భాగ్యనగర శివార్లలో ఒంటరి ఆడపిల్ల ‘దిశ’ను బలితీసుకున్న మృగాళ్ల పైశాచికత్వంపై రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. నేరస్థులను కఠినంగా దండించాలని యావద్భారతం ముక్తకంఠంతో నినదించింది. కేసును శాస్త్రీయంగా దర్యాప్తు చేసి, దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడటం- పోలీసుల సామర్థ్యానికి నాడు ఒక పరీక్షగా నిలిచింది. కానీ, వారేమి చేశారు? నిందితులు తమపై దాడి చేసి తప్పించుకుని పోవడానికి ప్రయత్నించారని, ఆత్మరక్షణార్థం తాము జరిపిన కాల్పుల్లో వాళ్లు హతమారిపోయారని ప్రకటించారు. అవన్నీ వట్టి అబద్ధాలని తాజాగా తేల్చిన జస్టిస్ సిర్పుర్కర్ సంఘం- పదిమంది పోలీసులపై హత్యానేరం నమోదు చేయాలని సిఫార్సు చేసింది. ఖాకీల ఎదురుకాల్పుల కథనాన్ని తూర్పారపట్టిన బాధ్యతాయుత పౌరసమాజం- ఒక నేరాన్ని నియంత్రించడానికి మరో నేరం చేస్తారా అని ఆనాడే నిలదీసింది. కామాంధులు ఒడిగట్టింది కచ్చితంగా అమానుష నేరమే. కానీ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పోలీసులే తూటాలతో తీర్పు చెప్పడం అంతకంటే పెద్ద అపరాధం. తక్షణ న్యాయం కోసం ప్రయత్నిస్తే అసలైన న్యాయం ప్రమాదంలో పడుతుందన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్.వి.రమణ ఇటీవలి హెచ్చరిక నూటికి నూరుపాళ్లు నిజం. మరోవైపు, మార్చి నెల నాటికి దేశీయంగా వివిధ న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు అపరిష్కృతంగా పడి ఉన్నాయి. న్యాయమూర్తులు, మౌలిక వసతుల కొరత వంటి సమస్యలెన్నో కోర్టుల్లో మేటవేసి, ప్రజలకు సత్వర న్యాయఫలాలను నిరాకరిస్తున్నాయి. తత్ఫలితంగా చట్టంపై ప్రజావిశ్వాసం పోనుపోను పెళుసుబారిపోతోంది. అంతిమంగా అరాచకత్వానికి దారితీసే ఆ దుస్థితి తప్పిపోవాలంటే- ఏళ్లూపూళ్లూ సాగుతున్న వ్యాజ్యాల విచారణ వేగం పుంజుకోవాలి. ప్రభుత్వాలు అందుకు అవసరమైన అన్ని చర్యలూ వెంటనే తీసుకోవాలి. ఉత్తర్ ప్రదేశ్, అస్సామ్ రాష్ట్రాల పూర్వ డీజీపీ ప్రకాశ్ సింగ్ లోగడ ఉద్ఘాటించినట్లు, పోలీసుల పనితీరులోని లోపాలను గుర్తించి సరిదిద్దడం; వారి దుష్కృతాలకు తగిన దండన విధించడమూ అత్యావశ్యకం!
‘పాపాల చిట్టాలో వ్యవస్థీకృత నేరగాళ్ల బృందమైన భారతీయ పోలీసుదళానికి దరిదాపుల్లోకి వచ్చే మరో అరాచక ముఠా ఏదీ దేశంలో లేదు’- అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఏఎన్ ముల్లా అయిదు దశాబ్దాల క్రితం చేసిన వ్యాఖ్య ఇది. ఇన్నేళ్లలో ఖాకీల దుష్కీర్తి ఇంకా దట్టమైందే తప్ప ఏమాత్రం తరుగు పడలేదు. సుప్రీంకోర్టు పూర్వ సీజేఐ జస్టిస్ వెంకటాచలయ్య స్పష్టీకరించినట్లు, ప్రాణాలు తీసే అధికారాన్ని ఏ చట్టమూ పోలీసులకు కట్టబెట్టలేదు. అయినా సరే, రాష్ట్రాలకు అతీతంగా ఎన్కౌంటర్లు యథేచ్ఛగా సాగిపోతూనే ఉన్నాయి. లాకప్ మరణాలూ అలాగే అడ్డూఅదుపూ లేకుండా సంభవిస్తున్నాయి. 2001-2020 మధ్య దేశంలో అటువంటి వాటికి సంబంధించి పోలీసు సిబ్బందిపై 893 కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాటిలో కేవలం 26మందికే శిక్షలు పడ్డాయి. నేరపరిశోధనలో నేటికీ హింసనే ప్రధాన సాధనంగా ప్రయోగిస్తున్న ఖాకీల కారణంగా ఠాణాలు చిత్రహింసల కార్ఖానాలుగా వర్ధిల్లుతున్నాయి. పోలీసులను ప్రజలకు నిజమైన రక్షకులుగా మలచడానికి జాతీయ పోలీస్ కమిషన్ నలభై ఏళ్ల నాడే విస్తృత సూచనలు చేసింది. వాటితో పాటు ఆ తరవాత ఏర్పాటైన పలు సంఘాల సిఫార్సుల్లో అత్యధికం అటకెక్కాయి. ధూర్త రాజకీయాల చెర నుంచి ఖాకీ యంత్రాంగానికి స్వేచ్ఛ లభించాలంటే- సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవాలి. పోలీసుల్లో జవాబుదారీతనానికి ప్రోదిచేసేలా సమగ్ర సంస్కరణలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబాటు చాటితేనే- కరకు లాఠీల కింద కడతేరిపోతున్న పౌరహక్కులు జీవం పోసుకుంటాయి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్