Cyber Crime: ఇంటికో కాల్‌సెంటర్‌.. కాటేసే కాల్‌నాగులు

దోచుకోవడం వారికి కొత్తకాదు. కాలంతోపాటూ దాని రూపు మార్చారంతే! తరతరాలుగా వస్తున్న దోపిడీలకు ఆధునిక హంగులు అద్దారు. కాలు కదపకుండానే లూటీలు చేయడంలో రాటుదేలారు. తమ తాతలు దారి దోపిడీల్లో ఆరితేరితే వారి ...

Updated : 19 Oct 2021 00:46 IST

దారిదోపిడీల్లో ఆరితేరిన తాతలు
ఆన్‌లైన్‌ మోసాల్లో వారసులు  
పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు
సాంకేతికతలో మాత్రం దిట్టలు    
వలసాల వీరభద్రం

భరత్‌పుర్‌ నుంచి ఈనాడు ప్రతినిధి

దోచుకోవడం వారికి కొత్తకాదు. కాలంతోపాటూ దాని రూపు మార్చారంతే! తరతరాలుగా వస్తున్న దోపిడీలకు ఆధునిక హంగులు అద్దారు. కాలు కదపకుండానే లూటీలు చేయడంలో రాటుదేలారు. తమ తాతలు దారి దోపిడీల్లో ఆరితేరితే వారి వారసులు ఆన్‌లైన్‌ మోసాలతో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అందుకే.. ఆయుధాలకు బదులు వారి చేతుల్లోకి ఆధునిక ఫోన్లు చేరాయి. ఆన్‌లైన్‌ సాక్షిగా దోపిడీలు దేశవ్యాప్తమయ్యాయి. ఇదీ కాల్‌నేరాలకు కేంద్రంగా మారిన రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ జిల్లాలో పరిస్థితి. మేవాడ్‌ ప్రాంతం అనాదిగా దోపిడీలకు పేరుగాంచింది. టట్లూబాజీ ముఠాల దారి దోపిడీలు ఇక్కడ నిత్యకృత్యం. వాహనదారులను బెదిరించి వాహనాలను ఎత్తుకుపోయి అమ్ముకునేవారు. జనం అటుగా రాకపోకలు మానేయడంతో వ్యూహం మార్చారు. ‘లంకె బిందెలు దొరికాయి, తక్కువ ధరకు బంగారం అమ్ముతాం’ అంటూ ఫోన్లు చేసి ఎరవేయడం మొదలుపెట్టారు. నమ్మి వెళ్లిన వారిని బంధించి, తెచ్చిన నగదు దోచుకునేవారు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి తమ ఖాతాల్లో మరికొంత డబ్బు వేసిన తర్వాతే బందీలను వదిలేవారు. ఈ మోసం కూడా జనానికి తెలియడంతో ‘బంగారాన్ని’ నమ్మడం మానేశారు. దాంతో ‘కాల్‌ మోసాలను’ ఎంపిక చేసుకున్నారు. ఫలానా బహుమతి వచ్చింది, పన్ను చెల్లిస్తే మీకే సొంతమవుతుందని ఫోన్‌ చేసి దోచుకోవడంతో ఆరంభమైన మోసాల పరంపర రోజుకో రూపం మార్చుకుంటోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్‌ మోసాల్లో మూడొంతులు భరత్‌పుర్‌లోనివే.

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఖాతా ఖాళీ
చాలా పకడ్బందీగా, కార్పొరేట్‌ తరహాలో సాగుతున్న ఈ మోసాల వెనుక పెద్ద తతంగమే ఉంటుంది. మోసం చేయాలంటే ముందు బాధితుల వివరాలు కావాలి. దేశవ్యాప్తంగా వ్యక్తిగత ఫోన్‌ నంబర్లు సేకరించి అమ్మే ముఠాలు ఉన్నాయి. వీరి నుంచి టట్లూబాజీ ముఠాలు సమాచారం కొంటాయి. ఫోన్‌ నంబరు మాత్రమే దొరికినప్పుడు బహుమతి వచ్చిందని ఎరవేస్తారు. బ్యాంకు ఖాతా వివరాలు తెలిస్తే బ్యాంకు సిబ్బంది మాదిరిగా కాల్‌ చేస్తారు. తమ వివరాలన్నీ చెబుతుండే సరికి బ్యాంకు నుంచి వచ్చిన కాల్‌గానే భావించి చాలామంది ఓటీపీ చెప్పేస్తారు. వెంటనే ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఓఎల్‌ఎక్స్‌లో వస్తువులు అమ్ముతామనో లేదా అందులో పెట్టిన వస్తువులు కొంటామనో చెబుతూ క్యూఆర్‌కోడ్‌ ద్వారా ఖాతా ఖాళీ చేస్తుంటారు. ఇంకా అనేక రకాలుగా మోసాలు చేస్తున్న ఈ ముఠాలు భరత్‌పుర్‌లో వేలాదిగా కనిపిస్తాయి.


టట్లూ కాట్నా

ఫోన్‌ ద్వారా దోచుకోడానికి వారు పెట్టిన పేరు టట్లూ కాట్నా. టట్లూ అంటే పట్టుకోవడం.. కాట్నా అంటే కోసేయడం. ఒక్కో గ్రామంలో దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఓ కాల్‌సెంటర్‌ నడుస్తుంది. ఊళ్లోకి వచ్చే ధైర్యం పోలీసులకు ఉండదు కనుక ఇంటినే డెన్‌గా మార్చుకున్నారు. పోలీసులొచ్చినా పట్టుబడకుండా కొన్ని ఇళ్లలో నేలమాళిగలు ఉంటాయి.


శ్మశానవాటికలోనూ పాగా 

ఎల్‌ఎక్స్‌ మోసాలకు పేరుగాంచిన నకల్‌కుందన్‌ ప్రాంతంలో ‘ఈనాడు’ పర్యటించినప్పుడు ఊరి శివార్లలో చెట్లకింద గుంపులుగా నేరగాళ్లు కనిపించారు. చివరకు శ్మశాన వాటికనూ కాల్‌సెంటర్‌గా మార్చుకున్నారు. నలుగురైదుగురు కలిసి ఒక బృందంగా ఏర్పడతారు. మాటకారితనం ఉన్నవారు బాధితులకు ఫోన్లు చేస్తారు. మాయమాటలతో బురిడీ కొట్టిస్తారు. వారు ఖాతా వివరాలు చెప్పగానే పక్కనున్న వ్యక్తి ఆ ఖాతా తెరిచి దిల్లీ, జైపూర్‌ వంటి ప్రాంతాల్లోని తమవారి ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఇలా రోజుకు రూ. నాలుగైదు లక్షలు సంపాదించిన సందర్భాలు కూడా ఉన్నాయని గడీజీత్‌పట్టీ గ్రామానికి చెందిన ఓ నేరగాడు వెల్లడించాడు.


నకిలీ ఖాతాలు.. సిమ్‌లు

దొంగ చిరునామాతో సిమ్‌కార్డుల్ని సమకూర్చుకుంటారు. ఈ ప్రాంతానికి చెందిన లారీలు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి నుంచి పెద్దసంఖ్యలో వాటిని తెప్పించుకుంటారు. అలాంటి ముఠాలు అక్కడ చాలా ఉంటాయి.

వీరికి నకిలీ బ్యాంకు ఖాతాలు సమకూర్చే ముఠాలు కూడా ఉన్నాయి. జిరాక్స్‌ కేంద్రాలే వీటికి అడ్డాలు. ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు జిరాక్స్‌ కోసం వచ్చినప్పుడు అదనంగా కొన్ని కాపీలు తీసి పెట్టుకుంటారు. ఆ వివరాలతో ఏదో ఒక ఫొటో పెట్టి బ్యాంకు ఖాతా తెరుస్తారు. బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉంటుంది.

ఖేత్వాడ్‌ తాలూకా కేంద్రంలో జనాభా 14,000 కాగా అక్కడి ఓ బ్యాంకులో ఖాతాల సంఖ్య అంతకుమించి ఉందంటే పరిస్థితి అర్థమవుతుంది. గ్రామాల్లో తిరిగే ముఠాలు ఆధార్‌కార్డు, పాన్‌కార్డు ఇస్తే తక్కువ వడ్డీకి రుణాల పేరుతో వివరాలు సేకరించి, వాటి సాయంతో బ్యాంకు ఖాతాలు తెరుస్తుంటాయని బీలంకా గ్రామానికి చెందిన మన్‌జీత్‌ అనే ఓ ఉద్యోగి వెల్లడించారు.

ప్రజల సౌకర్యార్థం రాజస్థాన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ-మిత్ర పోర్టల్‌ కూడా దోపిడీ ముఠాలకు ఊతంగా మారింది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు బ్యాంకులను ప్రభుత్వం దీనికి అనుసంధానం చేసింది. బిల్లులు, పరీక్షల ఫీజుల వంటివి దీని ద్వారా చెల్లించవచ్చు. ఈ సెంటర్లకు వచ్చే వారికి డబ్బు ఆశచూపి, సిబ్బంది సాయంతో ఖాతాలు తెరుస్తున్నారు.

వీరంతా చదువుకున్నవాళ్లేం కాదు.. కానీ మోసాలకు సంబంధించిన సాంకేతిక అంశాల్లో వీరి తెలివి అపారం. యూట్యూబ్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని పెంచుకుంటుంటారు. ఏమాత్రం తొట్రుపడకుండా ఖాతాదారులను ఎలా బురిడీ కొట్టాలో నేర్చుకుంటారు. నాలుగైదు ఇంగ్లిషు ముక్కలే మాట్లాడి తర్వాత హిందీలోకి వస్తారు.


హైదరాబాద్‌ బంగారు గని

‘‘దక్షిణాదిలో ఆన్‌లైన్‌ లావాదేవీలు ఎక్కువ. అందుకే మాకు అక్కడే ఎక్కువ గిట్టుబాటవుతుంది. ముఖ్యంగా హిందీ తెలిసి ఉండటంతో హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెడుతుంటాం’’      

- ఖేత్వాడ్‌కు చెందిన ఓ నేరగాడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని