మతోన్మాదమే ప్రథమ శత్రువు
మలబారు తీరం నుంచి మొదలుపెట్టి దక్షిణాదిని చుట్టేస్తూ చాపకింద నీరులా యావద్భారతం విస్తరించిన అతివాద ఇస్లామిక్ సంస్థ- పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ). మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ పన్నెండేళ్ల నాడు
మలబారు తీరం నుంచి మొదలుపెట్టి దక్షిణాదిని చుట్టేస్తూ చాపకింద నీరులా యావద్భారతం విస్తరించిన అతివాద ఇస్లామిక్ సంస్థ- పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ). మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ పన్నెండేళ్ల నాడు కేరళకు చెందిన ప్రొఫెసర్ టీజే జోసెఫ్ చేతిని కొందరు నరికేశారు. ఆ దురాగతానికి బాధ్యులుగా ముప్ఫై మందికి పైగా పీఎఫ్ఐ సభ్యులపై అభియోగాలు నమోదయ్యాయి. ఆ సంస్థతో అనుబంధం కలిగిన వ్యక్తులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రతండాల తరఫున పోరాడటానికి సిరియా వెళ్ళినట్లు ఆ తరవాత వెలుగుచూసింది. ముస్లిం యువత మెదళ్లలో విద్వేష విషాన్ని నూరిపోస్తూ, మారణాయుధాల ప్రయోగంలో వారికి పీఎఫ్ఐ శిక్షణ ఇస్తున్నట్లు కొన్నేళ్లుగా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సంస్థను నిషేధించాలనే డిమాండ్లూ ఎప్పటినుంచో వినవస్తున్నాయి. పదిహేను రాష్ట్రాలు, 93 ప్రాంతాల్లో సోదాలు, వందకు పైగా అరెస్టులతో జాతీయ నేరపరిశోధన సంస్థ (ఎన్ఐఏ) నాలుగు రోజుల క్రితం నిర్వహించిన భారీ ఆపరేషన్- పీఎఫ్ఐకి శరాఘాతమైంది. తమపై ఆధారరహిత ఆరోపణలతో భయోత్పాతాన్ని సృష్టించడమే ఎన్ఐఏ లక్ష్యమని దాడుల అనంతరం పీఎఫ్ఐ స్పందించింది. కానీ, తమవారి అరెస్టులను నిరసిస్తూ కేరళలో ఆ సంస్థ తలపెట్టిన హర్తాళ్ హింసాత్మకమైంది. పీఎఫ్ఐ మూకలు వీధుల్లో విచ్చలవిడిగా వీరంగమాడాయి. లక్షిత వర్గాలపై తమిళనాడులో పెట్రోలు బాంబులు పడ్డాయి. అసహాయులకు సేవచేస్తూ ప్రజాస్వామ్యంకోసం పోరాడుతున్నామంటున్న పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థల హింసోన్మాదాన్ని ఆయా ఘటనలు బట్టబయలు చేస్తున్నాయి. రహస్య అజెండాతో సామాజిక అశాంతికి పాదులుతీస్తున్న ప్రతీపశక్తుల కట్టడికి కేంద్రం నడుంబిగించడం హర్షణీయం. జాతీయ భద్రతకు విఘాతకరమైన వాళ్లందరిపైనా ఉక్కుపాదం మోపి తీరాల్సిందే!
పీఎఫ్ఐ మూలాలు బాబ్రీ మసీదు కూల్చివేతలో ఉన్నాయి. ఆ తరవాత ముస్లిముల ప్రయోజనాల పరిరక్షణ కోసమంటూ 1993లో కేరళలో నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ పుట్టుకొచ్చింది. క్రమంగా అక్కడ బలంగా వేళ్లూనుకొంది. కర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ, మనితా నీతి పసరాయ్ (తమిళనాడు) సంస్థలను జతచేసుకొని ఒకటిన్నర దశాబ్దాల క్రితం అదే పీఎఫ్ఐగా ఆవిర్భవించింది. ఆపై మూడేళ్లలో గోవా, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, మణిపుర్లకు చెందిన వివిధ సంస్థలు అందులో విలీనమయ్యాయి. 22 రాష్ట్రాల్లో కార్యాలయాలు, నాలుగు లక్షల మంది సభ్యులు, అంతకు ఎన్నో రెట్ల సంఖ్యలో సానుభూతిపరులు, భూరి నిధులతో- నేడు అతిశక్తిమంతమైన సంస్థగా పీఎఫ్ఐ ఎదిగింది. పవిత్ర యుద్ధం ద్వారా ఇండియాలో ఇస్లామిక్ రాజ్యాన్ని నెలకొల్పేందుకు అది కుట్రలు పన్నుతోందని ఎన్ఐఏ ప్రకటించింది. నిషేధిత ముష్కర మూక ‘సిమి’కి మరో రూపమే పీఎఫ్ఐ అని కేరళ సర్కారు ఉన్నత న్యాయస్థానానికి 2012లోనే సమాచారమిచ్చింది. పాత కథనాల ప్రకారం- బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రసంస్థ ‘ఏబీటీ’తో పీఎఫ్ఐకి సంబంధాలున్నాయి. పలు రాష్ట్రాల్లో దానిపై వందల కేసులు నమోదయ్యాయి. ముస్లిముల రక్షణకు పాటుపడుతున్నామంటున్న ఆ సంస్థ- అతివాద భావజాల ప్రచారంతో నిజానికి వారికి అన్యాయమే చేస్తోంది. దాని చట్టవ్యతిరేక కార్యకలాపాలను ముస్లిం నేతలే గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అల్ప సంఖ్యాక వర్గాలను అభద్రతలోకి నెట్టే ఆధిపత్య దుర్రాజకీయాలే అమాయకులను ఇటువంటి ప్రమాదకర సంస్థల ఉచ్చులోకి నెడుతున్నాయంటున్న వారి ఆందోళన సహేతుకమైనదే. మతోన్మాదం ఏదైనా సరే- సౌభ్రాతృత్వాన్ని కబళిస్తూ, దేశాభివృద్ధిని దిగమింగేస్తుంది. ఆ కాలనాగు కోరలకు భారతావని బలికాకుండా కాచుకోవడం- ఆలోచనాపరులూ పాలకుల కనీస బాధ్యత!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!