Indian Army: డ్రాగన్‌కు దీటుగా..!

కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్‌కు దీటుగా సమాధానమిచ్చేందుకు భారతసైన్యం సిద్ధమైంది. సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుందుడుకు చర్యకు పాల్పడినా తిప్పికొట్టేందుకు సన్నద్ధమైంది. ముఖ్యంగా గల్వాన్‌

Updated : 20 Oct 2021 17:03 IST

చైనా సరిహద్దుల్లో భారత్‌ వ్యూహం

యుద్ధం వచ్చినా ఎదుర్కొనేలా సర్వసన్నద్ధం

వలసాల వీరభద్రం

(అరుణాచల్‌ప్రదేశ్‌లోని రూపా సైనిక కేంద్రం నుంచి ఈనాడు ప్రతినిధి)

కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్‌కు దీటుగా సమాధానమిచ్చేందుకు భారతసైన్యం సిద్ధమైంది. సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుందుడుకు చర్యకు పాల్పడినా తిప్పికొట్టేందుకు సన్నద్ధమైంది. ముఖ్యంగా గల్వాన్‌ ఘటన తర్వాత గత సంవత్సర కాలంలో చైనా సరిహద్దుల్లో భారత్‌ తన కార్యకలాపాలను ఉద్ధృతం చేసింది. వ్యూహాత్మక ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించడానికి అదనంగా సాధన సంపత్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని అత్యంత కీలకమైన ఈస్ట్రన్‌ సెక్టార్‌లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో పర్యటించిన ‘ఈనాడు’ ప్రతినిధి భారత సైన్యం చేపట్టిన చర్యలపై అందిస్తున్న ప్రత్యేక కథనం.

బహుముఖ వ్యూహం

‘చేయి చాస్తే స్నేహహస్తం ఇస్తాం. ఆయుధం ఎక్కుపెడితే ఆయుధంతోనే సమాధానం చెబుతాం’ ఈస్ట్రన్‌ సెక్టార్‌లోని కీలక మిస్సమారి స్థావరంలో పనిచేస్తున్న ఓ తెలుగు మేజర్‌వ్యాఖ్య ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.  ముఖ్యంగా గల్వాన్‌ సంఘటన భారతసైన్యం దృక్పథంలో మార్పు తీసుకొచ్చింది. ఆత్మరక్షణ వ్యూహాన్ని పక్కనపెట్టి ఏ క్షణమైనా కదనరంగంలోకి దిగేంతగా సన్నద్ధతను పెంచింది. ఇప్పటికే వేల బలగాలను సరిహద్దులకు తరలించింది. ఎత్తయిన కొండలను అవలీలగా ఎక్కగలిగే సిబ్బందితో కూడిన మౌంటెయిన్‌ స్ట్రైక్‌ కోర్‌ను మోహరించింది. ఇది మొదటి ఎత్తు. సరిహద్దులకు దగ్గర్లో ఉన్న అన్ని ఫార్వర్డ్‌ ఆపరేషనల్‌ బేస్‌ను(ఎఫ్‌వోబీలను) అప్రమత్తం చేసింది. అత్యాధునిక రాడార్లు, మానవరహిత విమానాలు పెద్దసంఖ్యలో కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక అవసరాలకు తగ్గట్టు అదనంగా మందుగుండు, ఆహారం, చమురు నిల్వ చేసేందుకు భూగర్భ గోదాములను ఏర్పాటు చేస్తోంది. శీతాకాలం వస్తే దాదాపు ఆరు నెలలపాటు కొన్ని ప్రాంతాలకు అన్ని రకాల సరఫరాలు నిలిచిపోతాయి. దీంతో వచ్చే మార్చి నెల వరకూ అన్ని రకాల నిల్వలను ఇప్పటికే తరలించింది.

* ఈస్ట్రన్‌ కమాండ్‌లో పెద్దసంఖ్యలో తేలికపాటి శతఘ్నులను ఎత్తయిన ప్రాంతాల్లో మోహరించింది. ఆధునిక యుద్ధతంత్రంలో భాగంగా పదాతి దళ, శతఘ్ని, ట్యాంకు, గగనతల రక్షణ తదితర విభాగాలన్నీ కలిపి ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్‌ బ్యాటిల్‌ గ్రూప్‌ (ఐబీజీ) పేరుతో కొత్త వ్యవస్థను రూపొందిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చినూక్‌ హెలికాప్టర్లు భారతసైన్యం ఆత్మస్థయిర్యాన్ని పెంచాయి. శత్రుదేశాల రాడార్లను ఏమార్చి పెద్దసంఖ్యలో బలగాలు, ఆయుధాలు, శతఘ్నులను కూడా వీటి ద్వారా తరలించవచ్చు.

ఈస్ట్రన్‌ కమాండ్‌ కీలకం

చైనా సరిహద్దుల్లో ఈస్ట్రన్‌ సెక్టార్‌ అత్యంత కీలకమైంది, పెద్దది. పాకిస్థాన్‌, భారత్‌, చైనాలు కలిసే ట్రై జంక్షన్‌ నుంచి గయ శిఖరం వరకూ ఉన్న సరిహద్దు పొడవు 832 కిలోమీటర్లు. గయ శిఖరం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌, నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న లిపులే వరకూ ఉన్న మిడిల్‌ సెక్టార్‌ పొడవు 545 కిలోమీటర్లు. అక్కడి నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లో.. మయన్మార్‌, చైనా సరిహద్దుల్లోని జాచేపా వరకూ ఉన్న సరిహద్దు పొడవు 1346 కిలోమీటర్లు. ఇదంతా ఈస్ట్రన్‌ సెక్టార్‌ కిందికే వస్తుంది. దీన్ని నాలుగు విభాగాలుగా చేసి పర్యవేక్షిస్తున్నారు.

బలగాలు ఎప్పుడంటే అప్పుడు ఇక్కడికి చేరుకోవడం కష్టం. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తేజ్‌పూర్‌, గువహటిల నుంచి రోడ్డు మార్గంలో బలగాలు చేరుకోవాలంటే కనీసం 8 గంటలు పడుతుంది. పైగా ఈ సెక్టార్‌ అంతా కొండలు, లోయలతో నిండి ఉంది. ప్రయాణం కూడా సురక్షితం కాదు.

కొత్త వ్యక్తి కనిపిస్తే పట్టేస్తాయ్‌

సరిహద్దుల్లో కొత్త వ్యక్తి కనిపిస్తే కంప్యూటర్లే అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని భారతసైన్యం సొంతంగా అభివృద్ధి చేసి వినియోగిస్తోంది. ఇందుకోసం కీలకమైన ప్రాంతాల్లో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేశారు. లక్షల మంది స్థానిక ప్రజల చిత్రాలను ముందుగానే సేకరించి నిక్షిప్తం చేశారు. తద్వారా కొత్త వ్యక్తులను కంప్యూటర్‌ దానంతట అదే గుర్తించి అప్రమత్తం చేస్తుంది.

నిరంతరం నిఘా

వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీకి) ఆవల కదలికలను పసిగట్టేందుకు సైన్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైమానిక విభాగం నిరంతరం నిఘా నిర్వహిస్తోంది. ఇందుకోసం ఇజ్రాయెల్‌ నుంచి దిగుమతి చేసుకున్న మానవరహిత విమానం ‘హెరాన్‌’ను వినియోగిస్తోంది. ఇది దాదాపు 250 కిలోమీటర్ల పరిధిలో పర్యటిస్తూ గుట్టుచప్పుడు కాకుండా సమాచారం సేకరిస్తుంది. దీంతోపాటు చిన్నచిన్న బృందాలతో గగనతల గస్తీ నిర్వహించడానికి చీతా, సరిహద్దుల్లో పనిచేస్తున్న బలగాలకు ఆహారం, ఆయుధాల సరఫరాకు ధ్రువ్‌, అవసరమైతే దాడి చేయడానికి ఆయుధాలు బిగించి  మెరుగుపరిచిన రుద్ర హెలికాప్టర్లను  వినియోగిస్తోంది.


ఆయుధాలు అందిస్తుంది

దుర్గమ ప్రాంతంలో పహారా కాసే సైనికులకు ఆహారం, మందుగుండు సరఫరా చేయడం చాలాకష్టం. దీని కోసం కొత్తగా ‘ది గైడెడ్‌ ప్రెసిషన్‌ ఏరియల్‌ డెలివరీ సిస్టం (జి ప్యాడ్‌)’ను దిగుమతి చేసుకున్నారు. సైనికులున్న ప్రాంత అక్షాంశ, రేఖాంశాల వివరాలు ఇందులో నిక్షిప్తం చేస్తారు. 990 కిలోల బరువు వరకూ వస్తువులను ఇందులో నింపవచ్చు. హెలికాప్టర్‌ ద్వారా దీన్ని గాలిలో వదిలేస్తే 28 కిలోమీటర్ల పరిధిలో, ముందుగానే నిక్షిప్తం చేసిన సమాచారం ఆధారంగా అది సైనికులుండే చోట దిగుతుంది. సరిహద్దుల్లో ప్రతి చిన్న కదలికను గమనించేందుకు ఆరు నెలల క్రితం ఏరోస్పేస్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రాడార్లు ఎక్కువ ఎత్తులో ఎగిరే వాటిని మాత్రమే గుర్తిస్తాయి. ఈ కేంద్రం ప్రత్యేకంగా 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఎగిరే లోహ విహంగాలను ఈ కేంద్రం పసిగడుతుంది. ఇది 24 గంటలూ, 365 రోజులూ పనిచేస్తుంది.


ఆ వాహనం ఆకాశం నుంచి జారిపడుతుంది

యుద్ధతంత్రంలో వస్తున్న ఆధునిక మార్పులను సైన్యం అనుసరిస్తోంది. శత్రుదేశంలో మెరుపు దాడుల వంటి వాటిని వేగవంతంగా పూర్తి చేసేందుకు ఆకాశం నుంచి జారవిడవడానికి అనువైన ఆధునిక వాహనం ‘లైట్‌ స్ట్రైక్‌ వెహికిల్‌’ను సమకూర్చుకుంది. విమానం ద్వారా పారాచూట్‌కు కట్టి ఈ వాహనాన్ని అనుకున్న ప్రదేశంలో జారవిడవవచ్చు. ప్రత్యేక శిక్షణ పొందిన సైనికులు కూడా పారాచూట్ల సాయంతో దిగవచ్చు. ఇందులో ట్యాంకు విధ్వంసక గైడెడ్‌ క్షిపణి, రెండు మీడియం మెషిన్‌గన్లు ఉంటాయి. ఆరుగురు సైనికులు ప్రయాణించవచ్చు.


దీటైన సమాధానం చెబుతాం

సరిహద్దుల్లో శాంతి సామరస్యాలే ముఖ్యం. ప్రత్యర్థులు దుడుకు చర్యలకు దిగితే దీటుగా సమాధానం చెబుతాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. గతంతో పోల్చుకంటే చైనా తమ వార్షిక సైనిక విన్యాసాల నిడివి పెంచింది. బలగాలను ఎక్కువకాలం సరిహద్దుల వద్ద కొనసాగిస్తోంది. తూర్పు సరిహద్దుల్లో కొత్తగా ఆవాస ప్రాంతాలను నిర్మిస్తోంది. వాటిలో ప్రజలు ఉంటున్నారా, లేరా అన్నది పక్కన పెడితే ఇదంతా వ్యూహాత్మక అంశం. సరిహద్దులకు సంబంధించిన సున్నితమైన అంశాల్లో మా అభ్యంతరాలను ఎప్పటికప్పుడు చైనాకు తెలుపుతున్నాం. చైనా వైపు నుంచి సైనిక అవసరాల కోసం మౌలిక సదుపాయాల కల్పన బాగా పెరిగింది. మన వైపున కూడా అంతే దీటుగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఎక్కువగా దృష్టి పెట్టాం.

- మనోజ్‌ పాండే, ఈస్ట్రన్‌ ఆర్మీ కమాండర్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని